జడ్జీలపై అనుచిత వ్యాఖ్యల కేసులో మరో నలుగురిపై సీబీఐ చార్జీషీట్
posted on Sep 13, 2021 @ 5:49PM
ఆంధ్రప్రదేశ్ లో కలకలం రేపిన జడ్జీలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో సీబీఐ దూకుడు పెంచింది. సెప్టెంబర్ 1న ఒక చార్జీషీట్ దాఖలు చేసిన సీబీఐ.. తాజా మరో నలుగురిపై వేర్వేరుగా చార్జిషీట్లు దాఖలు చేసింది. ఆదర్శ్ రెడ్డి, కొండారెడ్డి, సాంబశివారెడ్డి, సుధీర్ లపై అభియోగాలు మోపింది. సీబీఐ దాఖలు చేసిన చార్జీషీట్ లో మరో 16 మంది పేర్లు ఉన్నాయి. ఈ కేసులో నిందితులను జులై 27, ఆగస్టు 7 తేదీల్లో అరెస్ట్ చేశారు. విజయవాడ, హైదరాబాదు నగరాల్లో వారిని అదుపులోకి తీసుకుని జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు.
జడ్జిలపై అనుచిత వ్యాఖ్యల కేసులో ఇప్పటి వరకు 11 మందిని విచారించిన సీబీఐ.. లింగారెడ్డి రాజశేఖర్రెడ్డిపై సెప్టెంబర్ 1న ఛార్జిషీట్ దాఖలు చేసింది. విచారణలో భాగంగా జూలై 9న లింగారెడ్డిని సీబీఐ అరెస్టు చేసింది. సీబీఐ అధికారులు కడపలో సోదాలు చేసి పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.
గత ఏడాది ఏపీలో కొందరు న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం న్యాయ వర్గాలను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. తొలుత ఈ వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీఐడీకి అప్పగించగా, సీఐడీ విచారణపై అభ్యంతరాల నేపథ్యంలో హైకోర్టు గతేడాది అక్టోబరు 8న ఈ కేసును సీబీఐకి అప్పగించింది. సీఐడీ నుంచి సమాచారాన్ని స్వీకరించిన సీబీఐ సెప్టెంబరు 11న కేసు నమోదు చేసింది. విచారణలో భాగంగా వరుసగా చార్జీషీట్లను కోర్టులో దాఖలు చేస్తోంది సీబీఐ.