"జనార్ధనరావా?" అన్నాడు ఆశ్చర్యంగా సురేష్ కుమార్.
"నువ్వు మోజాస్టిక్ హోటల్లో ఏ గదిలో వున్నావో ఆరోజున ఆ సమయానికి ఆ గది జనార్ధనరావు పేరున బుక్ చేయబడింది" అన్నాడు వెంకన్న మళ్ళీ.
"ఏమిటి ,మీరనేది ?" అన్నాడు సురేష్ కుమార్ కళ్ళు పెద్దవి చేసి.
"జనార్ధనరావుకీనీకూ ఏమిటి సంబంధమూ తెలియదు. ఇప్పుడతని యింటికి ఫోన్ చేసి దీప అనే అమ్మాయక్కడ ఉందేమో అడిగి తెలుసుకో"అన్నాడు వెంకన్న.
సురేష్ కుమార్ వెంకన్న ను అడిగి ఫోన్ నంబర్ నోట్ చేసుకుని-- నెంబర్ డయల్ చేయబోయాడు.
"ఫోన్ కి అర్ధరూపాయి చార్జి" అంది సీతమ్మ చటుక్కున.
సురేష్ కుమార్ పర్సు లోంచి డబ్బు తీసి సీతమ్మ కిచ్చి "మీ కస్టమర్స్ ని మీరు ట్రీట్ చేసే పద్దతి యిదేనా?'అన్నాడు.
"పరాయి ఆడపిల్లని గదికి తీసుకెళ్ళి కష్టాలు కొని తెచ్చుకుని సాయం అడగడానికి వచ్చిన కస్టమర్స్ కి ఇక్కడ ట్రీట్ మెంట్ యిలాగే వుంటుంది" అందిసీతమ్మ.
సురేష్ కుమార్ ఆమె మాటలు పట్టించుకోకుండా జనార్ధనరావు కి ఫోన్ చేశాడు.
"హలో!' అంది అవతల నుంచి ఒక స్త్రీ కంఠ స్వరం.
"మీ పేరు తెలుసుకోవచ్చా!" ఆడిగాడు సురేష్ కుమార్.
"నా పేరు దీప" అందవతలి కంఠస్వరం.
సురేష్ కుమార్ చేతిలోంచి ఫోన్ జారిపోయింది. అతను వున్నావాడున్నట్లుగా నేలమీద కూలబడ్డాడు.
వెంకన్న కంగారుగా "ఏమయింది?" అన్నాడు.
"జనార్ధనరావుకి ఫోన్ చేస్తే దీప పలికింది" అన్నాడు సురేష్ కుమార్ నీరసంగా.
"వ్వాట్!"అంటూ కుర్చీలోంచి యెగిరి పడ్డాడు వెంకన్న. తన ఊహ మరీ ఇంత పచ్చి నిజమై తీరుతుందని అనుకోలేదు. 'అయితే యిప్పుడే మనమిద్దరం అతడింటికి వెడదాం...."
"వద్దు సార్! జనార్ధనరావింటికి నేనే స్వయంగా వెడతాను. అతను నాకు తెలుసు. కానీ యిందులో అతడి ప్రమేయం మేమీ వుంటుందని నేననుకోవడం లేదు. కామినీ పిశాచి మానవాతీత శక్తి అన్న విషయం నేను అనుభవ పూర్వకంగా తెలుసుకున్నాను" అంటూ సురేష్ కుమార్ లేచి నిలబడి "వస్తాన్ సార్. మళ్ళీ మీ ఇంటికి రావాల్సిన అవసరం లేకుండా చేసుకుందుకు ప్రయత్నిస్తాను...." అన్నాడు.
10
"ఆ దరిద్రుడ్ని చూడాలని వచ్చాను" అన్నాడు వెంకన్న.
"ఇక్కడ చాలామంది దరిద్రులున్నారు. వాళ్ళలో ఏ దరిద్రుడో చెప్పు"అన్నాడు శంకర్రావు.
'చంద్రరాజు!" అన్నాడు వెంకన్న.
"వాడా.....వాణ్ని ప్పుడే బెయిల్ మీద విడిపించుకుని తీసుకువెళ్ళారు!"
"చంద్రరాజుకు బెయిలా?" కోపంగా అన్నాడు వెంకన్న.
"నిన్నింత కోపంగా ఎప్పుడూ చూడలేదు. చంద్రరాజు కేమిటి?అంతకంతెపెద్ద పెద్ద ఘోరాలు చేసిన వాళ్ళకే బెయిల్ ఇస్తున్నాం" అన్నాడు శంకరరావు.
"చంద్రరాజు చేసినఘోరానికీ మిగతా ఘోరాలకీ పోలికుండదు. వాడి ఘోరాన్ని భగవంతుడు క్షమించినా నేను మాత్రం క్షమించలేను" అన్నడువెంకన్న.
"మరీ ఇంతలా ఆవేశ పడుతున్నావేమిటి వేళా?" అన్నాడు శంకరరావు ఆశ్చర్యంగా.
"నా బాధ నీకర్ధంకాదులే...." అని కళ్ళు తుడుచుకున్నాడు వెంకన్న "ఇంతకీ ఆ దరిద్రుడ్ని బెయిల్ మీద విడిపించి తీసుకెళ్ళిన నీచుడెవరు?"
"ఈరోజు నీనోటి దురుసు మరీఎక్కువగా వుంది. కాస్త జాగ్రత్తగా మాటలు వాడకపోతే నీమీద ఎవరైనా పరువు నష్టం దావా వేయగలరు. చంద్రరాజు ను విడిపించిన వాడు నీచుడు కాదు. అతను నీక్కూడా తెలుసు. అతని పేరు జనార్ధనరావు. కావాలంటే అతడింటికి వెళ్ళి మిగతా విషయాలు తెలుసుకో"అన్నాడు ఇన్ స్పెక్టర్ శంకర్రావు.
"జనార్ధనరావా?" ఉలిక్కిపడ్డాడు వెంకన్న. అతడి ఆలోచనలు పరిపరివిధాల పోయాయి.
ఈ జనార్ధనరావు కి నేరస్థులతో పని ఏమిటి? సురేష్ కుమార్ పైన అతనెందుకు పగబట్టాడు? అతనసల ఇంకా ఎలాంటి నేరాలు చేస్తున్నాడు?
"జనార్ధనరావు అంతు చూడాలి. అతని కధ ఈ రోజుతో పూర్తిగా తేల్చేయాలి" అనుకున్నాడు వెంకన్న. అలా అనుకుని అతను టైం చూసుకున్నాడు. రాత్రి ఎనిమిదిన్నర అయింది.
ఇన్ స్పెక్టర్ శంకరరావు దగ్గర సెలవు తీసుకుని వెంకన్న కారులో తిన్నగా జనార్ధనరావు యింటికి బయల్దేరాడు. అతడి కారు జనార్ధనరావు బంగళా ముందు ఆగింది.
కారు ఆగగానే ప్రహరీ గేటు తెరుచుకుంది. గేటు తీసిన వ్యక్తీ జనార్ధనరావు!
జనార్ధనరావు వెంకన్న వంక ఆశ్చర్యంగా చూసి "ఈసమయంలో మీరిక్కడకు వస్తారనుకోలేదు!" అన్నాడు . మనిషి కాస్త తడబాటు చూపిస్తున్నాడు.
"మీతో అర్జంటుగా మాట్లాడాలి. లోపలకు వెడదామా" అన్నాడు వెంకన్న కారు దిగి.
"ఇలా ఇక్కడ లాన్ లో కూర్చుని మాట్లాడుకుందాం" అన్నాడు జనార్ధనరావు.
ఇద్దరూ లాన్ లో కూర్చున్నాక "చంద్రరాజుతో మీకు పనేమిటి?" అన్నాడు వెంకన్న.
"చంద్రరాజు.....వాడు మీకెలా తెలుసు?"
చంద్రరాజు పైన తనకెంత కసి పేరుకుపోయి వుందో వెంకన్న జనార్ధనరావు కు చెప్పి "అలాంటి వాడ్ని బెయిల్ మీద విడిపించిన మీపై నాకు సదభిప్రాయం లేదు" అన్నాడు.
జనార్ధనరావు చటుక్కున లేచి నిలబడి "పదండి మీకు నేను చంద్రరాజును చూపిస్తాను" అన్నాడు. వెంకన్న లేచి నిలబడగానే "చంద్రరాజు కనబడగానే మీరేం చేయాలనుకుంటున్నారు?' అనడిగాడు.
"నోటితో చెప్పాడమెందుకు? మీరే చూద్దురు గానీ" అన్నాడు వెంకన్న.
వెంకన్న, జనార్ధనరావు ఇంట్లోకి నడిచారు. ఆ ఇల్లు, ఆ సమయం హటాత్తుగా వెంకన్నకు ఏదో స్పురణ కు తెచ్చాయి. కొంపదీసి తను కూడా సురేష్ కుమార్ లాగే.... ఈ ఇంట్లో ....కోరి చిక్కుల్ని ఆహ్వానించడం లేదు కదా! వెంకన్న కు ఒక్కసారి వళ్ళు జలదరించింది. అతను జనార్ధనరావు వంక చూశాడు.
అతను తాపీగా అడుగులు వేస్తూ ఓ గదిని సమీపించి డోర్ వ్యూ మిర్రర్ లోంచి చూసి "మీరు కూడా చూడండి వెంకన్న గారూ!"అన్నాడు.
వెంకన్న కుతూహలంగా అందులోకి చూశాడు. అంతే .....అతడికి నోట మాట రాలేదు...
సురేష్ కుమార్ వర్ణించగా ఏమో అనుకున్నాడు కాని ఆ వర్ణనలకు మించి భయంకరంగా వుంది కామినీ పిశాచి. ఆమె ఓ యువకుడ్ని తరుముతోంది. అతడామె బాహు బంధాల నుంచి తప్పించుకోవడం కోసం గదిలో విఫల యత్నాలు చేస్తూ పరుగులు తీస్తున్నాడు.
"వాడె చంద్రరాజు!" అన్నాడు జనార్ధనరావు తాపీగా.
"ఏమిటిది?" అన్నాడు వెంకన్న అతి కష్టం మీద.
"గదిలో చంద్రరాజును వేటాడుతున్నది . మనిషే కాని పిశాచం కాదు. ఒకప్పుడు ఆమెకూడా అందరు ఆడవాళ్ళ లాగే అందంగా వుండేది. ఒక అగ్ని ప్రమాదంలో ఆమె ఈ భయంకర రూపాన్ని సంపాదించుకుంది. ఈరూపంతో ఎలా జీవించడమో అని వ్యధ పడుతున్న ఆమెను నేను చేరదీసి ఆమె జీవితానికి ఓ అర్ధం కల్పించాను. అదేమిటంటే ....."అని జనార్ధనరావు క్షణం ఆగి------
"వెంకన్న గారూ ! భగవంతుడు ఆడదాన్ని అబలగా సృష్టించాడు. కానీ ఆడది లేని ఈ సృష్టికి ఉనికి ఎక్కడిది? అటువంటి ఆడదాని పై పశు బలంతో అత్యాచారం కావించడం కన్న ఘోరముంటుందా? ఇష్టం లేని పురుషుణ్ణి బలవంతంగా భరించవలసి వచ్చినందుకు జీవితమంటే వగటు పుట్టి తన ప్రాణాలు తీసుకుంది రాధ. రాధ చావుకు కారకుడు సురేష్ కుమార్.
నేను జరిగింది తెలిసి ఫరవాలేదని ధైర్యం చెప్పినా కూడా రాధ వినకుండా తన ప్రాణాలు తీసుకుంది. బలవంతంగా అనుభవించబడడం లో ఒక ఆడది పడే బాధ యెలాంటిదో మగాడి క్కూడా తెలియాలి గదా! అందుకే నేను ఆ గదిలో వున్న ఆడమనిషిని కామినీ పిశాచిగా తయారు చేశాను. ఆమెను చేరబోయే పురుషుడు ముందు గానే శక్తిహీనుడయ్యే విధంగా భోజనం లో మత్తు పదార్ధాలు కలిపిస్తున్నాను. ఆ శక్తి హీనుణ్ణి నా కామినీ పిశాచీ బలవంతం చేస్తుంటే నేనుచూసి ఆనందిస్తున్నాను. సురేష్ కుమార్ ను వెంటాడి వేటాడి అతనికి ఆడపిల్లలంటే భయం పుట్టేలా చేశాను. అతను నా దగ్గరకు వచ్చాడు. కామినీ పిశాచి నా దగ్గరకు కూడా వచ్చిందని -- నాకు ఆడవాళ్ళంటే ప్రలోభం లేకపోవడం వల్ల అది నన్నేమీ చేయలేదనీ అతడికి చెప్పాను.
ఇప్పుడు చంద్రరాజు విషయం లోనూ అంతే! వాడు మీ పెద్దనాన్నగారి అమ్మాయిని బలవంతం చేశాడు. ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఆ ఆవేదనలో వాణ్ని బాదాలని మీరుత్సుకత పడుతున్నారు. నాకు తెలుసు మీరెంతగా తన్ని తే మాత్రం -- ఇష్టం లేని మగాడి చేత ఒక ఆడది బలవంతం చేయబడడం లో ఉండే బాధ ఎలా తెలుస్తుంది వాడికి? చంద్రరాజే కాదు.....ఆడదాని పై అర్యాచారం చేసిన ప్రతి మగ వెధవ పైన నేను ఆకామినీ పిశాచి ని వదిలి పెడతాను. అలాంటి వాళ్ళ కోసం పరశు రాముడిలా దేశమంతా గాలిస్తూనే వుంటాను" అన్నాడు.
ఈ కధ విని వెంకన్న అడిరిపోయాడు. అతడి ఆవేశం అణగారి పోయింది. అతను చటుక్కున జనార్ధనరావు చేతులు పట్టుకుని "నేను హింసను భరించలేను. దారుణంగా హత్యలు చేసిన వాళ్ళను కూడా ఏమాత్రం వీలున్నా క్షమించి వదిలి పెట్టాలనే మనస్తత్వం నాది. అయినప్పటికీ కూడా నేను మిమ్మల్ని, మీ శిక్ష నూ అభినందిస్తున్నాను. మీరు చేసేది తప్పు కాదు. మీరు పరుశు రాముడై సురేష్ కుమార్, చంద్రరాజు లాంటి వాళ్ళను వెతికి పట్టుకుని ఈ విధమైన వైద్యం చేయించి పంపండి. అదే మీరు మీ రాధకు చేయగలిగిన సేవ" అన్నాడు.
"వెంకన్న గారూ!" అన్నాడు జనార్ధనరావు ఆశ్చర్యంగా "మీరు నా ఈ చర్యను ఆమోదిస్తున్నారా?"
"తప్పకుండా! ....ఇంతకాలం మీరు ప్రభ, దీప ...వగైరా అమ్మాయిల సాయం తీసుకుని మీ దీక్ష కొనసాగిస్తున్నారు. మీకు సాయపడడానికిప్పుడొక డిటెక్టివ్ కూడా వున్నాడు. చంద్రరాజు అనుభవిస్తున్న శిక్ష నా మనసును తేలిక చేసింది. వాడు చేసిన ఘోరం వాడికి అర్ధం కావడానికింతకు మించిన ఉపాయం లేదు. ఎటొచ్చీ ఈ విషయానికి ప్రచారం కూడా వుంటే కానీ దుర్మార్గుల్లో భయం పుట్టదు. కామినీ పిశాచి గురించి నలుగురికీ తెలిసేలా నేను చేయగలను. అలాగే నీ పేరు మరుగున వుండేలా చూడగలను...." అన్నాడు వెంకన్న.
వెంకన్న దృష్టిలో "అపన' పత్రిక మెదుల్తోంది.
-----అయిపొయింది.-------
