ఏపీ మద్యం కుంభకోణం.. జగన్ బ్యాచ్ కి బిగుస్తున్న ఉచ్చు?!
posted on May 20, 2025 @ 10:26AM
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణఏం కేసులు మాజీ సీఎం జగన్ బ్యాచ్ కి ఉచ్చు గట్టిగానే బిగుసుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఈ కేసులో కీలక నిందితులు నలుగురిని కస్టడీకి ఇవ్వాలని విజయవాడ కోర్టులో సిట్ పిటిషన్ దాఖలు చేసింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయరెడ్డి, జగన్ ఓఎస్డీ కృష్ణ మోహన్ రెడ్డి, ఈ కేసులో ఏ1గా ఉన్న కేశిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, భారతి సిమెంట్స్ డైరెక్టర్గా ఉన్న బాలాజీ గోవిందప్పలను వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు కోరారు. ఈ నలుగురినీ కలిపి విచారించాల్సిన అవసరం ఉందని సిట్ ఆ పిటిషన్ లో పేర్కొంది. ఈ నలుగురూ జగన్ కు అత్యంత సన్నిహితులు కావడం గమనార్హం.
మద్యం ముడుపులు, కమిషన్ వ్యవహరంలో ఈ నలుగురికీ తెలిసి కొన్ని విషయాలు జరిగాయనీ, అందువల్లే నలుగురినీ కలిపి విచారించాల్సిన అవసరం ఉందని సిట్ పేర్కొంది. ఈ నలుగురినీ కలిపి విచారించిన తరువాతనే ఈ కేసులో ముందుకు సాగడానికి అవకాశాలు ఉంటాయని సీట్ చెబుతోంది. ఈ నలుగురినీ కస్టడీకి కోరుతూ సిట్ దాఖలు చేసిన పిటిషన్ పై మంగళవారం ( మే 20) విచారణ జరగనుంది. మరోవైపు రాజ్కేసిరెడ్డి వాంగ్మూలం రికార్డు చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఈడీ విజయవాడ కోర్టులో మూడు రోజుల కిందట పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్పై ఏసీబీ కోర్టు సోమవారం (మే 19) విచారణకు వచ్చింది. ఈ విచారణను కూడా ఏసీబీ కోర్టు మంగళవారం (మే 20)కి వాయిదా వేసింది. దీంతో నలుగురు కీలక నిందితుల కస్టడీ పిటిషన్పై కోర్టు నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
మరోవైపు లిక్కర్ స్కాం కేసులో ఏ33గా ఉన్న గోవిందప్పను వారం రోజుల పాటు కస్టడీకి కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ కస్టడీ పిటిషన్పై ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును న్యాయస్థానం రిజర్వ్ చేసింది. అలాగే లిక్కర్ కేసులో ఏ30 పైలా దిలీప్ బెయిల్ పిటిషన్పై సిట్ అధికారులు కౌంటర్ దాఖలు చేశారు. దిలీప్కు బెయిల్ మంజూరు చేస్తే విచారణకు విఘాతం కలుగుతుందంటూ పేర్కొన్నారు. ఈ కేసులో దిలీప్ ద్వారా కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి మొత్తం వ్యవహారం నడిపించారని సిట్ అధికారులు తెలిపారు. పైలా దిలీప్ బెయిల్ పిటిషన్పై కూడా కోర్టు మంగళవారం (మే 19) విచారించనుంది. అలాగే ఈ కేసులో ఏ 6గా ఉన్న సజ్జల శ్రీధర్ రెడ్డి బెయిల్ పిటిషన్పై విచారణ కూడా ఏసీబీ కోర్టు మంగళవారమే. విచారించనుంది.మొత్తం మీద మద్యం కుంభకోణం కేసులో జగన్ బ్యాచ్ అడ్డంగా బుక్కైనట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.