ఊరి కోసం...నాసా ఆహ్వానాన్ని వద్దనుకుంది! సాహో జయలక్ష్మి
posted on Oct 22, 2020 @ 12:34PM
పైసా ఖర్చు లేకుండా అమెరికా వెళ్లే అవకాశం వస్తే ఎవరైనా ఏం చేస్తారు.. ఎగిరిగంతేస్తారు కదా.. కానీ 17 ఏళ్ల జయలక్ష్మి మాత్రం తనకొచ్చిన అవకాశాన్ని కాదనుకుంది. తన ఊరి కోసం ప్రతిష్టాత్మక నాసా ఆహ్వానాన్ని వద్దనుకుంది. అమెరికా వెళ్లేందుకు అయ్యే డబ్బులను తమ గ్రామ సమస్యల్ని తీర్చడానికే వినియోగించింది. గ్రామ సమ్యసలు పరిష్కరించి శభాష్ అనిపించుకుని అందరికి ఆదర్శంగా నిలిచింది ఆ పదిహేండ్ల బాలిక.
తమిళనాడులోని ఆదనకోట్టై గ్రామానికి చెందిన జయలక్ష్మి చిన్నప్పటి నుంచే కష్టాలు పడింది. ఆమె చిన్నప్పుడే తండ్రి కుటుంబాన్ని వదిలేసి వెళ్లిపోయాడు. తర్వాత తల్లి అళగువల్లి మతి స్థిమితం కోల్పోయింది. తల్లితోపాటు తమ్ముడి బాధ్యతా తీసుకుని తొమ్మిదో ఏట నుంచే కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలిచింది జయలక్ష్మి. ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటూనే సెలవు రోజుల్లో వ్యవసాయ కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంది. ప్రస్తుతం ఇంటర్ చదువుతున్న ఆమె గతేడాది నాసా నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో పాల్గొంది. జిల్లాలో ఫస్ట్ ర్యాంక్ సాధించి నాసా పర్యటనకు ఆహ్వానాన్ని అందుకుంది. ఆమె అమెరికా వెళ్లేందుకు అవసరమైన విమాన ఛార్జీలు రూ.1.6 లక్షలు ఇవ్వడానికి ‘స్వర్గా ఫౌండేషన్’ అనే స్వచ్ఛంద సంస్థ సిద్ధమయ్యింది.
నాసా సంస్థ ఆహ్వానం వస్తే ఇంకెవరైనా అయితే ఎంచక్కా అమెరికా వెళ్లొస్తారు కదా. కానీ జయలక్ష్మి మాత్రం తన ఊరి కోసం ఆలోచించింది. ఆ డబ్బుని మా ఊరికోసం ఖర్చు చేయండని ఆ స్వచ్ఛంద సంస్థని కోరింది జయలక్ష్మి. ‘మా ఊళ్లో 125 కుటుంబాలుంటే ఒక్క ఇంటికీ మరుగుదొడ్డి సౌకర్యం లేదు. చిన్నప్పట్నుంచి బహిర్భూమికి వెళ్లాలంటే భయం. రాత్రిపూట ఎవరినైనా తోడు తీసుకుని వెళ్లాలి. ఈ సమస్యని పరిష్కరించాలంటే చాలా ఖర్చవుతుందన్నారు. నేను అమెరికా వెళ్లడం కన్నా ఆ డబ్బుతో గ్రామ సమస్యని పరిష్కరించడమే ముఖ్యం అనుకున్నా.. అందుకే . ఆ నగదును మా ఊళ్లో టాయిలెట్ల నిర్మాణానికి అందించమని ఎన్జీవోను కోరానని చెబుతోంది జయలక్ష్మి.
జయలక్ష్మి నిర్ణయాన్ని స్వాగతించిన స్వర్గా ఫౌండేషన్.. బాలిక కోరిక మేరకు ఆ డబ్బును గ్రామంలోనే ఖర్చు పెట్టింది. ఊళ్లోని 125 ఇళ్లకూ రూ.20వేలు చొప్పున నగదు సహాయాన్ని అందించింది. ఆ మొత్తంతో యువత సాయం తీసుకుని గ్రామస్తులే సొంతంగా నిర్మాణాలను చేపట్టారు. అలా జులైలో ప్రారంభించిన టాయిలెట్ల నిర్మాణం ఇటీవలే పూర్తయింది.
జయలక్ష్మి విషయం తెలుసుకున్న ఆ జిల్లా కలెక్టర్ గ్రామానికి వచ్చి ఆమెను అభినందించారు. జయలక్ష్మి గురించి తెలుసుకున్న మరో ఎన్జీవో సంస్థ ఆమెకు బాసటగా నిలిచేందుకు ముందుకొచ్చింది. అమెరికా ప్రయాణానికి అయ్యే ఖర్చులను ఏర్పాటు చేసింది. అయితే కొవిడ్ వల్ల వచ్చే ఏడాదికి జయలక్ష్మి ప్రయాణం వాయిదాపడింది. ఊరి కోసం నాసా ఆహ్వానాన్ని వద్దనుకున్న జయలక్ష్మిపై అన్ని వర్గాల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. ఇక పెద్దయ్యాక కలెక్టరై గ్రామాభివృద్ధికి కృషి చేస్తానంటోంది జయలక్ష్మి. ఊరి అభివృద్ధి కోసం ఎంతో గొప్ప పని చేసిన జయలక్ష్మికి మనమూ హాట్సాప్ చెప్పేద్దాం..