ఈ తోరణ గోపురముల క్రిందనుండి నాలుగు ముఖములఁబోవు రాజవీదులు మిక్కిలి వెడల్పుగా నుండి రమ్యముగా నున్నవి. రాజవీధులం దిరుప్రక్కలను ఋష్పలావికలు పరిమళము గ్రమ్ముకోను నానా విధపుష్పముల విక్రయించు చుందురు. అంగడి వాండ్రు తమ యంగళ్ళముందుట అందమైన మంచేలు గట్టుకొని, తమ సరకుల నమ్ముకొనుచుందురు. ఇట్లిరుప్రక్కలకు అంగళ్ళు, పుష్పలావికలు స్థలమాక్రమించు కొన్నను ఆశ్వికులు , పధికులు, ఏనుగులు , బండ్లు, పల్లకీలు మున్నగునవి గుంపులు గుంపులుగ నిసుకవైచిన రాలకుండ వచ్చుచుఁబోవుచుండుటకు వీలయినంత వెడల్పుగా రాజ వీధులున్నవి. ఈ వీధులు చాలా పొడవై చూపుమేఱకు వ్యాపించియుండి చూచుటకు మనోహరములై యున్నవి. ఏవంక చూచినను పరిమళ భరిత కుసుమజాతులే కనబడుచుండును. అన్ని పుష్పములలో నీ దేశీయులకు గులాబీ పూవులన్నా మిక్కిలి యిష్టము. అవి విశేషముగా దొరుకును. ఇచ్చట ప్రజలకు బూవులన్న ప్రాణము. ఆహార మెంత ఆవశ్యకమో పూవులంత యవష్యకము. భోజనమైన లేకుండఁ బోవుదురు గాని స్త్రీ పురుషులు పూవులు ముడవకుండ నెచ్చటకుఁ బోలేరు. ఒక్కొక్క విధమగు వస్తుచయమును విక్రయించు నొక్కొక్క యోడ వర్తకులోక్కొక్కచోట గుమిగూడి వ్యాపారము చేసికొందురు. ఏ సరకుల యోడ , ఆ సరుకులదే గాని యింకొక సరుకా యెడలో దొరకదు.
ఇచ్చట రత్న వర్తకులు నిర్భయముగఁ దమ సరుకులను ఎంత విలువ గలవాని నైనను వజ్రవైడూర్యాది రత్నములు మొదలైన వానిని విచ్చల విడిగా రాసుల క్రింద బోసి నడి వీధులందు విక్రయించుచుందురు.
అత్యంత రమణీయమైన యచ్చోటి నగిరి వాకిటి కెదురుగా నున్న నాలుగు వీధులందును, చక్కగ నునుపైన రాతికాలువగుండా పరిశుద్దజలము నగరులోనికి పట్టణములోనికి నెడతెరిపి లేక ప్రవహించుచుండును. ఈ రాతి కాలువలు పట్టణమునందంతటను గాన్పించును.
రాయల సౌధమునకుఁ గుడివైపున మంత్రిశేఖరుని సభామంటపము గలదు. ఆ విశాల మంటపమునకు నలుబది స్తంభములు గలవు. దాని కెదురుగా మానవుని కంటే నెత్తయిన వసారా యొకటి కలదు. ఆ వసారా యించుమించుగ నిరువది గజముల పొడవు, ఆరు గజముల వెడల్పును గలదిగా నున్నది. దీనిని 'దస్తర్ ఖానా' యని పిలుతురు. రాజ్యమునకు సంబంధించిన యావత్తు కాగితములు, పత్రములు, మొదలగున వన్నియు దస్త్రములుగా కట్టి యందుంతురు. ఇచ్చటనే కరణములు తెరపిలేక లేఖలు వ్రాయుచు గూర్చుందురు. ఇచ్చటి జనులు రెండు విధముల వ్రాత సామాగ్రి నుపయోగీంతురు. అందు మొదటిది : రెండు గజముల పొడవును , రెండు వ్రేళ్ళవెడల్పును గల తాటాకులు. ఈ జమ లతాటియాకులపై గంటములతో వ్రాయుదురు. ఇక రెండవది : తెల్ల పలకలకు నల్లని రంగు పూసి వానిపై రాతి బలపముతో వ్రాయుట.
స్తంభములు గల యీ సభా మంటపముపైన ఎత్తైన వేదిక పై దండ నాయకుఁడు రాజకీయోద్యుగులు దన్ను పరివేష్టింప నిండుకొలు వుండును. ఉభయపార్వ్సముల యందును వ్రేతహస్తులు బారులు దీరి నిలువంబడియుందురు. దండనాయకునితో విజ్ఞాపన మొనరించుకొనఁ దలచినవారు, ఈ వేత్రహస్తుల నడుమ నడచి వచ్చి ఏదైన నొక వస్తువును గానుకగా నొసఁగి సాష్టాంగ దండ ప్రణామ మాచరించి, నిలువఁబడి ముకుళిత హస్తులై శిరము వంచి తెలుపుకొందురు. దండనాయకుండును వారి విన్న పమాలించి , యుచిత రీతిని న్యాయవిమర్శన గావించి తీర్పిచ్చి పంపివేయును. అతని తీర్పునకు దిరుగులేదు. దండనాధుడు కొలువు నుండి వెడలిపోవునప్పుడు కొలువు చాలింపబడును. ఆయనకు ఏడు రంగుల గొడుగులు. అతడు బయలుదేరునపుడా చత్రములు గైకొని పరివారములు ముందు నడుతురు..... ముందు వేత్రహస్తులు బరాబరులు దెలుపుచుండ దండనాయకుఁడు బయలు వెడలి రాజమందిరమున కరుగును. రాజనగరునకు దండనాయకుని సభామంటపమునకు నడుమ ఏడు కక్ష్యాంతరములు కలవు. ఒక్కొక్క కక్ష్యాంతరము గడచినప్పుడు అతని వెంట పట్టుకొని రాఁబడు గొడుగులలో ఒకటి తర్వాత నొకటి వరుసగా మూసి వెనక నుంచఁబడును. రాజసముఖమున దండనాయకుఁడోంటరిగఁ బ్రవేశింపవలయును. ప్రవేశించి రాజ్యము నందలి సర్వ వృత్తాంతములు నాతనికి దెలిపి , యాతని యాజ్ఞాల గైకొని సెలవు దీసికొని పోవుచుండును. దండనాయకుని మందిరము రాయల నగరనకు వెనుక భాగమున నున్నది.
నగరున కెడమవైపున దండనాయకుని సౌధము కలదు. దానికి వెనుక టంకశాల కలదు. ఇచ్చట నీ దేశమునందు చలామణి యగుచున్న నాణెము లన్నియు ముద్రింపబడుచున్నవి. ఈ దేశమున మూడు విధముల బంగారు టంకములు రాగి కలిపి ముద్రింపబడుచున్నవి. వానిలో మొదటిది 'వరహా' వరహాలో సగము విలువ గల నాణెమునాకు ' ప్రతాప' మని పేరు. మూడవ నాణెము పేరు 'ప్రణము' వరహాకు ఇరువది పణములు. పణమునకు ఆరు 'తరము' లను వెండి నాణెములు వచ్చును. 'తరము' నకు మూడు 'జత' లను రాగి టంకములు వచ్చును. ఈ దేశాచారమును బట్టి రాయలకు సామంత మండలేశ్వరులు, మహా మండలేశ్వరులు తా మీయవలసిన కప్పమును సంవత్సరమున కొకమారు టంకసాల యందుఁ జేల్లించుట యలవాటు.......రాయల కోశాగారమునందు ధనము దాచుకొనుటకై పాతాళపు కొట్టు లనేకములు కలవు. అందు బంగారము వెండి కరిగించి దిమ్మలుగాఁ బోసి యుంచెదరు. ఆ దేశమునందు పేదవాఁడు మొదలుకొని భాగ్యవంతుని వఱకు స్త్రీలు, పురుషులు , బాలురు, చివరకు వీధులలో దొమ్మరియాటలాడు దొమ్మరులు సైతము చేతులకు, దండలకు, మెడలకు, కాళ్ళకు అమూల్య రతనాభరణములో, పూతమెఱుంగు నగలో ఏవో కొన్నింటి నైనను ధరింతురు.
రాయలకు మంచి చక్కనైన యేనుఁగు ఒకటి కలదు. ప్రతి యుదయము నీ మందకరీంద్రమును రాయల సముఖమునకుఁ గొనివత్తురు. ప్రాతః కాలమున నీ యేనుగును దర్శించుట రాయలకు శుభదాయకమట. రాయల వారి రాచయేనుఁగులకు అన్నము వండి పెట్టుదురు. ఆ వంట యా యేనుగుల ముందటనే వండవలయును. అన్న ముడికిన పిమ్మట ఆ యన్నమునందు కొంచెముప్పును బెల్లమును వేసి రెండేసి మణుగుల బరువు గల ముద్దలుగాఁ జేసి నేతిలో గానిఁ పెరుగులో గాని ముంచి యా జంతువుల నోటిలో నుంతురు. ఒక్కొక్క యేనుఁగునకు నొక్కొక్క సాల చొప్పున నన్నింటికిని నన్నిసాలలు కలవు. ఆసాలల గోడలు ఎత్తుగా నుండి బలిష్టములుగా నున్నవి. ఆ గోడలపైన లావు దూలములును, వాని పైన కర్రసరంబియుఁగలవు. పైనున్న దూలములకును, ఈ యేనుఁగుల వీపులకును మెడలకును, ఇనుప గొలుసులు గట్టిగాఁ గట్టఁబడియుండును. వీని ముందఱ కాళ్ళకు గొలుసులు సంకెలలు గూడఁ దగిలించఁబడును.
