బీజాపూర్ ఎన్కౌంటర్లో 22 మంది జవాన్ల మృతి
posted on Apr 4, 2021 @ 1:28PM
దండకారణ్యం రక్తసిక్తమైంది. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో శనివారం చోటుచేసుకున్న ఎన్కౌంటర్లో చనిపోయిన జవాన్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటి వరకు 22 మంది జవాన్లు మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు. శనివారం ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. తాజాగా మరో 17 మంది జవాన్ల మృతదేహాలను గుర్తించారు. ఎదురుకాల్పుల్లో 31 మంది భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. వారిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిలో 16 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది ఉన్నట్లు సమాచారం. వీరికి బీజాపూర్, రాయ్పూర్ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు.
ఎన్ కౌంటర్ ఘటనలో మొత్తం 21 మంది సిబ్బంది గల్లంతైనట్లు అధికారులు చెబుతున్నారు. వీరిలో ఏడుగురు సీఆర్పీఎఫ్కు చెందిన వారున్నారు. గల్లంతైన వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు ముమ్మరంగా కొనసాగుతోందని నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్స్ బృందం డీజీ అశోక్ జునేజా వెల్లడించారు. బీజాపూర్, సుకుమా జిల్లాల్లోని అడవుల్లో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఘటన నేపథ్యంలో సీఆర్పీఎఫ్ డీజీ కులదీప్ సింగ్ ఆదివారం ఉదయం ఛత్తీస్గఢ్కు చేరుకున్నారు. ఎన్కౌంటర్కు సంబంధించి ప్రస్తుత పరిస్థితులపై ఆయన ఆరా తీస్తున్నారు.
చత్తీస్గఢ్లోని బీజాపూర్లో భారీ ఎన్కౌంటర్ ఘటనపై ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్షా స్పందించారు. అమరులైన జవాన్లకు నివాళి అర్పించారు. అమిత్షా ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ బఘెల్కు ఫోన్ చేసి పరిస్థితిపై ఆరా తీశారు. అంతేకాకుండా ఆ రాష్ట్రానికి వెళ్లి ఆపరేషన్కు సంబంధించిన పరిస్థితులను పర్యవేక్షించాలని సీఆర్పీఎఫ్ డీజీ కులదీప్ సింగ్ను ఆదేశించారు. ‘‘ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టులతో పోరాడుతూ ప్రాణ త్యాగం చేసిన ధీశాలులైన భద్రతా సిబ్బందికి తల వంచి నమస్కరిస్తున్నాను. మీ ధైర్యసాహసాలను, త్యాగాన్ని దేశం ఎన్నటికీ మరువబోదు. అమరులైన జవాన్ల కుటుంబాలకు సానుభూతి తెలుపుతున్నా. శాంతి, అభివృద్ధిలకు ఆటంకం కలిగించే విరోధులతో మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా’’ అంటూ అమిత్ షా ట్వీట్ చేశారు.