సలామ్ చేయలేదని చితకబాదిన ఎంఐఎం ఎమ్మెల్యే.. వైరల్ గా మారిన ఓల్డ్ సిటీ వీడియో
posted on Dec 12, 2021 @ 2:48PM
హైదరాబాద్ ఓల్ట్ సిటీకి చెందిన ఓ ఎమ్మెల్యే రెచ్చిపోయాడు. ఓ యువకుడిని అర్థరాత్రి దుర్బాషలాడుతూ చితకబాదాడు. ఎమ్మెల్యే కోపానికి కారణం ఏంటో తెలుసా.. అతనికి సలాం చేయకపోవడమే. 25 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉన్న నాకే నమస్తే పెట్టవా? అంటూ ఎమ్మెల్యే బరి తెగించాడు. ఓ యువకుడి చెంప పగులగొట్టాడు. ఈ ఘటన హైదరాబాద్ పాతబస్తీ చార్మినార్ ప్రాంతంలో జరిగింది. చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ఖాన్ ఆ దారుణానికి ఒడిగట్టాడు. ఈ సంఘటన హుస్సేనీహాలం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం తెల్లవారుజామున జరిగింది. ఎమ్మెల్యే దాడికి సంబంధించిన సీసీ టీవీ కెమెరా విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. పాతబస్తీ చార్మినార్ బస్టాండ్వద్ద గులామ్గౌస్జిలానీ అనే యువకుడు ఆదివారం తెల్లవారుజామున 12.43 నిమిషాల సమయంలో తన ఇంటి అరుగు ముందు మరో వ్యక్తితో కలిసి కూర్చుని మాట్లాడుతున్నాడు. అదే సమయంలో అటుగా వచ్చిన చార్మినార్ఎమ్మెల్యే ముంతాజ్ అమ్మద్ఖాన్తన గన్మెన్లతో కలిసి అక్కడికి చేరుకున్నాడు. గులామ్గౌస్ జిలాని వద్దకు వచ్చిన ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ఖాన్.. 25 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నా… నాకు సలామ్ పెట్టవా అంటూ దుర్భాషలాడాడు. నేను చూడలేదు అని.. అయినా ఎందుకు సలామ్ పెట్టాలి అని యువకుడు ఎదురు ప్రశ్న వేయడంతో ఆవేశంతో ఊగిపోయిన ఎమ్మెల్యే యువకునిపై దాడి చేశాడు.
ఎమ్మెల్యే గన్మెన్లు ఆ యువకుడిని అక్కడి నుంచి వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తున్నటికి మరో సారి ఎమ్మెల్యే అతనిపైకి వెళ్లి దాడి చేశారు. దాడికి పాల్పడ్డ ఎమ్మెల్యే ఇల్లు.. బాధితుని ఇల్లు సమీపంలోనే ఉండడం.. క్షణాల్లో అప్పటికే ఎంఐఎం కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకోవడంతో చార్మినార్బస్టాండ్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇదంతా అక్కడే ఉన్న సి.సి కెమెరాలో నిక్షిప్తమయ్యింది. ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్ దాడిలో యువకుడు జిలానీ తీవ్రంగా గాయపడ్డాడు. ఎడమ చెవి దవడ భాగంలో గాయాలు అయినట్లు ఉస్మానియా వైద్యులు రిపోర్ట్ ఇచ్చారు. ఎంఐఎం ఎమ్మెల్యే కావడంతో బేంబేలెత్తిపోతున్నారు హైదరాబాద్ పోలీసులు.
బాధితుడు గులామ్గౌస్ జిలానీ తన దాడికి పాల్పడ్డ ఎమ్మెల్యేపై, తనను రివాల్వర్తో షూట్ చేస్తానని ఎమ్మెల్యే బంధువు బెదిరించాడని హుస్సేనిహాలం పోలీస్స్టేషన్లో గులామ్ గౌస్ ఫిర్యాదు చేశాడు. అనంతరం హైదరాబాద్పార్లమెంటు సభ్యులు, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ దృష్టికి తీసుకువెళ్లినట్లు బాధితుడు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి కేసును నమోదు చేసుకున్న హుస్సేనీఆలం పోలీసులు.. బాధితున్ని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.గతంలో జిలానీ సోదరుడికి ఎమ్మెల్యే తనయుడికి మధ్య ఓ ఆస్తి విషయంతో తగాదాలు ఉన్నాయని తెలుస్తోంది.