చార్మినార్ వద్ద మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు హెరిటేజ్ వాక్.. పోలీసుల భారీ బందోబస్తు
posted on May 13, 2025 @ 2:47PM
నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్, చార్మినార్ ప్రాంతం ఇవాళ నిర్మానుష్యంగా కనిపించింది. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు పాతబస్తీలో మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు పర్యటించనున్నారు. ఈ నేపధ్యంలో ఇవాళ మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయి. మదీనా, చార్మినార్, శాలిబండ, వొల్గా జంక్షన్, ఖిల్వత్ రహదారులు పూర్తిగా క్లోజ్ కానున్నాయి. ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచనలు చేశారు. చార్మినార్ వద్ద మూడు కిలోమీటర్ల లోపు ఎలాంటి డ్రోన్లు ఎగరవేయొద్దని ఆంక్షలు విధించారు.
చార్మినార్ వద్ద భారీ భద్రత ఏర్పాటు పోలీసులు చేశారు. హెరిటేజ్ వాక్ కోసం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఒక్కరోజు చిరు వ్యాపారుల దుకాణాలు కూడా మూసివేయించారు. చార్మినార్ వద్ద సుందరీమణులకు గ్రాండ్ వెల్కమ్ కార్యక్రమంలో భాగంగా అక్కడి పరిసరాలను పూలతో అందంగా అలంకరించారు. చార్మినార్ వద్ద భద్రతను స్వయంగా పోలీస్ కమిషనర్ సీవీ. ఆనంద్ పరిశీలించారు. ఇవాళ చార్మినార్ వద్ద పోటీదారుల హెరిటేజ్ వాక్, చౌమొహల్లా ప్యాలెస్లో ఏర్పాటు చేసిన విందులో పాల్గోన్నారు.ప్రపంచ సుందరీమణులు లాడ్ బజార్లో ఎంపిక చేసిన దుకాణాల్లో గాజులు, అలంకరణ వస్తువుల కొనుగోలుకు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు తెలంగాణ పర్యాటక శాఖ అన్ని ఏర్పాట్లతో చార్మినార్ పరిసర ప్రాంతాలు ముస్తాబు చేసింది.