కుప్పంలో అన్నా క్యాంటిన్ ధ్వంసం.. నిరసనగా బైఠాయించిన చంద్రబాబు
posted on Aug 25, 2022 @ 12:33PM
చంద్రబాబు కుప్పం పర్యటన తీవ్ర ఉద్రిక్తతల మధ్య సాగుతోంది. సొంత నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటనకు వైసీపీ కార్యకర్తలు అడుగడుగునా అడ్డు తగులుతున్నారు. చంద్రబాబు కుప్పం పర్యటన రెండో రోజు పట్టణంలోని బస్టాండ్ వద్ద అన్నా క్యాంటిన్ ను ప్రారంభించాల్సి ఉండగా ఆ క్యాంటిన్ ను వైసీపీ శ్రేణులు ధ్వసం చేశాయి. అన్న క్యాంటిన్ ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ చంద్రబాబు అక్కడే బైఠాయించారు. పెద్ద సంఖ్యలో తెలుగుదేశం కార్యకర్తలు నిరసన ర్యాలీ చేపట్టారు. ర్యాలీలో చంద్రబాబు కూడా పాల్గొన్నారు. అర్ అండ్ బి గెస్ట్ హౌస్ నుంచి బస్టాండ్ వరకూ ర్యాలీ కొనసాగింది. అనంతరం బస్టాండ్ వద్ద ధ్వంసం చేసిన అన్నాక్యాంటిన్ వద్ద చంద్రబాబు బైఠాయించారు.
ఈ క్రమంలో పోలీసులు, తెదేపా కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది. అనంతరం పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. దీంతో పలువురు తెదేపా కార్యకర్తలకు గాయపడ్డారు.
పోలీసుల తీరును చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. అంతకు ముందు చంద్రబాబు ప్రారంభించాల్సిన అన్నా క్యాంటీన్ను ధ్వంసం చేసిన వైసీపీ కార్యకర్తలు టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించారు.
ఈ నేపథ్యంలో కుప్పంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చంద్రబాబు కుప్పం పర్యటన తొలి రోజు కూడా ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. రామకుప్పం మండలం కొల్లుపల్లిలో చంద్రబాబు రోడ్ షో మార్గంలో టీడీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన పార్టీ జెండాలకు పోటీగా వైఎస్సార్సీపీ జెండా తోరణాలు కట్టారు.
దీంతో వైఎస్సార్సీపీ తోరణాలను తొలగించేందుకు టీడీపీ కార్యకర్తలు ప్రయత్నించడం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కుప్పంను పులివెందులగా మార్చడానికి జగన్ ప్రయత్నిస్తున్నారంటూ చంద్రబాబు ధ్వజమెత్తారు. రౌడీయిజానికి భయపడేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.