కెనడాలో దారుణం... భారతీయ విద్యార్థి కాల్చివేత
posted on Dec 26, 2025 @ 10:21AM
కలల దేశం కెనడాలో భారతీయ విద్యార్థుల నెత్తురు మరోసారి చిందింది. హిమాన్షి ఖురానా అనే విద్యార్థిని దారుణ హత్యకు గురైన విషాదం నుంచి కోలుకోకముందే.. టొరంటో యూనివర్సిటీ సాక్షిగా మరో ఘోరం జరిగింది. 20 ఏళ్ల భారతీయ విద్యార్థి శివాంక్ అవస్థీని గుర్తు తెలియని దుండగుడు అతి సమీపం నుంచి కాల్చి చంపారు. పట్టపగలే పారిపోయారు. యూనివర్సిటీ ప్రాంగణానికి కూతవేటు దూరంలోనే ఈ కాల్పులు జరగడం అక్కడి ప్రవాస భారతీయులను, ముఖ్యంగా విద్యార్థి లోకాన్ని వణికేలా చేస్తోంది. కెనడాలో ఉన్నత చదువుల కోసం వెళ్లిన భారతీయ విద్యార్థులపై దాడులు ఆందోళనకరంగా మారుతున్నాయి.
తాజాగా టొరంటోలో మరో భారతీయ విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. 20 ఏళ్ల శివాంక్ అవస్థీ అనే యువకుడిని గుర్తు తెలియని దుండగులు టొరంటో విశ్వవిద్యాలయం సమీపంలోనే కాల్చి చంపారు. హిమాన్షి ఖురానా అనే మరో భారతీయ విద్యార్థిని హత్య జరిగిన కొద్దిరోజుల వ్యవధిలోనే ఈ ఘటన చోటుచేసుకోవడం అక్కడి ప్రవాస భారతీయులను, విద్యార్థి లోకాన్ని తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. పోలీసుల సమాచారం ప్రకారం.. 20 ఏళ్ల వయసు కల్గిన శివాంక్ అవస్థీ టొరంటో విశ్వవిద్యాలయం సమీపంలో నడుచుకుంటూ వెళ్తుండగా ఈ ఘాతుకం జరిగింది.
దుండగుడు అతి సమీపం నుంచి శివాంక్పై కాల్పులు జరిపాడు. తీవ్ర రక్తస్రావంతో పడి ఉన్న శివాంక్ను గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పారామెడిక్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక చికిత్స అందించినప్పటికీ.. అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. నిందితులు కాల్పులు జరిపిన వెంటనే అక్కడి నుండి చాకచక్యంగా పరారయ్యారు. కెనడాలో భారతీయులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడులు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
కొద్ది రోజుల క్రితమే హిమాన్షి ఖురానా అనే విద్యార్థిని దారుణంగా హత్యకు గురైంది. ఆ కేసులో దర్యాప్తు కొనసాగుతుండగానే.. ఇప్పుడు శివాంక్ అవస్థీ బలికావడం భద్రతా లోపాలను ఎత్తిచూపుతోంది. కాల్పులు జరిగిన ప్రదేశం విశ్వవిద్యాలయానికి చాలా దగ్గరగా ఉండటంతో విద్యార్థులు బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. ఈ హత్యపై టొరంటో పోలీసులు కేసు నమోదు చేసి లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలంలోని సీసీటీవి ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. నిందితుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.