Read more!

జగన్ రెడ్డి సర్కార్ కు మరో షాక్.. 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో మరోసారి షాక్. ఇంటర్మీడియెట్ ఆన్ లైన్ అడ్మిషన్లలో ఏపీ ప్రభుత్వ నిర్ణయానికి ఎదురుదెబ్బ తగిలింది. ఇంటర్ ఆన్ లైన్ అడ్మిషన్ల నోటిఫికేషన్ ను హైకోర్టు కొట్టివేసింది. ప్రస్తుత విద్యాసంవత్సరానికి  పాత పద్దతి ప్రకారమే అడ్మిషన్లు కొనసాగించాలని న్యాయస్థానం ఆదేశించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్లను అందరి అభిప్రాయాలు తీసుకొని ఆన్ లైన్ లో నిర్వహించవచ్చని హైకోర్టు సూచించింది. 

ఇంటర్మీడియెట్ లో ఆన్ లైన్ అడ్మిషన్లకు రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. ఈనెల 13 నుంచి 23 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. రాష్ట్రంలో ఉన్న ఇంటర్ కళాశాలలన్నింటిలోనూ ఆన్ లైన్ ప్రవేశాలు ఉంటాయని.. ఇందులో రిజర్వేషన్లు వర్తిస్తాయంటూ ఇంటర్ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. తొలివిడత ప్రవేశాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ వివరాలు ఇంటర్ బోర్డు వెబ్ సైట్ అందుబాటులో ఉంచారు.  దరఖాస్తు ఫీజుగా ఓసీ బీసీలు రూ.100 మిగతా వర్గాల వారు రూ.50 చెల్లించాలని పేర్కొన్నారు. రెగ్యులర్ ఓకేషనల్ కోర్టుల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.

ఆన్ లైన్ లో అడ్మిషన్లు నిర్వహించాలన్న నిర్ణయంపై కొందరు హైకోర్టుకు వెళ్లారు. దీనిపై విచారించిన ధర్మాసనం ఈ సంవత్సరానికి పాత పద్దతిలోనే అడ్మిషన్లు నిర్వహించాలని ఆదేశించింది. దీంతో  ఈ సంవత్సరం డైరెక్ట్ అడ్మిషన్లను తీసుకోవడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.