రాజకీయ నేతల ప్రమేయం వల్లే ఆయేషాకు న్యాయం దొరకలేదు!
posted on Mar 21, 2020 @ 5:23PM
పన్నెండేళ్ల క్రితం అత్యాచారం, హత్యకు గురైన తన కుమార్తెకు ఇప్పటికీ న్యాయం జరగలేదని ఆయేషా తల్లి శంషాద్ బేగం ఆవేదన వ్యక్తం చేశారు. ఆయేషా హత్య కేసులో రాజకీయ నేతల ప్రమేయం వల్లే న్యాయం జరగలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆడపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించేలా ప్రత్యేక చట్టాలు తేవాలని ఆమె ఆకాంక్షించారు. సీపీ సీపీ సజ్జనార్ లాంటి పోలీసు అధికారి తమ కుమార్తె కేసు దర్యాప్తు చేసి ఉంటే తమకు న్యాయం జరిగి ఉండేదేమోనని ఆమె అన్నారు. దిశపై హత్యాచారానికి పాల్పడిన నిందితులందరూ సామాన్యులని.. అందుకే ఎన్కౌంటర్ చేయగలిగారని అన్నారు. ఎలాంటి రాజకీయ అండదండలు లేకపోవడంతో నిందితులను ఈజీగా కాల్చి చంపేశారన్నారు. ప్రాంతీయ, కులతత్వం, హోదా, డబ్బువల్లే తమ కుమార్తె కేసును నీరుగార్చారని ఆరోపించారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసినా న్యాయం జరగలేదని అన్నారు. ఆయేషా కేసులో పోలీసులే నిందితులని ఆమె అన్నారు.
బీ ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరాను తన హాస్టల్లోనే అత్యాచారం చేసి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన 2007లో విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం ఉమెన్ హాస్టల్లో జరిగింది. అప్పట్లో ఆయేషా మీరా హత్యాచార ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఆ కేసులో అసలైన నిందితులను రాజకీయ నాయకుల ప్రమేయంతో తప్పించారని.. తమకు న్యాయం చేయాలని ఆయేషా తల్లి శంషాద్ బేగం కోరుతున్నారు. దాదాపు 12 ఏళ్ల కిందట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సంచలన సృష్టించిన బీఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్యాచారం కేసును ప్రస్తుతం సీబీఐ దర్యాప్తు చేస్తోంది. విజయవాడ శివారులోని ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఆయేషా మీరా హత్యాచారానికి గురైంది.
నిర్బయ చట్టం తీసుకొచ్చారని దాని వల్ల ఎలాంటి ఉపయోగం లేదని అన్నారు. దేశం ధనికులు, పేదలు అనే రెండు వర్గాలుగా చీలిపోయిందన్నారు. తన కుమార్తె పేరుతో ఎలాంటి చట్టాలు తీసుకురాలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమార్తె కేసులోనూ నేరస్థులను పట్టుకుని, సీబీఐ ద్వారా శిక్ష వేయిస్తే చాలా గర్విస్తామని అన్నారు. తన కుమార్తె పేరుతో ఆయేషా చట్టాన్ని ముఖ్యమంత్రి జగన్ తీసుకురాగలరా? అని ఆమె ప్రశ్నించారు.