ఏపీ, టీ ఉద్యోగుల సర్దుబాటు!
posted on Jul 15, 2015 @ 11:38AM
ప్రస్తుతం ఉన్న పరిస్థితులవల్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఉద్యోగుల సర్దుబాటుకు సముఖత చూపుతున్నట్టు తెలుస్తోంది. ఆ దిశగా ప్రయత్నాలు కూడా జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో రెండు రాష్ట్రాలు ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చినట్టు.. ఉద్యోగుల సర్దుబాటుకు ఒప్పందం కుదుర్చుకున్నట్టు సమాచారం. ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగుల్లో ఎంత మందిని తెలంగాణకు పంపిస్తే, అంతే సంఖ్యలో తెలంగాణలో పనిచేస్తున్న ఏపీ ఉద్యోగులను తెలంగాణ ప్రభుత్వం వెనక్కు పంపిచే విధంగా సర్దుబాటు చేసుకున్నట్టు భావిస్తున్నారు. దీనికి ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు అంగీకరించారని.. దీనికి సంబంధించిన ఫైలుపై ఇప్పటికే తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మ ఇప్పటికే సంతకం చేయగా.. ప్రస్తుతం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు వద్దకు ఫైలు వెళ్లినట్లు వినవస్తోంది. మరోవైపు రెండు రాష్ట్రాలలోని ఉద్యోగుల తాత్కాలిక కేటాయింపుల ప్రక్రియ దాదాపు పూర్తి కావొచ్చింది.
మరోవైపు ఉద్యోగుల రిలీవింగ్ ప్రక్రియ కూడా ఊపందుకుంది. కానీ ఆంధ్రా, తెలంగాణ విద్యుత్ శాఖల్లో ఉద్యోగుల కేటాయింపుల్లో కొంచెం వివాదస్పద సమస్యలు ఉన్నాయి. ఈ విషయంపై ఇప్పటికే ఇరు రాష్టాల ఉద్యోగులు ఆందోళనలు చేపడుతున్నారు. ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం ఏపీ విద్యుత్ శాఖకు సంబంధించిన ఉద్యోగులను రిలీవ్ చేస్తానంటుంటే.. మరో పక్క ‘స్థానికత’ ప్రాతిపదికన ఏపీకి కేటాయించినప్పటికీ, ‘పోస్టులు లేవు’ అనే పేరిట కొందరు ఉద్యోగులను చేర్చుకోవడానికి అక్కడి ప్రభుత్వం నిరాకరిస్తున్నది. దీంతో ఉద్యోగులు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ‘ఉద్యోగుల సర్దుబాటు’ అంశం తెరమీదకు వచ్చింది. ఈ పరిస్థితుల్లో రెండు రాష్ట్రాలు ఒకవేళ ‘సర్దుబాట్లు’ చేసుకోవాలని నిర్ణయిస్తే..దానిపై ముందుగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదించాల్సి ఉంటుంది.