వరవరరావుకు బెయిల్! ముంబై విడిచి వెళ్లొద్దని షరతు
posted on Feb 22, 2021 @ 11:18AM
విరసం నేత వరవరరావుకు ముంబై హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. గోరేగావ్ కుట్ర కేసులో అరెస్ట్ అయి జైలు జీవితాన్ని గడుపుతున్న వరవరరావుకు బాంబే హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. వరవరరావు ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ఈ సందర్భంగా న్యాయమూర్తి తెలిపారు. ఆరు నెలల పాటు వైద్యుల పర్యవేక్షణలోనే ఉండాలని కోర్టు వెల్లడించింది. ముంబై విడిచి ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదని కోర్టు తెలిపింది.
తనపై ఆరోపణలు ఉన్న కేసు విచారణకు సంబంధించి, పోలీసులకు సహకరించాలని, సాక్ష్యాల తారుమారుకు ప్రయత్నిస్తే, బెయిల్ ను రద్దు చేస్తామని న్యాయమూర్తి వరవరరావును హెచ్చరించారు. సోమవారం సాయంత్రం లోగా బెయిల్ పేపర్లను జైలు అధికారులకు అందించి, విడుదలయ్యేలా చూస్తామని వరవరరావు తరఫు న్యాయవాదులు చెప్పారు. ఇటీవల వరవరరావు ఆరోగ్యం బాగా దెబ్బతిన్నది. కరోనా కూడా సోకడంతో పాటు నరాల సంబంధిత ఇబ్బందులు.. ఇతర సమస్యలతో ఆయన బాధ పడుతున్నారు.
వరవరరావును 2018 జూన్ 18న చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(యూఏపీఏ) కింద ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. భీమాకోరేగావ్ అల్లర్లకు సంబంధించి మహారాష్ట్ర పోలీసులు జూన్ మొదటివారంలో కొందరిని అరెస్టు చేశారు. వీరంతా ప్రధాని మోడీ హత్యకు కుట్ర పన్నారని, వీరికి వరవరరావు ఆర్థికంగా సహకరిస్తున్నారని మహారాష్ట్ర పోలీసుల అభియోగం.ఈ మేరకు వరవరరావుపై ఐపీసీ 153 (ఏ), 505 (1) (బీ), 117, 120 (బీ), చట్ట వ్యతిరేక చర్యల (నియంత్రణ) చట్టం సెక్షన్ 13, 16, 17, 18 (బీ), 20, 38, 39, 40 సెక్షన్ల కింద మహారాష్ట్ర పూణే జిల్లా విశారంబాగ్ పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు.