ఏపీలో బేబీ కిట్ల సరఫరా పథకాన్ని పునరుద్ధరించిన కూటమి ప్రభుత్వం
posted on May 6, 2025 @ 4:25PM
వైసీపీ ప్రభుత్వ హయాంలో నిలిపివేసిన బేబీ కిట్లు పథకాన్ని పునరుద్ధరించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించుకుంది. నవజాత శిశువుల ఆరోగ్యాన్ని కాపాడటానికి ఉద్దేశించిన 11 వస్తువులతో దోమ తెరతో కూడిన బేబీ బెడ్, వాటర్ ప్రూఫ్ కాట్ షీట్, బేబీ డ్రెస్, వాష్ బుల్ నేప్కిన్స్, టవల్, బేబీ పౌడర్, బేబీ షాంపూ, బేబీ ఆయిల్, బేబీ సబ్బు, సోప్ బాక్స్, బేబీ రాటిల్ టాయ్ కూడిన ప్రతి కిట్ కు రూ.1,410లు ఖర్చు అవుతుంది. గతంలో ఈ పథకానికి జాతీయ ఆరోగ్య మిషన్ కింద కొంత మేరకు కేంద్ర సాయం అందేది.
ఈ సాయాన్ని ఇప్పుడు ఎన్డీయే సర్కార్ నిలిపివేసింది. మాతృత్వ వందన యోజన, 15వ ఆర్థిక కమిషన్ నిధుల కింద కూడా ఈ కిట్ల సరఫరాకు కేంద్ర ప్రభుత్వ సాయం లభించే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో ఎంతో ప్రజాదరణ పొందిన ఈ పథకానికి అవసరమైన నిధుల్ని కూటమి సర్కార్ నిధులనుంచే అందజేయాలని వైద్య,ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ చేసిన ప్రతిపాదనను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదించారు. ఆంధ్రప్రదేశ్లో జరిగి ప్రసవాల్లో సగానికి పైగా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరుగుతున్నాయి.