ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడిగా మాధవ్ ఏకగ్రీవ ఎన్నిక
posted on Jul 1, 2025 @ 5:27PM
ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడి ఎన్నిక ఏకగ్రీవం అయింది. మాజీ ఎమ్మెల్సీ మాధవ్ ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల ఇంచార్జ్ పీసీ మోహన్ ప్రకటించారు. అయితే పార్టీ ఆదేశాల మేరకు ఎవరు పోటీలో నిలవకపోవడంతో ఎంపీ పురంధేశ్వరి స్థానంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్యకర్త గర్వపడేలా బీజేపీని బలోపేతం చేస్తానని ప్రకటించారు. పదవి అంటే గొప్పస్థానం కాదు.. అదొక బాధ్యత అని అన్నారు.1973, ఆగస్టు 10న ఏపీ లోని మద్దిలపాలెం లో జన్మించారు. ఆయన మాజీ బీజేపీ నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీ అయిన పీ.వీ. చలపతి రావు, పీ.వీ రాధా దంపతుల పుత్రుడు.
ఆయన డాక్టర్ వీ.ఎస్. కృష్ణ కాలేజీ నుంచి బీ.కామ్ పట్టా పొందాడు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ద్వారా మాధవ్ తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఆర్ఎస్ఎస్లో ఆయన అనేక కీలక బాధ్యతలు నిర్వహించారు. విద్యార్థి దశలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నగర కార్యదర్శి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. అనంతరం భారతీయ జనతా పార్టీలో చేరిన ఆయన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యుడిగా ఎన్నికయ్యారు.
ఈ కాలంలో బీజేపీ శాసన మండలి నాయకుడిగా కూడా వ్యవహరించారు. ఏపీ బీజేపీ స్టేట్ చీఫ్గా ఎన్నికైన పీవీఎన్ మాధవ్కు సీఎం చంద్రబాబు,శుభాకాంక్షలు తెలియజేశారు. పరస్పర సహకారంతో రాష్ట్ర అభివృద్ధికి పాటుపడదామని ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా అభినందనలు తెలియజేశారు. కూటమిలోని మూడు పార్టీల సమన్వయం, పరస్పర సహకారంతో రాష్ట్రాభివృద్ధికి పాటు పడదాం’ అంటూ ట్వీట్ చేశారు.