భక్తుల సౌకర్యార్థం తిరుపతిలో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ : టీటీడీ
posted on Dec 16, 2025 @ 2:56PM
టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు బీఆర్ నాయుడు అధ్యక్షతన మంగళవారం తిరుమల అన్నమయ్య భవనంలో ధర్మకర్తల మండలి సమావేశం నిర్వహించారు. ఇందులో ముఖ్య నిర్ణయాలు ఇలా ఉన్నాయి. టీటీడీ ఆలయాలకు ధ్వజస్తంభం, రథాలు తయారు చేసేందుకు పలమనేరులో 100 ఎకరాలలో దివ్య వృక్షాలు పెంచేందుకు నిర్ణయంచారు.
తిరుపతిలోని శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయంలో అత్యాధునిక సౌకర్యాలు కల్పించేందుకు అదనంగా రూ.48 కోట్లు మంజూరుకు ఆమోదం తెలిపారు. టీటీడీ బోర్డు ఎడ్యుకేషన్ సబ్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా టీటీడీలోని 31 విద్యా సంస్థల్లో డిజిటల్ క్లాస్ రూమ్లు, సీసీ కెమెరాలు, కంప్యూటర్లు, అందుకు అవసరమైన సాఫ్ట్వేర్లు, అవసరమైన సిబ్బంది, తదితర సౌకర్యాలను కల్పించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ముంబైలోని బాంద్రా ప్రాంతంలో రూ.14.40 కోట్లతో శ్రీవారి ఆలయం నిర్మాణానికి ఆమోదం. భక్తుల సౌకర్యార్థం తిరుపతిలోని 20 ఎకరాలలో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ నిర్మాణానికి ప్లానింగ్ కొరకు, ఆర్కిటిక్ట్ నియామకానికి ఆమోదించారు.
దాతల కాటేజీల నిర్వహణ, నిర్మాణాలపై నూతన సమగ్ర విధానం తీసుకురావాలని నిర్ణయంచారు. తిరుపతి జిల్లా తలకోనలోని శ్రీ సిద్దేశ్వర స్వామివారి ఆలయ పునః నిర్మాణ పనులలో భాగంగా రెండవ దశలో రూ.14.10 కోట్లు మంజూరు చేశారు. తిరుపతిలోని పద్మావతి మహిళా డిగ్రీ కళాశాలలో ప్రస్తుతం ఉన్న 2100 హాస్టల్ సీట్లకు అదనంగా మరో 270 హాస్టల్ సీట్లు పెంచాలని నిర్ణయంచారు. టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో నాలుగు కేటగిరిలలో ఖాళీగా ఉన్న 60 పోస్టులకు ఇప్పటికే ఇచ్చిన నోటిఫికేషన్ ఆధారంగా త్వరలో భర్తీ చేసేందుకు నిర్ణయంచారు.
టీటీడీ అనుబంధ ఆలయాలలో పని చేస్తున్న 62 మంది అర్చక, పరిచారక, పోటు వర్కర్లు, ప్రసాదం డిస్ట్రిబ్యూటర్లకు వేతనాలు పెంచాలని నిర్ణయం. ఇందులో
అర్చకులకు రూ.25,000/- నుండి 45,000/-
పరిచారకులకు రూ.23,140/- నుండి 30,000/-
పోటువర్కర్లకు రూ.24,279/- నుండి 30,000/-
ప్రసాదం డిస్ట్రిబ్యూటర్లకు రూ.23,640/- నుండి 30,000/-కు జీతాలు పెంచారు