మానవరూపంలో మృత్యువు.. లారెన్స్ బిష్ణోయ్!

రెక్కీ చేసెయ్... ప్రాణం తీసెయ్.. ఇదే, రెండుపదుల వయసులోనే ఫస్ట్ మర్డర్ చేసి.... హత్యల శాస్త్రంలో అక్షరాభ్యాసం చేసిన లారెన్స్ బిష్ణోయ్ తన గ్యాంగ్‌సభ్యులకు చెప్పే నేరకమంత్రం. ముప్ఫై ఒక్క సంవత్సరం వయసు వచ్చేసరికి లారెన్స్ బిష్ణోయ్ మోడ్రన్ గ్యాంగ్‌స్టర్‌గా ఎదిగాడు. మర్డర్ చేయడం ఈజీనా, మంచినీళ్ళు తాగడం ఈజీనా అని అడిగితే... మర్డర్ చేయడమే ఈజీ అని మొహమాటం లేకుండా చెప్పే ఏడు వందలమంది కరడుగట్టిన సభ్యులతో దేశమంతటా గ్యాంగ్‌ని ఏర్పాటు చేసుకున్నాడు. లారెన్స్ బిష్ణోయ్ ఇప్పుడు సబర్మతీ జైల్లో వున్నాడు. అయినప్పటికీ తాను లేని లోటుని ఈ సమాజం ఫీల్ అవనివ్వడు. అందుకే తన గ్యాంగ్‌ సభ్యులతో బ్లాక్‌మెయిల్స్, మర్డర్స్ చేయిస్తూ మకుటంలేని మాఫియా మహారాజులా వెలుగుతున్నాడు. లారెన్స్  బిష్ణోయ్ జైలు నుంచి ఆదేశిస్తాడు.. బయట వున్న అతని గ్యాంగ్ మెంబర్స్ చెప్పింది చెప్పినట్టు ఆచరిస్తారు.. అది మర్డరైనా.. మరేదైనా! అప్పుడెప్పుడో పాతతరం వాళ్ళకి దావూద్ ఇబ్రహీం.. హాజీమస్తాన్, ఛోటా రాజన్ లాంటి గ్యాంగ్స్.స్టర్స్ గురించి తెలుసు.. మూడు పదుల వయసులోనే మర్డర్లు, కిడ్నాపులు, బ్లాక్‌మెయిలింగ్స్ లాంటి ముప్పైకి పైగా కేసులని తన కీర్తికిరీటంలో ధరించిన మోడ్రన్ మొద్దుశ్రీను లారెన్స్ బిష్ణోయ్‌‌ గురించి తెలుసుకునే అవకాశం ఈనాటి కొత్తతరానికి కలుగుతోంది. ఆమధ్య జరిగిన పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య, నిన్నగాక మొన్న జరిగిన మహారాష్ట్ర మాజీ మంత్రి సిద్ధిక్ హత్యతో తన మరణశాసనాలను హిస్టరీని అప్‌డేట్ చేసుకున్న లారెన్స్ బిష్ణోయ్ జన్మవృత్తాంతాన్ని తెలుసుకుని తరిద్దాం.

లారెన్స్ బిష్ణోయ్ 1993లో పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌లో పుట్టాడు. అతని తండ్రి హర్యానాలో పోలీస్ కానిస్టేబుల్. ఇంటర్మీడియట్ వరకు అబోహర్‌లో చదువుకున్న బిష్ణోయ్ ఆ తర్వాత చండీగఢ్ డీఏవీ కాలేజీలో గ్రాడ్యుయేషన్ చదివాడు. పంజాబ్ యూనివర్సిటీ నుంచి ఎల్.ఎల్.బి. పట్టా అందుకున్నాడు. కాలేజీలో, యూనివర్సిటీలో వున్నంతకాలంలో లారెన్స్ బిష్ణోయ్ చదివింది తక్కువ... విద్యార్థి రాజకీయాలు నడిపింది ఎక్కువ. కాలేజీలో చదివే రోజుల్లో కాలేజీ ఎలక్షన్లో గెలిచిన అభ్యర్థిని ముచ్చటగా మర్డర్ చేసుకున్నాడు. ఆ తర్వాత లుథియానా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో తన మీద పోటీ చేస్తున్న అభ్యర్థి బుర్రకి బుల్లెట్ రుచి చూపించాడు. రెండు పదులు నిండీనిండకుండానే డజన్లకొద్దీ నేరాలు ఘోరాల చేసిన బిష్ణోయ్ మీద బోలెడన్ని  కేసులు నమోదయ్యాయి. బంగారానికి తావి అబ్బినట్టు.. అయ్యగారిది అసలే క్రిమినల్ బ్రెయిన్.. దానికి తోడు ‘లా’ కూడా చదివి చట్టానికి చుట్టమయ్యాడు. చట్టంలోని లొసుగులను ఉపయోగించుకుని స్వేచ్ఛగా తిరిగాడు. బెదిరింపులే పెట్టుబడిగా ఒకవైపు నేర సామ్రాజ్యాన్ని, మరోవైపు  వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాడు. అడపాదడపా జైలుకు వెళ్ళినా, దాన్ని కూడా తన నేరసామ్రాజ్యాన్ని విస్తరించడానికే ఉపయోగించుకున్నాడు. జైల్లో వున్న కరడుగట్టిన నేరస్తులకు తన గ్యాంగ్‌లో మెంబర్‌షిప్ ఇచ్చేవాడు.. అలా ఏడువందలకు పైగా కర్కోటర్లతో బలమైన ముఠాని క్రియేట్ చేసుకున్నాడు. 

ఇంత ఘనమైన చరిత్ర వున్న బిష్ణోయ్, పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలాని హత్య చేయడానికి తన ఫ్రెండ్ అయిన గ్యాంగ్‌స్టర్ గోల్డీబ్రార్‌కి తీహార్ జైల్లోంచే సహకరించాడు. ఈ నేరంలో బిష్ణోయ్ హస్తం వుందని తెలిసినా, చట్టం గుట్టుమట్లు, లోటుపాట్లు బాగా తెలిసిన బిష్ణోయ్ మీద పోలీసులు ఏ చర్యా తీసుకోలేకపోయారు. 2023లో ఖలిస్తాన్ వేర్పాటువాది సుఖ్‌దూల్ సింగ్‌ గిల్ హత్యని, కర్ణిసేన అధ్యక్షుడు సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడి హత్యని మేమే చేశామని బిష్ణోయ్ గ్యాంగ్ సగర్వంగా ప్రకటించుకుంది. తాజాగా మహారాష్ట్ర మాజీ మంత్రి, హీరో సల్మాన్‌ఖాన్‌తోపాటు పలువురు సినీ ప్రముఖుల సన్నిహితుడు బాబా సిద్ధిక్‌ని హత్య చేయడం ద్వారా బిష్ణోయ్ గ్యాంగ్ కొత్త కలకలానికి తెర తీసింది. 

రెండు దశాబ్దాల నిశ్చబ్దం తర్వాత ముంబైలో మళ్లీ తుపాకీ మోత మోగింది. పంజాబ్‌, హర్యానా, ఢిల్లీలో నెత్తుటి ధారలు పారించిన లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌.. తన నేర సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ బాబా సిద్ధిక్ హత్యతో ముంబైలో అడుగుపెట్టింది.  బాలీవుడ్ సెలబ్రెటీలకు సన్నిహితుడైన ఎన్సీపీ నేత బాబా సిద్దిఖీని తామే చంపామని గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించింది. కొద్ది రోజులుగా రెక్కీ నిర్వహించి హత్య చేసినట్లు ఆ గ్యాంగ్ సభ్యులు చెబుతున్నారు. మరోవైపు సినీ నటుడు సల్మాన్ మీద కోపంతోనే బాబా సిద్ధిక్‌ని బిష్ణోయ్ చంపించాడనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. ఇంతకీ బిష్ణోయ్‌కి సల్మాన్‌ఖాన్ మీద ఎందుకు కోపం? ఈ విషయాన్ని తెలుసుకోవాలంటే పాతికేళ్ళు వెనక్కి వెళ్ళాలి.

1999లో సల్మాన్ ఖాన్ నటించిన హమ్ సాథ్ సాథ్ హై సినిమా విడుదలైంది. ఈ సినిమా షూటింగ్ ఎక్కువ శాతం రాజస్థాన్‌లో జరిగింది. షూటింగ్ సమయంలో సల్మాన్ ఖాన్, తన సహనటులతో కలిసి అక్కడి అడవుల్లో విహరించే కృష్ణ జింకలను వేటాడాడు. కృష్ణ జింకల వేట కేసులో సల్మాన్ ఖాన్ ఆ తరువాత కేసు కూడా ఎదుర్కొన్నాడు. కానీ ఇంతవరకు సల్మాన్ ఖాన్‌కు జైలు శిక్ష పడలేదు. కృష్ణ జింకలను లారెన్స్ బిష్ణోయ్ సామాజిక వర్గం తమ కులదైవానికి ప్రతీకగా పూజిస్తుంది. కృష్ణ జింకలను పవిత్ర జంతువులుగా ఆరాధిస్తుంది. బిష్ణోయ్ సామాజివర్గానికి చెందినవారు చనిపోయాక కృష్ణ జింకలుగా పుడతారన్న బలమైన నమ్మకం వారిలో వుంది. కృష్ణ జింకల విషయంలో బిష్ణోయ్‌ల ప్రేమ ఏ స్థాయిలో వుంటుందంటే... ఎప్పుడైనా తల్లి కృష్ణజింక చనిపోయి దాని పిల్లలు అనాథలు అయితే, బిష్ణోయ్ సామాజికవర్గంలోని మహిళలు వాటిని తమ బిడ్డల్లాగా ప్రేమగా పెంచుతారు. బాలింతలుగా వున్న మహిళలు ఆ కృష్ణజింక పిల్లలకు చనుపాలు ఇచ్చి పెంచుతారు. అలాంటి పవిత్ర జింకలను సల్మాన్ ఖాన్ వేటాడి చంపాడని బిష్ణోయ్ సామాజిక వర్గంలో ఆగ్రహం వుంది. ఒక సందర్భంలో లారెన్స్ బిష్ణోయ్ కూడా సల్మాన్ ఖాన్ గురించి మాట్లాడాడు. నాకు సల్మాన్‌ఖాన్‌ని చంపాలన్న ఉద్దేశం లేదు.  మా బిష్ణోయ్ కమ్యూనిటీకి చెందిన ముకం ముక్తి ధామ్ ఆలయానికి సల్మాన్ ఖాన్ వెళ్ళి క్షమాపణలు చెబితే మేం ఆయన్ని క్షమిస్తాం అన్నాడు. అయితే సల్మాన్ ఖాన్ సదరు ఆలయానికి వెళ్ళిందీ లేదు.. క్షమాపణ చెప్పిందీ లేదు. అందువల్ల సల్మాన్ మీద వున్న కోపం లారెన్స్ బిష్ణోయ్‌కి పెరిగిపోయి వుంటుందని, సల్మాన్‌కి షాక్ ఇవ్వడం కోసమే ఆయన సన్నిహితుడైన మాజీ మంత్రి బాబా సిద్ధిక్‌ని హత్య చేయించి వుంటాడనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.  

బిష్ణోయ్ గ్యాంగ్ తమ ఉనికి చాటుకోవడం కోసం గతంలో ఒకసారి  సల్మాన్ ఇంటి దగ్గర ఫైరింగ్ చేసింది. ఆ తర్వాత ఓ బిగ్ టార్గెట్‌ను షూట్ చేయకపోతే భయం ఉండదని అనుకుని.. బాబా సిద్దిఖీని టార్గెట్ చేసినట్లుగా తెలుస్తోంది. అప్పట్లో దావూద్ ఇబ్రహీం కూడా ఇలాగే బాలీవుడ్‌ను టార్గెట్ చేసేవాడు. పలువురి మీద దాడులు చేయించాడు. ఇలా బెదిరించే దావూద్ బాలీవుడ్ మొత్తాన్ని తన గుప్పిట్లో పెట్టుకున్నారని చెబుతారు. తర్వాత మెల్లగా మాఫియా కబంధ హస్తాల నుంచి బాలీవుడ్ బయటపడింది. ఇప్పుడు లారెన్స్ బిష్ణోయ్ రూపంలో మరోసారి ముంబైలో మాఫియా తలెత్తుతోందా అనే సందేహాలు కలుగుతున్నాయి. 

హర్యానా, పంజాబ్‌, ఢిల్లీలని దాటి ఇప్పుడు ముంబై మీద కూడా తన పంజా విసిరిన లారెన్స్ బిష్ణోయ్ అంతర్జాతీయ స్థాయిలో కూడా తన బ్రాండ్ ఐడెంటిటీ చూపిస్తున్నాడు. లారెన్స్ తీహార్ జైల్లో వుంటూనే, కెనడాలో వున్న తన సోదరుడి ద్వారా అక్కడ నేర కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. కెనడాలో ఖలిస్తానీ ఉద్యమం చేస్తున్న ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్‌సింగ్ నిజ్జర్ హత్యలో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ హస్తం వుందని కెనడా ప్రభుత్వం ఆరోపిస్తోంది. బిష్ణోయ్ గ్యాంగ్‌ని భారత ప్రభుత్వమే ప్రోత్సహిస్తోందని కెనడా ప్రభుత్వం నోరు పారేసుకుంది. అక్కడతో ఆగకుండా నిజ్జర్ హత్య కేసులో అనుమానితుల జాబితాలో భారత హైకమిషనర్ సంజయ్‌కుమార్ వర్మను కూడా చేర్చింది. ఇండియా మీద బురద చల్లడానికి బిష్ణోయ్ గ్యాంగ్ చేస్తున్న నేరాలను కెనడా ప్రభుత్వం ఉపయోగించుకుంటోంది. 

రాజకీయ నాయకుడు ఎక్కడున్నా రాజకీయ నాయకుడే. తన ప్రయోజనం కోసం ఎన్ని నాటకాలైనా ఆడతాడు. కెనడా ప్రధాని ట్రూడో కెనడాలో ప్రజలతో పాటు సొంత పార్టీలో కూడా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నాడు. త్వరలో ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో కెనడాలో వున్న సిక్కుల ఓట్లు కూడా చాలా కీలకం. కెనడాలో వున్న సిక్కుల్లో ఎక్కువ శాతం ఖలిస్తాన్ ఉద్యమానికి మద్దతు ఇచ్చేవారే. ఖలిస్తాన్ లీడర్ నిజ్జర్‌ని హత్య చేయించిన బిష్ణోయ్‌కి, ఇండియా ఏజెంట్లకి సన్నిహిత సంబంధాలు వున్నాయన్న అబద్ధాన్ని కెనడా ప్రభుత్వం అక్కడి సిక్కుల్లో బలంగా నాటగలిగింది. ఇండియా వ్యతిరేకించే ఖలిస్తాన్ ఉద్యమానికి మద్దతు ఇవ్వడం ద్వారా కూడా సిక్కుల్లో తమకు మద్దతు పెంచుకుంటోంది. ఒకవైపు ఖలిస్తాన్ ఉద్యమాన్ని సమర్థించడంతోపాటు, మరోవైపు నిజ్జర్ హత్య ఇండియా, బిష్ణోయ్ కలసి చేశారన్న అంశాన్ని ప్రచారం చేయడం ద్వారా కెనడా ప్రధాని రాజకీయంగా లాభం పొందాలని అనుకుంటున్నాడు.  తన రాజకీయ వ్యూహంలో లారెన్స్ బిష్ణోయ్‌ని ఒక పావులా వాడుకుంటున్నాడు. బిష్ణోయ్ చేయించిన హత్య పుణ్యమా అని ఇండియా - కెనడా దేశాల మధ్య పూడ్చలేనంత అగాథం ఏర్పడింది. ఆ అగాథాన్ని కెనడా నాయకులు ఇంకా పెంచే ప్రయత్నం చేస్తున్నారు. కెనడా చేసిన కవ్వింపు చర్యలకు ప్రతిచర్యగా భారత ప్రభుత్వం ఇండియాలో వున్న కెనడా ప్రతినిధులను దేశం విడిచి వెళ్ళమని ఆదేశించింది.  రేపో మాపో కెనడా కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకునే అవకాశం వుంది. స్వదేశంలో ఆగడాలతో ఆగకుండా  ఇండియా - కెనడా మధ్య కూడా నిప్పు పెట్టిన లారెన్స్ బిష్ణోయ్ సబర్మతీ  జైల్లో హాయిగా రెస్ట్ తీసుకుంటున్నాడు.

అవినీతికి పాల్పడితే తన, పర భేదం లేదు.. లోకేష్ వినూత్న విధానం

అక్రమాలు, అవకతవకలకు పాల్పడితే తన, పర తేడా లేదంటున్నారు ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్. ఎమ్మెల్యేలు, అధికారులపై ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకోవడానికి వెనుకాడేది లేదని హెచ్చరిస్తున్నారు. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి కూడా అయిన నారా లోకేష్.. అవినీతి, అక్రమాలకు పాల్పడితే తెలుగుదేశం వారైనా, ప్రత్యర్థి పార్టీ వారైనా చర్యలు ఒకేలా ఉంటాయని విస్పష్టంగా చెబుతున్నారు. పొలిటిలక్ గా ఆయన దూకుడు ముఖ్యమంత్రి చంద్రబాబును మించి ఉందని పరిశీలకులు అంటున్నారు.  రాజకీయాల్లో నాయకులపై విమర్శలు, ఆరోపణలు సహజం.  వాటిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవడం అన్నది సాధారణంగా అధకారంలో ఉన్న వారిపై కంటే అధికారంలో లేని వారిపైనే ఎక్కువగా జరుగుతుంటుంది. అయితే ఈ పద్ధతిని బ్రేక్ చేసి.. ఇది ప్రజాస్వామ్యం,  తన, పర తేడా లేకుండా ఎవరిపై ఆరోపణలు  వచ్చినా విచారణ జరుపుతామని,తప్పు చేశారని నిర్ధారణ అయితే చర్యలు తీసుకుంటామని నారా లోకేష్ చెబుతున్నారు. ఇందు కోసం ఆయన ఒక కొత్త విధానాన్ని తీసుకురావడానికి రెడీ అయిపోయారు. త్వరలోనే ఆ విధానాన్ని ప్రకటించే అవకాశం ఉంది.   ముఖ్యంగా ఇక అధికారంలో ఉన్న ఎమ్మెల్యేల మీద ఫిర్యాదులు వస్తే.. వాటిని నాలుగు గోడలమధ్యా చర్చించి, హెచ్చరించో, బుజ్జగించో వదిలేయడమన్నది ఒక ఆనవాయితీగా వస్తోంది. ఆ ఆనవాయితీని బ్రేక్ చేస్తామంటున్నారు లోకేష్.    ప్రజల నుంచి ఎమ్మెల్యేలపై, వారు అధికార పార్టీ వారైనా, ప్రత్యర్థి పార్టీవారైనా సరే ఆరోపణలు వస్తే వాటిని స్వీకరించాలని లోకేష్ నిర్ణయించారు. అవినీతికి ఎవరు పాల్పడినా అది తప్పే అని కుండబద్దలు కొడుతున్నారు.  ఇక అధికార తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలపై ఫిర్యాదులు నేరుగా పార్టీకే ఫిర్యాదు చేసేలా ఒక విధానాన్ని తీసుకురానున్నట్లు ఆయన చెబుతున్నారు. తమ నియోజకవర్గం ఎమ్మెల్యే ఏ విధంగా వ్యవహరిస్తున్నారు? ఆయన పనితీరు ఎలా ఉంది?  ఆయన గానీ అనుచరులు కానీ ఏమైనా తప్పులు పొరపాట్లు చేస్తున్నారా? వంటి విషయాలను జనం నేరుగా పార్టీకే ఫిర్యాదు చేయడానికి వీలుగా తెలుగుదేశం  పార్టీ   పరంగా ప్రత్యేకమైన ఫోన్ నంబర్ ని ఏర్పాటుచేయనున్నారు.  ఆ నంబర్ కి ఫిర్యాదుదారుడు ఎవరైనా ఫోన్ చేయవచ్చు.  అలా ఫిర్యాదు చేసిన వారి ఫోన్ నంబర్లను వారి పేర్లను   గోప్యంగా ఉంచుతారు.  అంతే కాకుండా ఆ ఫిర్యాదులపై విచారణ జరిపి చర్యలు కూడా తీసుకుంటారు.  ఎమ్మెల్యేలే కాదు,   అధికారుల అవినీతి మీద పనితీరు మీద కూడా ప్రజలు నేరుగా ఫిర్యాదు చేయవచ్చు.  ఈ విధంగా వచ్చే ఫిర్యాదులను సమగ్రంగా విచారించి, నిజానిజాల నిగ్గు తేల్చి అవసరమైతే చర్యలు తీసుకుంటారు.  ఇది దేశంలో ఎక్కడా లేని  నూతన విధానమనీ, దీనిని త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారనీ తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి.  దీని వల్ల అధికారులు,  ఎమ్మెల్యేలలో తప్పు చేయాలంటే భయపడే పరిస్థితి ఉంటుందనీ, ప్రజలు  ప్రభుత్వం పట్ల సానుకూలంగా ఉండేందుకు దోహదం చేస్తుందని భావించి లోకేష్ ఈ విధానాన్ని తీసుకురావడానికి సమాయత్తమౌతున్నారని చెబుతున్నారు.  

థాక్రే బ్రదర్స్ కలయిక ప్రభావం ఎంత?.. బీఎంసీ ఫలితాలకు ముందు సర్వత్రా ఉత్కంఠ!

బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ ఫలితాల వేళ సర్వత్రా ఉత్కంఠ బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల ఫలితాలు నేడు  శుక్రవారం (జనవరి 16) వెలువడనున్నాయి. గురువారం (జనవరి 16) బీఎసంసీకి జరిగిన ఎన్నికలలో 50 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది.  బీఎంసీ ఫలితాలు రాష్ట్ర రాజకీయాలపై స్పష్టమైన ప్రభావం చూపుతాయన్న అంచనాల నేపథ్యంలో ఈ ఫలిలాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.  అన్నిటికీ మించి దాదాపు రెండు దశాబ్దాల తరువాత తొలి సారిగా ఉద్ధవ్ థాక్రే, రాజ్ థాక్రేలు ఈ ఎన్నికల కోసం చేతులు కలపడంతో బీఎంసీ ఫలితాలపై ఉత్కంఠ మరింత పెరిగింది.  ముంబైపై పట్టు సాధించడమే లక్ష్యంగా థాక్రే బదర్స్ కలవడం ప్రాథాన్యత సంతరించుకుంది. ' ఎగ్జిట్ పోల్స్ లో బీజేపీ-షిండే కూటమి విజయం సాధించే అవకాశం ఉందని తెలినప్పటికీ, థాక్రేల కలయిక నేపథ్యంలో  ఫలితం ఎలా ఉంటుందన్న ఉత్కంఠ ముంబై వాసులలోనే కాకుండా, దేశ వ్యాప్తంగా వ్యక్తం అవుతోంది.   బీఎంసీతో పాటుగా గురువారం (జనవరి 15) మహారాష్ట్రలో 29 కార్పొరేషన్లకు కూడా ఎన్నికలు జరిగాయి. వాటి ఫలితాలు కూడా శుక్రవారమే (జనవరి 16) విడుదల కానున్నాయి. కాగా..  పుణె, పింప్రి-చించ్వాడ్ ప్రాంతాల్లో  మునిసిపల్ ఎన్నికలలో శరద్ పవార్, అజిత్ పవార్ వర్గాలు కలిసి పోటీ చేశాయి.  జాతీయ స్థాయిలో విభేదాలు ఉన్నప్పటికీ, స్థానిక సంస్థల్లో పట్టు నిలుపుకునేందుకు 'పవార్ ఫ్యామిలీ' ఒక్కటవ్వడం కూడా రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.  అన్నిటికీ మించి ఈ మునిసిపోల్స్ ను పరిశీలకులు అసెంబ్లీ ఎన్నికలకు లిట్మస్ టెస్ట్ గా అభివర్ణిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 29 కార్పొరేషన్లలోని 2,801 సీట్లకు గురువారం (జనవరి 15) పోలింగ్ జరిగింది పోలింగ్ జరిగింది.  ఒక్క బీఎంసీలోనే 227 వార్డులు ఉండగా, అధికారం చేపట్టాలంటే మ్యాజిక్ ఫిగర్ 114. 

మాజీ మంత్రి జోగు రామన్న గృహ నిర్బంధం.. ఎందుకో తెలుసా?

మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత జోగు రామన్నను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లా పర్యటన నేపథ్యంలో జోగురామన్న అరెస్టు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. సీఎం పర్యటనను అడ్డుకుంటామంటూ మాజీ మంత్రి జోగు చేసిన ప్రకటనతో అప్రమత్తమైన పోలీసులు శుక్రవారం (జనవరి 16) ఉదయమే ఆయనను హైస్ అరెస్టు చేశారు.  రాష్ట్రంలో మునిసిపోల్స్ దగ్గర పడుతున్న తరుణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా శుక్రవారం (జనవరి 16) , నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన నిర్మల్ జిల్లాలో సదర్ ఘాట్ బ్యారేజీకి, అలాగే ఆదిలాబాద్ జిల్లాలో చనాక-కోరట పంప్ హౌస్ కు ప్రారంభోత్సవం చేయనున్నారు. వీటితోనే మునిసిపల్ ఎన్నికల ప్రచారానికి సీఎం రేవంత్ రెడ్డి ఆరంభం పలకనున్నారు.  ఈ నేపథ్యంలోనే సీఎం పర్యటనను అడ్డుకుంటామని జోగు రామన్న ప్రకటించిన నేపథ్యంలో పోలీసులు ఆయనను హౌస్ అరెస్టు చేశారు. దీంతో ఆదిలాబాద్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.  

రాయలసీమ లిఫ్ట్‌ను జగన్, కేసీఆర్‌కు తాకట్టు పెట్టారు : సోమిరెడ్డి

  రాయలసీమ లిఫ్ట్ విషయంలో మాజీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి ఆ ప్రాంతానికి ద్రోహం చేశారని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శించారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌తో లాలూచీ పడి జగన్‌మోహన్ రెడ్డి రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టును తాకట్టు పెట్టేశారని ఆరోపించారు. అక్కడ తెలంగాణలో కేసీఆర్ సీఎం కాగా, ఇక్కడ ఏపీలో జగన్ సీఎం గా ఉన్న సమయంలో ఇద్దరి మధ్య విడదీయలేని అనుబంధం ఉందని వ్యాఖ్యానించారు. 2020లో తెలంగాణ ప్రభుత్వం చేసిన ఫిర్యాదుతో రాయలసీమ ఎత్తిపోతలపై ఎన్జీటీ స్టే విధించిందని గుర్తు చేశారు. 2020 నుంచి 2024 వరకు దాదాపు నాలుగేళ్లపాటు ఇద్దరూ సీఎంలుగా కొనసాగినప్పటికీ ఎన్జీటీ స్టే కొనసాగడమే వీరి కుమ్మక్కు రాజకీయాలకు నిదర్శనమని అన్నారు. ఈ వ్యవహారాన్ని ఏపీ ప్రజలు పూర్తిగా అర్థం చేసుకున్నారని స్పష్టం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు రేవంత్ రెడ్డితో చంద్రబాబు నాయుడు కుమ్మక్కయ్యారని ఆరోపించడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎప్పుడైనా ఎన్జీటీ స్టే విధించిందా? పనులు ఆపిందా? పెనాల్టీ వేసిందా? అని ప్రశ్నించారు. లిఫ్ట్ పనులే ప్రారంభించకుండా వందల కోట్ల రూపాయలు దోచుకునేందుకు కేవలం మట్టి పనులకే పరిమితమయ్యారని విమర్శించారు. మట్టి పనుల బిల్లులు చేసుకోవడంలో ఎన్జీటీ స్టే అడ్డురాలేదని, కానీ అసలు లిఫ్ట్ నిర్మాణానికే స్టే అడ్డువచ్చినట్లుగా వ్యవహరించారని మండిపడ్డారు. ఇంత బహిరంగంగా రాయలసీమను కేసీఆర్‌కు తాకట్టు పెట్టిన జగన్మోహన్ రెడ్డి చెప్పే సినిమా కథలను ప్రజలు నమ్మరని స్పష్టం చేశారు. ప్రజలంతా నిజాన్ని అర్థం చేసుకున్నారని, వైసీపీ నాయకులు నోర్లు అదుపులో పెట్టుకోవాలని సోమిరెడ్డి హెచ్చరించారు.

రాయలసీమలో ఫ్యాక్షనిజానికి కారణం...మంగంపేట గనులేనా?

  తెలుగువన్ ఎండీ రవిశంకర్ కంఠమనేని సారథ్యంలో వాస్తవ వేదిక ఎనిమిదో ప్రోమో విడుదలైంది. ఈ కార్యక్రమంలో మంగంపేట గనుల అంశంపై జామీన్ రైతు, ఎడిటర్ డోలేంద్ర ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాయలసీమలో ప్యాక్షనిజానికి ప్రధాన మూలం మంగమ్మపేట గనులేనని ఆయన పేర్కొన్నారు. రాయలసీమ ప్రజలకు నిజంగా లాభమా, లేక సీమ పేరుతో కొద్దిమందికే లాభమా అన్న ప్రశ్నను లేవనెత్తారు. దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మైనింగ్ వ్యాపారం చేసిన విషయం, ఆయన తండ్రి రాజారెడ్డి నేర సామ్రాజ్యం గనుల నుంచే మొదలైందని డోలేంద్ర ప్రసాద్ ఆరోపించారు. ఒక ప్రభుత్వం చేసిన తప్పులను తర్వాతి ప్రభుత్వం కాపాడుతుందని, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం చేసిన తప్పులను వచ్చే ప్రభుత్వం రక్షించే పరిస్థితి కొనసాగుతోందని విమర్శించారు. వ్యవస్థ మొత్తం అవినీతి చక్రంలో చిక్కుకుపోయిందన్నారు. ఇదిలా ఉండగా, తెలంగాణలో ఒక సాధారణ గుమాస్తా ఉద్యోగి వద్ద సుమారు రూ.50 కోట్లకు పైగా ఆస్తులు బయటపడటం పాలనలో ఉన్న అవినీతికి నిదర్శనమని డోలేంద్ర ప్రసాద్ వ్యాఖ్యానించారు. ప్రజా చైతన్యమే లక్ష్యంగా సాగుతున్నవాస్తవ వేదిక గురువారం (జనవరి 15) రాత్రి 7 గంటలకు తెలుగువన్  యూట్యూబ్ చానల్ లో తప్పక వీక్షించండి.  

ద‌గ్గుపాటికి...వివాదాలు ప‌రిపాటి?

  పండ‌గ పూట నారా వారి కుటుంబ‌మంతా నారావారి ప‌ల్లెలో సంబ‌రాల్లో మునిగి తేలుతుంటే.. అనంత  ఎమ్మెల్యే వివాదం ఒక‌టి పండ‌గ స్పెష‌ల్ గా తెర‌పైకి వ‌చ్చింది. అనంత అర్బ‌న్ ఎమ్మెల్యే ద‌గ్గుపాటి ప్ర‌సాద్ రాన్రాను వివాదాస్ప‌దంగా మారుతున్నారు. తాజాగా ఆయ‌న‌పై ఒకే సారి రెండు ఆరోప‌ణ‌లు. ఒక‌టి నంబూరి వైన్స్ య‌జ‌మానిని డ‌బ్బు కోసం ప‌లు మార్లు ఫోన్లు చేసి బెదిరించ‌డం మాత్ర‌మే కాకుండా.. ఆయ‌న వైన్స్ ని కూడా త‌గ‌ల‌బెట్టించారు.  నంబూరి న‌ల‌భై ఏళ్ల నుంచి టీడీపీలో సిన్సియ‌ర్ కార్య‌క‌ర్త‌గా  కొన‌సాగుతున్నారు. త‌న‌లాంటి టీడీపీ వారి మీదే ద‌గ్గుపాటి ఇంత ప్రతాపం చూపిస్తుంటే.. ఇక సాధార‌ణ మైన వారి  ప‌రిస్థితి ఏంట‌న్న‌ది ఆయ‌న ప్ర‌శ్నిస్తున్న విధం. ఇక ఇదే ద‌గ్గుపాటి పై రాష్ట్ర లింగాయ‌త్ కార్పొరేష‌న్ చైర్మ‌న్ అయిన  స్వ‌ప్న అనే మ‌హిళ త‌న  భూమి క‌బ్జా చేసిన‌ట్టుగా ఆరోప‌ణ‌లు చేశారు. అనంతపురంలో ఓ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. అయితే ఆ ఎగ్జిబిషన్ నిర్వాహకుడు ఫకృద్దీన్ మీద ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ అనుచరులు దాడిచేశారని ఆరోపణలు వచ్చాయి. ఎగ్జిబిషన్ నిర్వాహకుడిని బెదిరించారంటూ సోమవారం ఆరోపణలు వచ్చాయి. అలాగే ఎగ్జిబిషన్ నిర్వాహకుడు ఫకృద్ధీన్ ఈ విషయం మీద అనంతపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ముఖ్య అనుచరుడు గంగారాం, ఎమ్మెల్యే గన్‌మెన్ షేక్షా మద్యం సేవించి ఎగ్జిబిషన్ వద్ద వీరంగం సృష్టించారని ఫిర్యాదు చేశారు. పది లక్షల రూపాయలు ఇవ్వాలంటూ తనను బెదిరించారంటూ ఎగ్జిబిషన్ నిర్వాహకుడు ఫకృద్ధీన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ‌తంలో ద‌గ్గుపాటి మీద జూనియ‌ర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని అన‌వ‌స‌రంగా  రెచ్చ‌గొట్టిన ఆరోప‌ణ‌లున్నాయి. ఆ ఆడియో కాల్ తో స‌హా బ‌య‌ట ప‌డి  నానా ర‌భ‌స కింద త‌యారైంది. లోకేష్ ఆ టైంలో హెచ్చ‌రించారు కూడా. అయినా స‌రే ద‌గ్గుపాటి కి ఇలాంటి వివాదాలు ఒక ప‌రిపాటిగా  మారింది. ఇప్ప‌టికే కొలికిపూడి వంటి ఎమ్మెల్యేల‌తో అధిష్టానానికి త‌ల బొప్పి క‌డుతోంది.  తాజాగా ద‌గ్గుపాటి  కూడా త‌యార‌య్యారు. అయితే ఇవ‌న్నీ ఆధారాలుండి బ‌య‌ట ప‌డ్డ ఎమ్మెల్యే బాగోతాల‌నీ. ఇదే రాయ‌ల‌సీమ‌లో ఒక కూట‌మి  ఎంపీని కూట‌మి  ఎమ్మెల్యే లంచం డిమాండ్ చేసిన విధం రాష్ట్ర‌మంతా పాకింది. వీరే  కాదు.. మొత్తం 48 మంది ఎమ్మెల్యేల‌ను సాక్షాత్ చంద్ర‌బాబే పిలిచి వార్నింగిచ్చారు. ప‌ద్ధ‌తి మార్చుకోకుంటే క‌ష్ట‌మేన‌ని తేల్చి చెప్పారు. ఇలాంటి అవినీతి ఆరోప‌ణ‌లు ఎదుర్కుంటున్న వారు సుమారు 70 మంది వ‌ర‌కూ ఉన్న‌ట్టు కొన్ని అంచ‌నాలున్నాయి. కాబ‌ట్టి.. అధినేత చంద్ర‌బాబు వీరంద‌రిపై క్ర‌మ‌శిక్ష‌ణ చ‌ర్య‌లు తీస్కోకుంటే క‌ష్ట‌మేన‌ని తెలుస్తోంది.

ఈటల వర్సెస్ మర్రి.. తెలంగాణలోనూ క్రెడిట్ వార్

ఆంధ్రప్రదేశ్ లో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్యం విషయంలో తెలుగుదేశం, వైసీపీల మధ్య ఒక పక్క క్రెడిట్ వార్ కొనసాగుతుండగానే.. తెలంగాణలో కూడా మరో క్రెడిట్ వార్ మొదలైంది. పొలిటికల్ గా క్రెడిట్ ను తమ ఖాతాలో వేసుకోవడానికి నేతల ఆరాటమే ఇందుకు కారణం. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అయితే అడ్డగోలుగా తాను అవసరం లేదంటూ వాదించిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం విషయంలో ఆ ఎయిర్ పోర్టు ఘనతను తన ఖాతాలో వేసుకోవడానికి పడుతున్న తాపతయం నవ్వుల పాలౌతోంది. అది పక్కన పెడితే.. తెలంగాణలో ఒక రైల్వే అండర్ బ్రిడ్జి పనుల శంకుస్థాపన సమయంలో ఈ బ్రిడ్జి పనులకు నిధులు తెచ్చింది తామంటే తామంటూ బీజేపీ, బీఆర్ఎస్ లు క్రెడిట్ కోసం పోటీ పడుతున్నాయి. ఈ వ్యవహారం బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖరరెడ్డిగా మారింది. సదరు బ్రిడ్జి శంకుస్థాపన కార్యక్రమంలో బీజేపీ, బీఆర్ఎస్ ల మధ్య వాగ్వాదం తీవ్ర రూపం దాల్చి బాహాబాహీదాకా వెళ్లింది. ఇదే విషయంలో ఈటల, మర్రి రాజశేఖరరెడ్డిల మధ్య వాగ్వాదం కూడా ముదిరింది. పోలీసులు సకాలంలో జోక్యం చేసుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చిందనుకోండి అది వేరే సంగతి.  విషయమేంటంటే మేడ్చల్ జిల్లా మచ్చబొల్లారంలో రైల్వే అండర్ బ్రిడ్జి పనుల కు శంకుస్థాపన కార్యక్రమంలో ఈ బ్రిడ్జి పనులకు నిధులు తన ఘనత అంటే తన ఘనత అంటూ ఈటల, మర్రి వాదనకు దిగారు. దీంతో శంకుస్థాపన సందర్భంగా బీజీపీ, బీఆర్ఎస్ శ్రేణులు బాహాబాహీకి దిగాయి. ఈ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి.   పోలీసుల జోక్యంతో పరిస్థితి సద్దుమణిగినా.. మాటల యుద్ధం మాత్రం ఇంకా కొనసాగుతోంది. చూడాలి మరి ఈ క్రెడిట్ వార్ లో విజయం ఎవరిదో?

స్కిల్ కేసు కొట్టివేత

సోమవారం ఉదయం, పోలవరం-నల్లమల ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను భారత సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ పిటిషన్ విచారణకు అర్హత లేదని, రాష్ట్ర ప్రభుత్వ చట్టపరమైన విధానానికి ఎదురుదెబ్బ తగిలిందని కోర్టు పేర్కొంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శిస్తూ కవిత Xలో పోస్ట్ ద్వారా ఈ పరిణామంపై స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌తో కృష్ణా, గోదావరి జల వివాదాలను పరిష్కరించడంలో పాలక ముఖ్యమంత్రి మరోసారి తన అసమర్థతను చూపించారని ఆమె అన్నారు. నీటి హక్కులపై పొరుగు రాష్ట్రాలతో పోరాడకూడదని బహిరంగంగా చెప్పిన ముఖ్యమంత్రి ఉండటం తెలంగాణకు దురదృష్టకరమని ఆమె వ్యాఖ్యానించారు. కోర్టు ఫలితం తెలంగాణకు మరో అడ్డంకిని జోడించిందని కవిత పేర్కొన్నారు. రిట్ పిటిషన్ దాఖలు చేయడం వల్ల పోలవరం-నల్లమల సాగర్ లిఫ్ట్ ప్రాజెక్ట్ అక్రమ నిర్మాణంపై తెలంగాణ హక్కులు బలహీనపడ్డాయి. ఈ చర్య రాష్ట్రాన్ని రక్షించడానికి బదులుగా రాష్ట్ర స్థానాన్ని దెబ్బతీసిందని ఆమె పేర్కొన్నారు. ముఖ్యమంత్రి మరియు కొంతమంది కీలక ప్రభుత్వ సభ్యులు తీసుకున్న నిర్ణయాల కారణంగా తెలంగాణ ప్రజల నీటి హక్కులు నిరాకరించబడుతున్నాయని కవిత ఆరోపించారు. ఆ హక్కులను కాపాడుకోవడానికి తెలంగాణ జాగృతి ఏపీ నీటి ప్రాజెక్టులపై పోరాడుతుందని ఆమె నొక్కి చెప్పారు.

కేసీఆర్ శుక్రాచార్యుడు.. కేటీఆర్ మారీచుడు.. విమర్శల దాడి పెంచిన సీఎం రేవంత్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ లపై విమర్శల దాడి పెంచారు.  ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్యా నీటి పంపకాలపై జరుగుతున్న చర్యలు, వివాదాల నేపథ్యంలో రేవంత్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ లను  రాక్షసులుగా అభివర్ణించారు. కేసీఆర్, కేటీఆర్ లపై రేవంత్ చేసిన విమర్శలు ఇప్పటికే వేడెక్కి ఉన్న రాజకీయ వాతావారణాన్ని మరింత వేడెక్కించాయి. రెండు తెలుగు రాష్ట్రాలూ కలిసి ముందుకు నడవాలన్న ప్రయత్నాలు కొందరికి రుచించవన్నారు. ఈ సందర్భంగానే ఆయన మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఆధునిక శుక్రాచార్యుడిగా అభివర్ణించారు. శుక్రాచార్యుడు రాక్షసుల గురువన్న సంగతి తెలిసిందే. ఇక కేటీఆర్ ను అయితే ఆయన ఏకంగా మారీచుడిగా అభివర్ణించారు. పురాతన కాలంలో ఈ రాక్షసులు యాగాలను, యజ్ణాలను ఆపారనీ, ఇప్పుడు ఆధునిక కాలంలో శుక్రాచార్యుడి పాత్రను కేసీఆర్, మారీచుడి పాత్రను కేటీఆర్ పోషిస్తూ ప్రజాస్వామ్య బద్ధంగా తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారం కోసం జరుగుతున్న ప్రయత్నాలను అడ్డుకుంటున్నారని విమర్శించారు.  ప్రజా శ్రేయస్సు కోసం, రాష్ట్ర పురోగతి కోసం చేస్తున్న ప్రయత్నాలను రాక్షసుల్లో కేసీఆర్, కేటీఆర్ అడ్డుకుంటున్నారని రేవంత్ అన్నారు.  ఫామ్‌హౌస్‌ వదిలి బయటకు రాని ఆధునిక శుక్రాచార్యుడు, అసెంబ్లీకి హాజరౌతున్న మారీచుడి ప్రభావాలకు లోను కావద్దని ప్రజలను కోరారు.  ముఖ్యంగా నీటి పంపకం వంటి సున్నితమైన అంశాలపై కేసీఆర్, కేటీఆర్ ల దుష్ట పన్నాగాలు, మాటల ప్రభావానికి లోనుకాకుండా వాస్తవాల ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని రేవంత్ అన్నారు.  జలవివాదాల విషయంలో పొరుగు రాష్ట్రంలో చర్చల ద్వారా పరిష్కారం కోసం రేవంత్ ప్రయత్నిస్తుంటే, కేసీఆర్, కేటీఆర్, బీఆర్ఎస్ లు కోట్లాడి సాధించుకోవాలంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శిస్తూ రేవంత వారిరువురినీ శుక్రాచార్యుడు, మారీచులతో పోల్చారు.  

మేడారంలో రేవంత్ రెడ్డి కేబినెట్ భేటీ.. ఎప్పుడంటే?

అతిపెద్ద గిరిజన జాతర మేడారం మరో చారిత్రక ఘట్టానికి వేదిక కానుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ కేబినెట్ భేటీ సచివాలయంలో కాకుండా మేడారంలో నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఆయన నిర్ణయం మేరకు  సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మేడారంలో తెలంగాణ మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ నెల 28 నుంచి మేడారం జాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో మేడారం వేదికగా కేబినెట్ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.  ఈ నెల 18 సాయంత్రం  మేడారంలో మంత్రివర్గ సమావేశం జరిగే అవకాశం ఉంది.  ఈ సమావేశంలో రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. త్వరలో జరగనున్న పురపాలక, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్, వ్యూహాలపై చర్చించనున్నారు. అలాగే ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో.. రాష్ట్ర బడ్జెట్ రూపకల్పనపై శాఖల వారీగా కేబినెట్ చర్చించే అవకాశం ఉంది.   ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ఈ నెల 18 ఉదయం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలు అభివృద్ధి పనులకు  శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించి, ఆ తరువాత  సీపీఐ శతాబ్ది వేడుకల్లోనూ పాల్గొంటారు. ఈ కార్యక్రమాలను పూర్తి చేసుకుని అక్కడ నుంచి నేరుగా మేడారంకు చేరుకుని కేబినెట్ భేటీకి అధ్యక్షత వహిస్తారు. ఆ రోజు అక్కడే బస చేసి జనవరి 19న మేడారంలో సమ్మక్క, సారలక్క అమ్మవార్ల నూతన ప్రాంగణాన్ని ప్రారంభించి హైదరాబాద్ చేరుకుంటారు. అదే రోజు రాత్రి దావోస్ పర్యటనకు బయలు దేరుతారు.