విజయసాయిరెడ్డికి మద్దతుగా తారకరత్న భార్య అలేఖ్య సంచలన పోస్టు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఇప్పుడు ఫేస్ బుక్ పోస్టు ఒక తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఇటీవల మాజీ ముఖ్యమంత్రి జగన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ విజయసాయిరెడ్డిపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఆ ఆరోపణలు, విమర్శలపై విజయసాయి రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తారనీ, జగన్ ను ఉక్కిరిబిక్కిరి చేసేలా ఆ కౌంటర్ ఉంటుందనీ అంతా భావించారు. అయితే జగన్ విమర్శలకు విజయసాయి రెడ్డి కంటే ముందు.. ఎవరూ ఊహించని విధంగా, దివంగత తారకరత్న సతీమణి అలేఖ్య నుంచి స్పందన వచ్చింది. 

మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కొంత కాలం కిందట జకీయాలకు గుడ్ బై చెప్పి.. వ్యవసాయమే తన వ్యాపకం అంటూ ప్రకటించిన సంగతి తెలిసిందే.  ఆయన రాజకీయ విరమణ ప్రకటించినా.. జగన్ హయాంలో జరిగిన అక్రమాలు, కుంభకోణాలకు సంబంధించిన కేసులు ఆయనను విడిచి పెట్టడం లేదు. వాటి విచారణ నిమిత్తం దర్యాప్తు సంస్థల ముందు హాజరైన సందర్భాలలో విజయసాయి రెడ్డి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాకినాడ పోర్టు భూముల కేసులో కర్త, కర్మ, క్రియా మొత్తం వైవీ సుబ్బారెడ్డి పుత్రరత్నమే అనీ, అలాగే మద్యం కుంభకోణంలో రాజ్ కేశిరెడ్డే సర్వం అని విజయసాయి రెడ్డి ఆయా కేసుల దర్యాప్తులో భాగంగా దర్యాప్తు సంస్థల ముందు హాజరైన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

ఆ తరువాత జగన్ విజయసాయి రెడ్డి విశ్వసనీయత లేని వ్యక్తిగా పేర్కొంటూ విమర్శలు గుప్పించారు. వాటికి విజయసాయి కూడా కౌంటర్ ఇచ్చారు. ఆ తరువాత తాజాగా గురువారం  జగన్ మీడియా సమావేశంలో విజయసాయిరెడ్డిపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు గుప్పించారు. కూటమి ప్రభుత్వానికి మేలు చేయడానికి విజయసాయి తన రాజ్యసభ సభ్యత్వాన్ని అమ్మేసుకున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపాయని చెప్పవచ్చు. వాటికి విజయసాయి నుంచి ఏ స్థాయిలో రిటార్డ్ ఉంటుందా అని అంతా ఎదురు చూస్తున్న సమయంలో విజయసాయి కంటే ముందుగా.. దివంగత తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి తన ఫేస్ బుక్ లో పెట్టిన పోస్టు సంచలనం సృష్టిస్తోంది. అలేఖ్యకు విజయసాయి వరుసకు బాబాయ్ అవుతారు.   నారా లోకేష్ యువగళం పాదయాత్ర సమయంలో నందమూరి తారకరత్న తీవ్ర అస్వస్థతకు గురై బెంగళూరులో చికిత్సపొందుతూ ప్రాణాలు కోల్పోయిన  కష్ట సమయంలో నందమూరి, నారా కుటుంబాలు, విజయసాయిరెడ్డి కుటుంబం అలేఖ్యకు అండగా నిలిచాయి. అది పక్కన పెడితే.. జగన్ విజయసాయిరెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు, ఆరోపణలు గుప్పించిన గంటల వ్యవధిలోనే అలేఖ్య తన పేస్ బుక్ లో పెట్టిన పోస్టు సంచలనంగా మారింది. ఆ పోస్టులో ఆమె నేరుగా జగన్ పేరు ప్రస్తావించకపోయినా విజయసాయికి మద్దతుగా జగన్ కు ప్రశ్నలు సంధించారు. ఆమె ఫేస్ బుక్ పోస్టు యథాతధంగా...ప్రజలు ఏమి చెప్పాలనుకుంటున్నారో చెప్పడానికి స్వేచ్ఛగా ఉంటారు.. కానీ నిజం లోపల నిశ్శబ్దంగా బలంగా ఉంటుంది.. కొన్ని తప్పుడు ప్రచారాలు, కథనాలు ఉన్నప్పటికీ.. అర్హత లేని వారి పట్ల గౌరవం కారణంగా మీరు ప్రశాంతంగా ఉంటారు.. నమ్మకం, విధేయత, నీతి మీరు చెప్పినవి మాత్రమే కాదు.. అవి ఇప్పటికీ కొనసాగుతున్నాయి. చాలామంది ఊహాగానాలు ప్రచారం చేస్తున్నా. మీరు కూడా మాట్లాడటం ఎంచుకుంటే ఏమవుతుందో అని నేను తరచుగా ఆలోచిస్తుంటాను.. ఎన్నో ఊహగానాలు, ఎందుకు మౌనంగా ఉన్నారు.. ఇది నిజం. అలేఖ్య చేసిన ఈ పోస్ట్ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. జగన్, సాయిరెడ్డి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరిన నేపథ్యంలో అలేఖ్య విజయసాయికి  మద్దతుగా నిలవడం ఆయనకు  పెరుగుతున్న మద్దతుకు తార్కానంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

Teluguone gnews banner