ఈరోజు ఓ కొలిక్కి రానున్న నిర్భయ దోషుల ఉరితీత వ్యవహారం..!
posted on Feb 5, 2020 @ 11:10AM
వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్న నిర్భయ దోషుల ఉరితీత వ్యవహారంపై ఈరోజు క్లారిటీ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఉరిపై స్టే విధించడాన్ని సవాల్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై ఢిల్లీ హై కోర్టు ఇవాళ మధ్యాహ్నం తీర్పు వెల్లడించనుంది. ఉరిశిక్షను తప్పించుకునేందుకు నలుగురు దోషులు రకరకాల పిటిషన్ లు వేస్తూ సాగతీస్తున్నారని కేంద్రం ఆరోపిస్తోంది. నిర్భయ దోషుల ఉరి వ్యవహారం ఇంకా కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉంది. సుప్రీం కోర్టు పిటిషన్ ను తిరస్కరించినా, రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్ లను పక్కనబెట్టినా నిర్భయ దోషులు మాత్రం ఒక్కొక్కరిగా కోర్టు మెట్లు ఎక్కుతూ కాలయాపన చేస్తూ వస్తున్నారు. ముఖేష్ కుమార్ సింగ్ వినయ్ గుప్తాలకు న్యాయపరంగా అన్ని ఆప్షన్స్ మూసుకుపోయాయి. అయితే మిగతా వారి పిటిషన్ లు పెండింగ్ లో ఉన్న కారణంగా ఉరిశిక్ష వాయిదా పడుతూ వస్తోంది.
దోషులకు న్యాయపరంగా ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకునే వరకు ఉరితీసే అవకాశం రాజ్యాంగ పరంగా లేకపోవటంతో అనేక పిటిషన్ లు తెరపైకొస్తున్నాయి. డేట్ ఫిక్స్ చేసిన తరువాత ఇప్పటివరకు నిర్భయ దోషుల ఉరి రెండు సార్లు వాయిదా పడింది. దీనిపై నిర్భయ తల్లితో పాటు వివిధ వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఆలస్యం చేయటం వల్ల న్యాయ వ్యవస్థపై నమ్మకం పోతోంది అంటూ కేంద్రం తన అసంతృప్తిని కోర్టుకు తెలిపింది. ఉరి తీయడానికి ఒక్కరోజు ముందు ట్రయిల్ కోర్టు డెత్ వారెంట్ పై స్టే విధించడాన్ని కేంద్రం ఢిల్లీ కోర్టులో సవాలు చేసింది. ఢిల్లీ ప్రభుత్వం కూడా ఉరిని నిలిపివేయడాన్ని సవాల్ చేసింది. శని, ఆది వారాలు కూడా కోర్టును సమావేశపరిచి ప్రత్యేకంగా విచారణ చేపట్టిన న్యాయస్థానం ఇవాళ మధ్యాహ్నం రెండున్నర గంటలకు తీర్పు వెల్లడించనుంది. ట్రయిల్ కోర్టు స్టే విధించడాన్ని ఢిల్లీ హై కోర్టు తప్పు పడితే మళ్లీ కొత్తగా డెత్ వారెంట్ జారీ చేయాల్సి ఉంటుంది