కాంగ్రెస్ ఎమ్మెల్యే అసెంబ్లీకి పోతే బడికి పోయొచ్చినట్లుందట..
posted on Oct 14, 2020 @ 7:51PM
తెలంగాణాలో రెండు రోజుల పాటు నిన్న, ఈరోజు అసెంబ్లీ సమావేశాలు జరిగిన సంగతి తెల్సిందే. ఈ సమావేశాల పై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందిస్తూ.. తనకు మాత్రం ప్రజా సమస్యలపై చర్చించడానికి అసెంబ్లీకి వెళుతున్నట్లుగా లేదని, స్కూలు కు పోయి హెడ్మాస్టర్ చెప్పే పాఠాలు విని వస్తున్నట్లుగ అనిపిస్తోందని జగ్గారెడ్డి అన్నారు. భారీ వర్షాలతో ఒకపక్క పంటలు నష్టపోయి రైతులు, మరోపక్క హైదరాబాద్ నగరం మునిగిపోయి ప్రజలు ఇబ్బంది పడుతుంటే.. అసెంబ్లీలో ఆ అంశాలపై అసలు చర్చే లేదని ప్రభుత్వ తీరును అయన తీవ్రంగా విమర్శించారు. శాసనసభ నిరవధిక వాయిదా పడిన తర్వాత మీడియా పాయింట్లో మాట్లాడుతూ ‘‘అసెంబ్లీ ఎప్పుడు పెడతరో.. ఎప్పుడు బంద్ జేస్తరో తెలియట్లేదు. బీఏసీ సమావేశాలు లేవు.. అజెండాలూ లేవు. ఈ రాష్ట్రంలో చాలా చిత్రమైన పాలన నడుస్తోంది’’ అని ఆయన ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కనీసం తమ నియోజకవర్గాల్లోని రైతుల ఇబ్బందుల గురించీ కూడా సభలో ప్రస్తావించలేదన్నారు. అంతేకాకుండా ఆ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు.. చదువు వచ్చిన వేలుముద్రగాళ్లుగా మారారని అయన తీవ్రంగా విమర్శించారు. ప్రజల సమస్యలు ఏమాత్రం పట్టించుకోకుండా కేవలం బిల్లులను ఆమోదించుకునేందుకే ప్రస్తుత శాసనసభ సమావేశాన్ని పెట్టారని, అసలు ఆ బిల్లులపైన కూడా చర్చించలేదని అయన విమర్శించారు.
అసలు ఇంత హడావుడిగా జీహెచ్ఎంసీ చట్టానికి సవరణలు తేవాల్సిన అవసరం ఏమొచ్చిందని జగ్గారెడ్డి ప్రశ్నించారు. హైదరాబాద్ విశ్వనగర అభివృద్ధికి రూ.72 వేల కోట్లు ఖర్చు చేశామని సీఎం కేసీఆర్ అంటున్నారని, అయితే ప్రస్తుత పరిస్థితి చూస్తే.. దాన్ని నమ్మేట్లుగా ఉందా? అని నిలదీశారు. హైదరాబాద్లో వేల కోట్లు ఖర్చు చేశారన్న కూకట్పల్లి ఎమ్మెల్యే.. తన నియోజవర్గంలో జరిగిన అభివృద్ధి ఎక్కడో చూపాలన్నారు. హైదరాబాద్లో ఫ్లై ఓవర్లన్నీ రాజశేఖర్రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్రెడ్డి హయాంలో కట్టినవేనన్నారు. కాంగ్రెస్ హయాంలో ప్రారంభించి.. తెలంగాణ ఉద్యమం వల్ల నిలిచిపోయిన పనులను ఇప్పుడు పూర్తి చేసి ప్రారంభిస్తున్నారన్నారు. గడ్డిపోచ తప్పు చేస్తే.. ఏకంగా గడ్డిమోపునే తగలబెట్టిన చందంగా ధరణి వ్యవహారం ఉందని ఆయన విమర్శించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజల ఆస్తులను తీసుకొచ్చి ప్రయివేటు యాప్లో పెట్టి ఏం చేస్తారని అయన సర్కారు ని ప్రశ్నించారు. ‘‘కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చిన్న సమస్యలకు కూడా సీఎం దగ్గరికి వెళ్లి నిలదేసేవాళ్లు. ప్రస్తుత అసెంబ్లీతో ప్రజలకు ఏమాత్రం మేలు జరగదు. దుబ్బాక ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిని ఓడించి సీఎం కేసీఆర్కు దెబ్బ కొడితే అపుడు ఆయన ప్రజల వద్దకు వస్తడు. అలాకాకుండా రూ. 5 వేలే తీసుకుని ఓటేశారో ఆ డబ్బులతోనే బతకాల్సి వస్తది అని అయన ప్రజలను హెచ్చరించారు.