కాల్పుల విరమణ కాదు.. విరామం మాత్రమే.. ప్రధాని మోడీ
posted on May 13, 2025 6:29AM
పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్, తదననంతర పరిణామాలపై ప్రధాని మోడీ జాతి నుద్దేశించి ప్రసంగించారు. పహల్గాం ఉగ్రదాడి అనంతరం ఆపరేషన్ సిందూర్ చేపట్టి పాక్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని తొమ్మిది ఉగ్రస్ధావరాలను భారత ఆర్మీ ధ్వంసం చేసిన అనంతరం పాక్ ప్రతీకార దాడుల నేపథ్యంలో పాకిస్థాన్ తో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అప్రకటిత యుద్ధ వాతావరణం నెలకొంది. అమెరికా తాను మధ్యవర్తిత్వం చేసి యుద్ధాన్ని ఆపేశానంటూ తన భుజాలు తానే చరుచుకుని తనను తానే అభినందించేసుకుంది. మరో వైపు హఠాత్తుగా, బేషరతుగా భారత్ పాక్ తో కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించడం పట్ల దేశ వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. అప్పటి వరకూ నమో జపంతో ఊగిపోయిన దేశంలో ఒక్కసారిగా మోడీపై తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం అయ్యింది. కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు కాల్పుల విరమణ ఒప్పందం చేసుకునే ముందు అఖిలపక్ష నేతలను విశ్వాసంలోకి తీసుకుని ఉండాల్సిందంటూ విమర్శలు గుప్పించాయి. అన్ని విధాలుగా పై చేయి సాధించి పాక్ పై ఒత్తడి తీసుకువచ్చి ఆ దేశ భూభాగంలో తలదాచుకున్న మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల అప్పగింత, పాక్ ఆక్రమిత కాశ్మీర్ స్వాధీనం వంటి అంశాలను ప్రస్తావించకుండా కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించి అమెరికా ఒత్తిడికి మోడీ తలొగ్గారంటూ విమర్శలు వెల్లువెత్తాయి.
ఈ నేపథ్యంలో పహల్గాం ఉగ్రదాడి తదననంతర పరిణామాలప ప్రధాని మోడీ తొలి సారిగా జాతినుద్దేశించి ప్రసంగించారు. ఉద్వేగ భరితంగా, ఘన విజయం సాధించామంటూ ప్రధాని మోడీ ప్రసంగం సాగింది. దాయాది దేశంలోతలదాచుకుని అక్కడ నుంచి దేశం లక్ష్యంగా ఉగ్రదాడులకు పాల్పడుతున్న ముష్కరుణను అణచివేశామని ఉద్ఘాటించారు. ఆపరేషన్ సిందూర్ ఆగదనీ, కాల్పుల విరమణ తాత్కాలిక విరామం మాత్రమేనని విస్పష్టంగా చెప్పారు. ఆపరేషన్ సిందూర్ అంటే.. కే దేశంలోని కోట్లాది మంది మహిళల సిందూరానికి ప్రతీకగా అభివర్ణించారు. శౌర్య పరాక్రమాలను ప్రదర్శించిన భారత సైన్యానికి, సశస్త్ర సీమా బల్కు సెల్యూట్ చేశారు. ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితిలోనూ ఉపేక్షించేది లేదని పునరుద్ఘాటించారు.
ఇక పాకిస్థాన్ తో చర్చలు అంటూ వస్తున్న సూచనలు, వార్తలు, అమెరికా మధ్యవర్తిత్వ ప్రతిపాదనలను ఆయన నిర్ద్వంద్వంగా కొట్టి పారేశారు. పాకిస్థాన్ తో చర్చు అంటూ జరిగితే అది పాక్ ఆక్రమిత కాశ్మీర్ అంశంపైనేనని కుండబద్దలు కొట్టేశారు. ఉగ్రదాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించమన్న ప్రధాని మోడీ.. ఉగ్రవాదుల మూలాలను గుర్తించి ఏరివేస్తామని హెచ్చరించారు. అణ్వాయుధాలను అడ్డు పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేస్తే చూస్తూ ఊరుకోమన్న ఆయన.. కాల్పుల విరమణపై కూడా వివరణ ఇచ్చారు. ఇది యుద్ధాల యుగం కాదన్నారు. అదే సమయంలో ఉగ్రవాదానికి ఈ భూమి మీద స్థానం లేదన్నారు. ఇక జాతి నుద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రధాని మోడీ పాకిస్థాన్ కు ఘాటు హెచ్చరిక పంపారు. తమ భూభాగంలో ఉగ్రవాదాన్ని అంతం చేయకుంటే..పాకిస్థాన్ నే ఉనికిలో లేకుండా చేస్తామని మోడీ విస్పష్ట సందేశాన్ని దాయాది దేశానికి పంపారు.
పహల్గాంలో మతం పేరు అడిగి మరీ అమాయకుల ప్రాణాలు తీశారని, దీనిని ఎట్టి పరిస్థితిలోనూ సహించేది లేదన్నారు. కుటుంబ సభ్యుల ముందే.. అయి న వారిని పొట్టన పెట్టుకున్నారని.. ఇలాంటి వాటిని భారత దేశం ఎట్టి పరిస్థితిలోనూ సహించబోదన్నారు. గత నాలుగు రోజులు గా భారత సైన్యం సంయమనంతో వ్యవహరిస్తోందన్నారు. ఈ వ్యవహారాన్ని ప్రపంచం మొత్తం చూసిందన్నారు.
ఉగ్రవాదులపై దాడులు చేయాల్సిన పాకిస్థాన్.. ఎదురు మనపై దాడులు చేసిందన్న మోడీ. భారత రక్షణ వ్యవస్థ.. పాకిస్థాన్కు తగిన బుద్ధి చెప్పిందన్నారు.ఇండియన్ ఆర్మీ ధాటికి పాక్ తోకముడిచిందనీ, అచేతన స్థితికి చేరుకుందనీ, భారత్ చేస్తున్న దాడులతో పాక్ కు దిమ్మతిరిగి బోమ్మకనిపించిందనీ వ్యాఖ్యానించారు. తాను ముందే చెప్పినట్లు ఉగ్రవాదులకు వారి ఊహకు అందని రీతిలో బుద్ధి చెప్పామన్నారు. అయితే మోడీ జాతి నుద్దేశించి చేసిన ప్రసంగం తరువాత కూడా కాల్పుల విరమణ ఒప్పందానికి భారత్ ఎందుకు అంగీకరించిందన్న విషయంపై జనబాహుల్యంలో నెలకొన్న అనుమానాలు. సందేహాలు అలాగే ఉండిపోయాయి. ఈ సందర్భంగా పాక్ కు గతంలో జరిగిన మూడు యుద్ధాలలో అప్పటి ప్రధానులు ఇందిరా గాంధీ, వాజ్ పేయిలు అగ్రరాజ్యం ఒత్తిడికి, ఆంక్షఁలకు లొంగకుండా నిర్భయంగా, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకున్న విధానాన్ని గుర్తు చేసుకుంటున్నారు.