బుగ్గన చూపు బీజేపీ వైపు?!

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూట‌మి  అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత అభివృద్ధి ప‌నులు వేగంగా జ‌రుగుతున్నాయి. సీఎం చంద్ర‌బాబు నాయుడు పాల‌న‌ను ప‌రుగులు పెట్టిస్తున్నారు. వైసీపీ ప్ర‌భుత్వం హ‌యాంలో జ‌రిగిన అవినీతిని బ‌య‌ట‌పెడుతూనే.. కేద్రం స‌హ‌కారంతో రాష్ట్రంలోని అన్ని రంగాల‌ను అబివృద్ధి చేసేందుకు చంద్రబాబు సర్కార్ వేగంగా అడుగులు వేస్తోంది. మ‌రో వైపు వైసీపీ హ‌యాంలో అధికారాన్ని అడ్డు పెట్టుకొని త‌మ అక్ర‌మ‌ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్త‌రించుకున్న నేత‌ల‌పైనా కూట‌మి ప్ర‌భుత్వం దృష్టి సారించింది. గ‌త ఐదేళ్ల కాలంలో తెలుగుదేశం, జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల‌పై దాడులు చేయించిన వైసీపీ నేత‌ల‌పైనా చ‌ట్ట‌రిత్యా చ‌ర్య‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఈ క్ర‌మంలో వైసీపీలో కొన‌సాగితే ఇబ్బందులు త‌ప్ప‌వని, ఇబ్బందులకు తోడు  రాజ‌కీయం భ‌విష్య‌త్తు లేకుండా పోతుందని భావిస్తున్న కొంద‌రు నేత‌లు ఆ పార్టీని వీడేందుకు రెడీ అవుతున్నారు. అలా వైసీపీని వీడే ఆలోచనలో ఉన్నవారిలో పలువురు మాజీ  మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కూడా ఉన్నార‌ని తెలుస్తోంది. ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం బ‌లంగా ఉండ‌టంతో పాటు.. వైఎస్ ష‌ర్మిల నాయకత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సైతం బ‌లోపేతం అవుతోంది. కాంగ్రెస్ ఏపీలో బ‌ల‌ప‌డితే వైసీపీ చాప్ట‌ర్ క్లోజ్  అన్న అంచనాకు వైసీపీ నేతలు వచ్చేశారు.   దీంతో వైసీపీని వీడి  అవకాశం ఉన్న ఇతర   పార్టీలోకి జంప్ చేసేందుకు  ప్ర‌య‌త్నాలు షురూ చేసినట్లు వైసీపీలోనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడేందుకు సిద్ధ‌మ‌వుతున్న వారిలో మాజీ మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి పేరు గట్టిగా వినిపిస్తోంది. ఎన్నికలు ముగిసిన తర్వాత బుగ్గన కార్యకర్తలకు  అందుబాటులో ఉండ‌టం లేదు.  ఫలితాల తరువాత ఒక్కసారి మాత్రమే ఆయన కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఎక్కువ స‌మ‌యం ఢిల్లీలోనే గ‌డుపుతున్నార‌ని ఆయన అనుయాయులు చెబుతున్నారు.   వైసీపీ హ‌యాంలో ఆర్థిక మంత్రిగా ప‌నిచేసిన బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డికి ఢిల్లీలోని బీజేపీ పెద్ద‌ల‌తో మంచి స‌త్సంబంధాలు ఏర్ప‌డ్డాయి. ప్ర‌స్తుతం వారి ద్వారా బీజేపీలోకి వెళ్లేందుకు బుగ్గ‌న ప్ర‌య‌త్నాలు ప్రారంభించిన‌ట్లు ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో జోరుగా చ‌ర్చ జ‌రుగుతున్నది. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోనూ మాజీ మంత్రికి మైనింగ్, సిమెంట్ వంటి వ్యాపారాలు ఉన్నాయ‌నీ అంటున్నారు. 

గత ఐదేళ్ల కాలంలో ఆర్థిక శాఖను బుగ్గ‌న‌ విధ్వంసం చేశారని ప్ర‌స్తుత ప్రభుత్వం శ్వేతపత్రం కూడా విడుదల చేసింది. ఆర్థిక దోపిడీ జరిగిందని లెక్కలతో సహా సీఎం చంద్ర‌బాబు బయటపెట్టారు. దీంతో రాబోయే రోజుల్లో త‌న‌కు ఇబ్బందులు త‌ప్ప‌వ‌నే అంచనాకు బుగ్గ‌న వ‌చ్చార‌నీ, తెలుగుదేశం ప్ర‌భుత్వం నుంచి ఎదుర‌య్యే ఇబ్బందుల‌ను త‌ప్పించుకోవాలంటే బీజేపీలో చేర‌డం ఒక్క‌టే మార్గ‌మ‌ని ఆయ‌న‌ భావిస్తున్నార‌ు. దీంతో ఆయ‌న బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు ఆయన సన్నిహితులే చెబుతున్నారు. అయితే, బీజేపీవైపు బుగ్గ‌న చూస్తున్నారంటూ వ‌స్తున్న వార్త‌ల‌పై ఆయ‌న‌ అనుచ‌రులతో పాటు వైసీపీ సోష‌ల్ మీడియా ఖండించింది.

అయితే  బుగ్గ‌న మాత్రం మీడియా ముందుకొచ్చి తన పార్టీ మార్పు వార్త‌ల‌ను ఖండించ‌లేదు. దీనికితోడు బుగ్గ‌న తాజా వ్య‌వ‌హార శైలి చూస్తుంటే ఆయన ఇంకెంత మాత్రం వైసీపీలో కొనసాగే అవకాశాలు కనిపించడం లేదని ఆ పార్టీలోనే చర్చ జరుగుతోంది. బుగ్గన వైసీపీని వీడితే జగన్ మైండ్ బ్లాక్ కావడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

Teluguone gnews banner