సురక్షితంగా తల్లితో పాటు బయటపడిన చిన్నారి!
posted on Apr 27, 2020 @ 9:39AM
పాజిటివ్ రాకపోయినా ఆ చిన్నారి తల్లితో పాటు ఉండాల్సిన దుస్థితి ఏర్పడింది. తల్లి, పెద్దమ్మకు కరోనా పాజిటివ్ రావడంతో 18 రోజుల పాటు ఐసోలేషన్ గదిలో ఉండాల్సి వచ్చింది ఆ చిన్నారికి. వైద్యులు తీసుకున్న జాగ్రత్తలతో పాటు శరీరంలో ఉన్న రోగ నిరోధక శక్తి కారణంగా ఆ చిన్నారిని కరోనా వైరస్ ఏమీ చేయలేకపోయింది. చిత్తూర్ జిల్లా నగరికి చెందిన ఓ వ్యక్తి ఢిల్లీ మత ప్రార్థనాలకు వెళ్లి వచ్చాడు. అధికారులు అతన్ని పరీక్షించగా పాజిటివ్ వచ్చింది.
ఏప్రిల్ 5న తిరుపతిలోని కోవిడ్-19 ఆస్పత్రికి పంపించారు. వారిది ఉమ్మడి కుటుంబం కావడంతో ఏప్రిల్ 6వ తేదీన 20 మంది సభ్యులను క్వారంటైన్కు తరలించారు.
ఏప్రిల్ 7న అక్కడి వారిని పరీక్షించగా ఇద్దరు మహిళలకు పాజిటివ్ వచ్చింది. వారిని ఏప్రిల్ 8న చిత్తూరు కోవిడ్ ఆస్పత్రికి తరలించారు. వారిలో ఒకామెకు ఏడాదిన్నర వయస్సు బాబు ఉన్నాడు. కుటుంబ సభ్యులంతా క్వారంటైన్లో ఉండడంతో చిన్నారి సంరక్షణ బాధ్యతలు చూసేందుకు బంధువులు ముందుకు రాలేదు.
సాంఘిక సంక్షేమ శాఖ సిబ్బందికి బాబు సంరక్షణ బాధ్యతలు అప్పగిద్దామంటే ఆమె ఒప్పుకోలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో తల్లి, పెద్దమ్మతో పాటు ఆ బాలుడు 18 రోజులు ఐసోలేషన్లో ఉన్నాడు.
బాలుడి సంరక్షణ కోసం వైద్యులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. చిన్నారికి న్యూట్రీషియన్ బిస్కెట్లు ఇవ్వడం, బయటి నుంచి ఆవుపాలు తెచ్చివ్వడం వంటివి చేశారు. ఐసోలేషన్లో చేరిన మొదటి రోజు ఒకసారి, డిశ్చార్జి అయ్యే నాలుగు రోజుల ముందు పరీక్షలు చేయగా బాలుడికి నెగిటివ్ రిపోర్టు వచ్చింది. చిన్నారి ముందు కరోనా తలవంచింది.
పూర్తిగా కోలుకోవడంతో వీరిని ఏప్రిల్ 25న చిత్తూరు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. వీరు 14 రోజుల పాటు హోంక్వారంటైన్లో ఉంటారు.