పుట్టగొడుగులలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లతో కరోనాకు చెక్.. సీసీఎంబీ తాజా పరిశోధన
posted on Oct 20, 2020 @ 12:47PM
కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఒక పక్క వ్యాక్సిన్ ట్రయల్స్ కీలక దశలో ఉండగా మరో పక్క ఆ వైరస్ ను యాంటీ వైరల్ ఆహార పదార్ధాలతో ఎదుర్కొనేందుకు మన దేశంలో చేసిన ప్రయోగాలు సఫలమయ్యాయి. కరోనాకు విరుగుడు మందులు రావడంలో ఆలస్యం అవుతున్న నేపథ్యంలో దీనికోసం ఫుడ్ సప్లిమెంట్లను తయారు చేసే పరిశోధన తాజాగా మన దేశంలో జరిగింది. దీనికోసం హైదరాబాద్లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) పుట్టగొడుగులపై చేసిన తాజా పరిశోధన విజయవంతమైంది. పుట్టగొడుగులలో అధికంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, బీటా గ్లూకాన్స్ వంటి యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కరోనాకు చెక్ పెట్టగలవని ఈ తాజా పరిశోధనలో తేలింది.
ఈ తాజా పరిశోధనలో పుట్టగొడుగులతో చేసిన ఫుడ్ సప్లిమెంట్ ను కరోనా వైరస్కు తక్షణ విరుగుడుగా ఉపయోగించవచ్చని పరిశోధకులు తేల్చారు. ఇందులో భాగంగా అటల్ ఇంక్యుబేషన్లోని స్టార్టప్ సంస్థ క్లోన్ డీల్స్, సీసీఎంబీతో కలిసి సంయుక్త పరిశోధనలు చేసింది. ప్రముఖ ఔషధ ఆహార ఉత్పత్తి సంస్థ ఆంబ్రోషియా ఫుడ్ ఫామ్తో కలిసి పుట్టగొడుగులతో చేసిన సప్లిమెంటును అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కొన్ని ప్రయోగాలు చేపట్టింది. పుట్టగొడుగుల్లోని కార్డిసెప్స్, కర్కమిన్తో కలిసి ద్రవ రూపంలో ఉండే ఈ ఆహారాన్ని అందుబాటులోకి తీసుకురానుంది.
పసుపుతో కలిసిన ఈ ఆహార మిశ్రమం ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరచడంతోపాటు యాంటీ ఆక్సిడెంటుగా కూడా పనిచేసి రోగ నిరోధక శక్తిని పెంచేందుకు దోహదం చేస్తుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇప్పటికే ఎయిమ్స్ ఈ ఫుడ్ సప్లిమెంటుపై పరీక్షలు నిర్వహిస్తుండగా, ఇపుడు ఎయిమ్స్ నాగ్పూర్, భోపాల్, నవీ ముంబై కేంద్రాల్లోనూ దీనిపై ప్రయోగాలు సాగుతున్నాయి. కరోనాను ఎదుర్కునే ఈ ఫుడ్ సప్లిమెంట్ వచ్చే ఏడాది ఆరంభం లో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని సీసీబీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా తెలిపారు.