చెప్పిచ్చుక్కొడతా అంటూ టీడీపీ ఎమ్మెల్సీల పైకి దూసుకెళ్లిన సీనియర్ మంత్రి
posted on Dec 3, 2020 9:13AM
ఏపీలో అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్న సంగతి తెలిసిందే. నిన్న శాసనమండలిలో కూడా ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. "చెప్పిచ్చుక్కొడతా.." అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ, టీడీపీ ఎమ్మెల్సీలు దీపక్రెడ్డి, బుద్దా నాగజగదీశ్వరరావు గురించి చేసిన వ్యాఖ్యలు శాననమండలిలో పెను దుమారం రేపాయి. దీంతో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వివాదమే జరిగింది. ఒకదశలో ఇరుపక్షాల సభ్యులు ఒకరిపై మరొకరు చేయి చేసుకుంటారేమోనన్న పరిస్థితి నెలకొంది. బుధవారం శాసనమండలి ప్రారంభ సమయంలో వాయిదా తీర్మానాలు తిరస్కరించిన తర్వాత టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ దేవదాయ శాఖ మంత్రి తనను ఉద్దేశించి సభలో మంగళవారం చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని కోరారు. దీనిపై మంత్రి బొత్స మాట్లాడుతూ.. ఎవరు, ఏం మాట్లాడారో రికార్డులు పరిశీలించాలన్నారు. అంగవైకల్యాన్ని ఎత్తిచూపడం చట్టవ్యతిరేకమని, మంత్రి బేషరతుగా క్షమాపణ చెప్పాలని మరోపక్క యనమల రామకృష్ణుడు అన్నారు. మండలి చైర్మన్ షరీఫ్ దీనిపై స్పందిస్తూ.. రికార్డులు పరిశీలించి తన నిర్ణయం చెపుతానన్నారు.
అయితే ఆయన రికార్డులు పరిశీలించడానికి వెళ్తుండగా టీడీపీ ఎమ్మెల్సీ దీపక్రెడ్డి లేచి.. కొందరు మంత్రులు సభలో వీధి రౌడీలకన్నా దారుణంగా ప్రవర్తిస్తున్నారన్నారు. దీంతో మంత్రి బొత్స లేచి.. మంత్రులను వీధి రౌడీలు అంటావా? చెప్పిచ్చుక్కొడతా... అంటూ దీపక్రెడ్డి వైపు వేలు చూపిస్తూ ఆగ్రహంతో ఊగిపోయారు. ఇదే సమయంలో టీడీపీ ఎమ్మెల్సీ నాగజగదీశ్వరరావు కలుగజేసుకోవడంతో సభలో ఉద్రిక్తత నెలకొంది.
అయితే కొద్దిసేపు వాగ్వాదం తరువాత మంత్రి బొత్స, దీపక్రెడ్డి, నాగజగదీశ్వరరావు వైపు దూసుకొచ్చారు. దీంతో నాగజగదీశ్వరరావు జోక్యం చేసుకుంటూ.. ‘‘నోర్ముయ్.. చెప్పుచ్చుకుని కొడితే కొట్టించుకోవడానికి ఎవరూ సిద్ధంగా లేరిక్కడ’’ అని మంత్రికి కౌంటర్ ఇచ్చారు. అంతేకాకుండా "రా చూసుకుందాం.. " అంటూ దీపక్రెడ్డి, నాగజగదీశ్వరరావు కూడా బొత్స వైపు దూసుకెళ్లారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. అయితే బొత్సను మరో మంత్రి అప్పలరాజు, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ ఆపే ప్రయత్నం చేశారు. మరోపక్క నాగజగదీశ్వరరావును టీడీపీ ఎమ్మెల్సీలు జనార్దన్ తదితరులు అడ్డుకోవడంతో వివాదం సద్దుమణిగింది.