Read more!

ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఎస్సీనా? ఎస్టీనా?.. కక్ష సాధింపులోనే సీఐడీ నోటీసులు!

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏపీ సీఐడీ నోటీసులు ఇవ్వడం కలకలం రేపుతోంది. టీడీపీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. కక్ష సాధింపులో భాగంగానే జగన్ రెడ్డి సర్కార్.. చంద్రబాబుకు నోటీసులు ఇచ్చిందని ఆరోపిస్తున్నారు.  దేశ చరిత్రలో ఒక మాజీ ముఖ్యమంత్రి మీద ఎప్పుడైనా ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు పెట్టారా? అని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎస్సీనా, ఎస్టీనా? ఆయన ఫిర్యాదు చేయగానే ఎస్సీ ఎస్టీ చట్టం కింద ఏ విధంగా కేసు పెడతారు? అని అచ్చెన్నాయుడు నిలదీశారు. అట్రాసిటీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు.
 
అసైన్డ్ భూములను రైతుల ఆమోదంతో తీసుకుని రాజధాని కోసమే ఉపయోగించామని చెప్పారు అచ్చెన్నాయుడు. రాజధానిలో అసైన్డ్ రైతులకు కూడా జరీబు రైతులకు ఇచ్చిన ప్యాకేజీనే ఇచ్చామన్నారు. ల్యాండ్ పూలింగ్ 2015లో జరిగితే దానిపై ఇప్పుడు సీఐడీ నోటీసులు అంటూ కేసు పెట్టడం కక్ష సాధింపుకాదా? అని ప్రశ్నించారు. జగన్ రెడ్డి నేటికీ సొంత ప్రయోజనాల కోసం పేదల అసైన్డ్ భూములు వాడుకుంటున్నారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. అసైన్డ్ భూముల్లో ఇళ్లు కట్టుకున్న చరిత్ర జగన్ రెడ్డికి ఉందన్నారు. ఇళ్ల స్థలాల పేరుతో వందలాది మంది అసైన్డ్ భూములను లాక్కున్నారని మండిపడ్డారు. దశాబ్ధాలు తరబడి ఇడుపులపాయలో అసైన్డ్ భూములు వాడుకుంటన్న చరిత్ర జగన్ ది అని అచ్చెన్నాయుడు విరుచుకుపడ్డారు. 

వాన్ పిక్ భూములు లాక్కుని రైతులకు పరిహారం నేటికీ ఇవ్వలేదన్నారు అచ్చెన్నాయుడు. రాజకీయ దురుద్దేశంతోనే చంద్రబాబుపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. రాజధాని నిర్మాణం కోసం ల్యాండ్ పూలింగ్ ను చేపట్టామని, రైతుల అనుమతితోనే ఆ భూమలు సేకరికంచడం జరిగిందన్నారు. సోలార్ కంపెనీలు అవసరాలకు అసైన్డ్ భూములు బలవంతంగా లాక్కోవడానికి జగన్మోహన్ రెడ్డి ఉత్తర్వులు ఇచ్చిన విషయం వాస్తవం కాదా? అని నిలదీశారు. పేదలు ఎంతో కాలం నుండి సాగుచేసుకొంటున్న అసైన్దు  భూములను దౌర్జన్యంగా గుంజుకొని ఇళ్లస్థలాలు ఇస్తున్నారని తెలిపారు. ఇడుపులపాయలో అసైన్డ్‌ భూములు 700 ఎకరాలను 30 ఏళ్లు అనుభవించారు.. ఆ విషయం బయటపడటంతో 610 ఎకరాలు ప్రభుత్వానికి స్వాధీనం చేస్తున్నానని అసెంబ్లీలో వై.ఎస్‌. చెప్పారు.. ఆ తరవాత 300 ఎకరాలే స్వాధీనం చేస్తున్నానని మాట మార్చలేదా? అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. అసైన్డు భూముల బదిలీ నిషేధ చట్టాన్ని 2007లో సవరించి ఆర్డినెన్స్‌ ద్వారా అమలులోకి తెచ్చింది మీతండ్రి వైఎస్‌. కాదనగలరా? అని జగన్ ను సూటిగా అడిగారు.  ఫలితంగా పేదల భూములు లాక్కొని తమకు ఇష్టమైన వారికి కట్టబెట్టుకొనే వీలు కలిగించగలిగారని అచ్చెన్నాయుడు తెలిపారు.