"వృద్దుడు నిన్న మనని భ్రమ లో ఉంచాడు. ఈ గదిలో మనం శక్తి హీనులమన్న నమ్మకం కలుగజేశాడు. అ ధైర్యంలో వాడు మననిక్కడ వదిలి వెళ్ళాడు. చూద్దాం ఈరోజేమవుతుందో.....వాడిక్కడ లేడు కాబట్టి మరోసారి మన ప్రయత్నాలు చేద్దాం...." అన్నాడు శాస్త్రి.
అంటూనే అతడు వెళ్ళి ఇనపెట్టి తాళాలు తెరవబోయాడు. వెంటనే తలుపు తెరుచుకుంది.
ఇద్దరికీ కలిగిన ఆశ్చర్యమింతా అంతా కాదు.
ఇనపెట్టి నిండా డబ్బు, నగలు , వజ్రాలు...
ఓ మూలగా పట్టుచీర....
శాస్త్రి పట్టుచీర తీసుకున్నాడు.
"ఇప్పుడెం చేద్దాం?' అన్నాడు శాస్త్రి.
శాస్త్రి పట్టుచీర మదతల్లోంచి ఓ కాగితం తీశాడు.
సోమయాజులు పట్టుచీరను తాకట్టు పెట్టి తీసుకున్న అప్పు మొత్తం అయిదు వందల రూపాయలు. చీర నిండా వెండి, బంగారు జరీ వుంది.
అప్పుడు శాస్త్రి తన జేబులో నుంచీ అరువండలు తీశాడు.
'అసలు అయిదు వందలు. అందుకు నేనిచ్చికో గల వడ్డీ వంద. మొత్తం అరువందలు-- ఇనపెట్టి లో పెడుతున్నాను. ఈ వ్యవహారం నీకు నచ్చని పక్షంలో నా పెళ్ళయ్యాక చీర వాపసు చేస్తాను. నా అడ్రసు...." అంటూ ఆ కాగితం మీద వ్రాశాడు.
"ఈ కాగిత మీయింటి యువకుడి కిద్దాం-" అన్నాడు శాస్త్రి.
శర్మ ఆ కాగిత మందుకుని చదువుతుంటే శర్మ ఇనపెట్టి కు తాళం వేశాడు.
ఇద్దరూ గదిలోంచి బయటపడి ఆ యింటి యువకుడిని కలుసుకున్నారు. అతడు వరండా దగ్గరి పట్టుచీర చూసి ఆశ్చర్య పడ్డాడు. అది పట్టించుకోకుండా శాస్త్రి , శర్మ యింట్లోంచి బైట పడ్డారు.
"తిన్నగా విమల దగ్గరకు వెడదాం --" అన్నాడు శాస్త్రి.
"ఇద్దరం ప్రేమ కానుకలు సాధించినప్పుడే నువ్వు విమలను, కలుసుకున్నా, నేను అమలను కలుసుకున్నా-- " అన్నాడు శర్మ.
అప్పుడు శాస్త్రి చటుక్కున -- "అయితే మనమిప్పుడు చెంగాల్రావు పేట వెడదాం. అక్కడెం జరిగిందో తెలుసుకుందాం --" అన్నాడు.
"అక్కడింకా వృద్దుడు ఉండి -- మన దగ్గర్నించీ పట్టుచీర లాక్కుంటే ఏం చేస్తావు?' అన్నాడు శర్మ.
"భయం యిప్పట్నించీ వద్దు. పెళ్ళయ్యాక ఎలాగూ తప్పదు. ఆ వృద్దుడి క్కూడా జరిగింది చెబుతాం. వారం రోజుల భాగ్యానికి పట్టుచీరకు ఆరువందల రూపాయల అద్దె యెవరిస్తారు.......---అతడోప్పుకుంటాడని నా మనసు చెబుతోంది. పద...."అన్నాడు శాస్త్రి.
మోటార్ సైకిల్ చెంగాల్రావు పేట వైపు దూకింది.
వారు చెంగాల్రావు పేట లోని ఆయింటిని చేరుకునేసరికి వృద్దుడు -- ఆమె చెబుతున్న వేదాంత పాఠం వింటున్నాడు.
ఇల్లు, ఇల్లాలు మిధ్య అంటోందామె. మనిషి మాయా మొహం నుంచి బయట పడాలంటుందామె.
ఆ పాఠానికి శాస్త్రి, శర్మ భంగం కలిగించారు.
వృద్దుడు శాస్త్రి, చేతిలోని పట్టుచీర చూశాడు.
శాస్త్రి అతడికి తను చేసినపని చెప్పాడు.
"మీరు పట్టుచీర ఒక్కటే తీశారా?' లేక ....' అన్నాడు వృద్దుడు.
"కావాలంటే మేమూ నీతో వస్తాం. నువ్వు మమ్మల్ని పరీక్షించుకోవచ్చు--" అన్నాడు శాస్త్రి.
"ఇనప్పెట్టె లో అంత డబ్బు, అన్ని నగలు, విలువైన వజ్రాలు -- ఉండగా పట్టుచీర ఒక్కటే ఎందుకు తీశారు మీరు?' అన్నాడు వృద్దుడు.
శాస్త్రి తన కధ చెప్పాడు.
వృద్దుడాశ్చర్యంగా -- "అవకాశం చేజిక్కినప్పుడు మిగతా డబ్బెందుకు తీసుకోలేదు?' అన్నాడు.
"అవకాశాన్ని బట్టి డబ్బు తీసేవాడు దొంగ. అవసరానికి దొంగతనం చేసేవాడు మనిషి....నాది అవసరం. అవకాశంతో నాకు నిమిత్తం లేదు...."
ఆమె వృద్దుడి వంక చూసి నవ్వుతూ -- 'చూశావా--నేను చెప్పింది నిజం -- " అంది.
"ఏమిటి మీరు చెప్పింది --.......?" అన్నాడు శాస్త్రి.
"ఈ తనువు శశ్వతం కాదు . ఈ ఆస్తి శాశ్వతం కాదు. అసలీ భూమి కూడా శాశ్వతం కాదు. అలాంటప్పుడు జీవమున్నంత కాలం మనిషి తన దేహాన్ని అరిషడ్వర్గలకు బానిసగా ఉంచడంలో వల్ల -- బ్రతుకులోని మాధుర్యాన్ని కోల్పోతున్నాడు. లోభాన్ని వీడి, వ్యామోహాన్ని వదలిపెట్టి విశాల దృక్పదాన్నలవర్చుకుంటే మనిషి భగవంతుడౌతాడు. నాకు మీలో ఉత్తమ మానవుడు కన్పించాడు. అదే ఈ వృద్దుడికి చెప్పాను. ఋజువు కావాలన్నాడు. ఋజువయింది------......"
'అమ్మా!నీవు వయసులో నాకన్న చిన్న. కానీ జ్ఞానంలో నేను పసివాణ్ణి నా కళ్ళు తెరుచుకున్నాయి...." అన్నాడు వృద్దుడు.
ఆ స్త్రీ శాస్త్రి, శర్మల వంక గంబీరంగా చూసి -- "అ పట్టుచీర ఇక్కడ పెట్టి వెళ్ళండి. రేపుదయం రండి. చీరా మీకు దక్కుతుంది. ఇల్లూ మీదవుతుంది-----" అంది.
8
మర్నాడుదయం ఏడు గంటలకు శాస్త్రి, శర్మ -- చెంగాల్రావు పేట లోని ఆ యింటికి వెళ్ళారు. ఇంటిముందు టులెట్ అన్న బోర్డుంది. వివరాలకు పక్కింట్లో సంప్రదించమని వ్రాసి వుంది.
ఇద్దరూ ఆశ్చర్యపడి పక్కింటి కెళ్ళారు. పక్కింటాయన అది విని ఆశ్చర్యపడి తనూ వచ్చి టులెట్ బోర్డు చూసి -- "ఇది నేను పెట్టిందే -- కానీ చాలా కాలంగా గల్లంయింది...." అన్నాడు.
అప్పుడు శాస్త్రి తామా యింట్లోకి వెళ్ళిన విషయం చెప్పి -- "ఆ స్త్రీ ఎమయిందంటారు?----...." అన్నాడు.
పక్కింటాయన బెదురుగా -- "ఆమె ఎవరో నాకు తెలియదు. కానీ - ఇంటికి వచ్చిన వాళ్ళని వేదాంత పాఠాలతో బెదరగొట్టేస్తుంది. ఆమె కారణంగా నేనీ ఇంటి నెవరికీ అద్దె కివ్వలేకపోతున్నాను. నేనూ ఉండలేక పోతున్నాను...." అన్నాడు.
"కానీ ఆమె ఈరోజు నుంచీ ఈ యింట్లో మేమిద్దరుండవచ్చు నంది ---" అన్నాడు శాస్త్రి.
"మీరుంటారా? అయితే తప్పకుండా ఉండొచ్చు. సాయంత్రానికి రండి. ఇల్లు శుభ్రం చేయించి ఉంచుతాను--....." అన్నాడు పక్కింటాయన.
'చాలా థాంక్స్ ....మీరు చెప్పినట్లే చేస్తాం. కానీ ముందుగా యింట్లో ఓ పట్టుచీర వదిలి వెళ్ళాం. తెచ్చుకోవచ్చా?" అన్నాడు శాస్త్రి.
"ఉంటే అది మీదే -- పదండి చూద్దాం --" అన్నాడు ఇంటాయన కుతూహలంగా.
ఇద్దరూ మిత్రులు, ఇంటాయన లోపలకు వెళ్ళారు.
ఇంటికి తాళం వేసి వుండడం వల్ల పక్కింటాయన తాళం తీయవలసి వచ్చింది. లోపల యెప్పుడు వుండే బరకమూ, వ్యాస పీఠం లేవు. అసలింట్లో నరసంచార మున్నట్లే లేదు. ఒక మూలగా పట్టుచీర మడతలు వీడి కుప్పలా పడి వుంది. చూస్తె అది కట్టి విడిచిన చీరలా వుంది.
శాస్త్రి చీరను మడత పెట్టుకున్నాడు. పక్కింటాయన దగ్గర సెలవు తీసుకుని ఇద్దరూ ముందు తమ గదికి వెళ్ళారు.
అప్పటికే యింటి ముందో కారాగి వుంది.
గది ముందో యువకుడు నిలబడి వున్నాడు.
"నా పేరు శ్రీనివాసరావు. నేను వెంకటేశ్వరరావు గారి అబ్బాయిని, మీరు మా యింటికి రావాలి. మా ఇనప్పెట్టె తెరిచి పెట్టాలి--" అన్నాడతడు.
శాస్త్రికి, శర్మకు ముందేమీ అర్ధంకాలేదు.
ఆ యువకుడు ముందు వారిని కారెక్కమన్నాడు. కార్లో వారికి తన కధ వినిపించాడు.
వెంకటేశ్వరరావు చనిపోయాక కూడా దెయ్యమై ఇనపెట్టే నే అవహించుకుని తిరుగుతున్నాడు. అందులో డబ్బు, నెవరూ ముట్టుకుందుకు లేదు. ఆయనే దెయ్యమయ్యాడంటే బాగుండదని వాళ్ళ గదిలో ఓ కాపాలవాడున్నాడని నలుగురికీ చెప్పుకుంటూ తామా యింటిని వదిలి పెట్టారు.
నిన్నరాత్రి శ్రీనివాసరావు కు వెంకటేశ్వరరావు కలలో కనబడి -- తనకు జ్ఞానోదయమై వ్యామోహలూ నశించాయనీ -- తానిక యిల్లోదిలి పెడుతున్నాననీ చెప్పాడుట. ఇనప్పెట్టె లోని డబ్బు, భార్య, బిడ్డలు కాక శాస్త్రి, శర్మ అనే మరో యిద్దరు కూడా సమంగా పంచుకోవాలని అయన చెప్పాడట. తాళం శాస్త్రి, శర్మ ల ద్వారా తప్ప మరెవరికీ తెరచుకోదని, ఎంత ప్రయత్నించినా లాభం లేదని ఆయనన్నాడు. శాస్త్రి, శర్మ ల అడ్రసు మువ్వలవాని పాలెం యింట్లోని యువకుడు దగ్గరుంది. శ్రీనివాసరావు జరిగిందంతా తెలుసుకుని శాస్త్రి, శర్మ ల కోసం వచ్చాడు.
ఈ కధను శాస్త్రి, శర్మలు ఆశ్చర్యంగా విన్నారు. వరాస్చర్యం నుంచి తేరుకునేసరికి కారు మువ్వలవానిపాలెం చేరుకుంది.
అప్పటికే యింట్లో చాలా మంది చేరారు. వెంకటేశ్వరరావు భార్యాబిడ్డ లందరూ అక్కడే వున్నారు.
ఆ గదిలో.....
ఇనప్పెట్టె తాళం తీయడం యెవరి వల్లా జరగడం లేదు.
శాస్త్రి, ముందుకు వెళ్ళి తాళం తిప్పాడు. టక్కున తలుపు తెరిచుకుంది.
న్యాయంగా పంచుకోగా మిత్రులిద్దరికీ కలిసిన ఆస్ట్రి విలువ చెరొక అయిదు లక్షలు....
9
"దేవుడు మన నాశీర్వదించాడు. జీవితంలో స్థిరపడమంటున్నాడు. లేకుంటే యిలాంటి విచిత్రం జరగదు...." అన్నాడు శర్మ.
"వెంకటేశ్వరరావును మార్చినది దేవుడా, చెంగాల్రావు పెటావిడ వేదాంతమా , మన సత్ర్పవర్తనా అన్నది నాకు తెలియడం లేదు...." అన్నాడు శాస్త్రి.
"ఏమో- అంతా కలలా వుంది. మనమిప్పుడు అర్జంటుగా అమలనూ, విమలనూ కలుసుకోవాలి- పద!" అన్నాడు శర్మ.
ఇద్దరూ సోమయాజులింటికి వెళ్ళారు.
శాస్త్రి, విమలకు పట్టుచీర యిచ్చాడు.
శర్మ అమలతో అద్దె యింటి గురించి చెప్పాడు.
ఆ సమయంలో సోమయాజులు భార్య పూజలో వుంది. బావమరిది స్కూలుకు వెళ్ళాడు. సోమయాజులు ఆఫీసులో వున్నాడు.
"ఎలా సాధించారు?" అన్నారామల, విమల ఏక కంఠంతో.
శాస్త్రి, శర్మ తమ విజయ గాధ వివరించారు.
"అంటే మీరిప్పుడు లక్షాధికారులు. అయినా యింకా మమ్మల్ని ప్రేమిస్తున్నారా?' అంది అమల ఆశ్చర్యంగా.
"మా లక్షలు మీ అదృష్టాన్ని పెంచడానికే -- మా ప్రేమను త్రుంచడానిక్కాదు--" అన్నాడు శర్మ.
'అసలు మీకు-- విచిత్రమైన ప్రేమకానుకలు కోరాలని ఎందుక్కోరిక పుట్టింది?...." అన్నాడు శాస్త్రి ఆశ్చర్యంగా.
"మా అమ్మ చనిపోయే ముందు చీర కట్టుకుని ఆ యింట్లో మసలాలని ఎంతో మనసు పడింది. నాన్న ఆమె కోరిక తీర్చలేదు. ఆ కోరిక తీరకుండానే అమ్మ పోయింది. ఆమెకు మేము ప్రతిరూపాలం కాబట్టి కాబోయే భర్తల ద్వారా ఆ కోరిక తీర్చుకోవాలనుకున్నాం. నిజంగా యిలా తీరుతుందనుకోలేదు. మీరు నిజంగా అసామాన్యులు. ఆసాధారణ పురుషులు. ఒక్కసారి పక్క గదిలోకి రండి. మా అమ్మ ఆశీర్వాదం పొందవచ్చు--"అంది విమల.
అంతా పక్క గదిలోకి వెళ్ళారు.
అక్కడ గోడకు వ్రేలాడుతోందొక పటం. పటానికి పూలమాల వుంది.
"తనకేమీ అపకారం చేయవద్దని పిన్ని రోజూ అమ్మ పటానికి మాలవేసి పూజ చేస్తుంటుంది. పిన్నికి బ్రతికున్న వాళ్ళంటే ప్రేమ లేకపోయినా చచ్చిన వాళ్ళంటే భయమెక్కువ--" అంది విమల.
శాస్త్రి, శర్మ -- యిద్దరూ ఆ ఫోటో వంకే ఆశ్చర్యంగా చూస్తున్నారు.
కట్టి విడిచిన చీర యిద్దరి కళ్ళ ముందు మెదుల్తోంది.
అందరికీ వేదాంత బోధన చేయాలనుకుంటున్న చెంగాల్రావు పెటావిడ -- పట్టుచీర పై మమకారంతో దెయ్యమై ఆ యింట్లో తిరుగుతోంది. అంతవరకూ ఆ మిత్రుల బుర్రలో ఉన్న సందేహాలన్నీ పటాపంచలై పోయాయి. కానీ తాము నిజంగా రెండు దెయ్యాలతో వ్యవహరించా మన్న స్పృహ వారి వళ్ళు జలదరించేలా చేస్తోంది.
శాస్త్రి విమల చేయి పట్టుకున్నాడు. శర్మ అమల చేయి పట్టుకున్నాడు. రెండు జంటలూ వెనక్కు తిరిగాయి.
గుమ్మంలో అప్పుడే పూజ చేసుకుని వచ్చిన సోమయాజులు భార్య వుంది. ఆమె కళ్ళలో నిప్పులు కురుస్తున్నాయి.
శాస్త్రి భయపడలేదు, శర్మ భయపడలేదు. ఎప్పుడూ భయపడే అమల, విమల భయపడలేదు.
ఆ తర్వాత వచ్చిన పున్నమికి ఆ రెండు జంటలూ వెన్నెల్లో బీచి వద్ద ఉన్నాయి.
------: అయిపొయింది :-------
