'సర్కారు వారి పాట' విలన్ ఎవరు?
on Jul 16, 2020
'సరిలేరు నీకెవ్వరు' లాంటి కెరీర్ హయ్యెస్ట్ గ్రాసర్ తర్వాత సూపర్స్టార్ మహేశ్ 'సర్కారు వారి పాట'ను మరింత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాడు. 'అల.. వైకుంఠపురములో' మూవీతో పోటీలో 'సరిలేరు నీకెవ్వరు' కాస్తంత వెనుకబడటంతో, ఈసారి ఆ తరహా ఫలితం ఉండకుండా బాక్సాఫీస్ దగ్గర తిరుగులేని కింగ్ అనిపించుకోవాలనే పట్టుదలతో ఉన్నాడు మహేశ్. అందుకు అనుగుణంగానే 'సర్కారు వారి పాట'ను మంచి కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపొందించేందుకు సన్నద్ధమవుతున్నాడు డైరెక్టర్ పరశురామ్.
ఇప్పటికే ఈ సినిమాలో నాయికగా కీర్తి సురేశ్ ఎంపిక కాగా, మహేశ్ తల్లి పాత్రకు భాగ్యశ్రీ దాదాపు ఖరారైనట్లే అంటున్నారు. అయితే ఎటు తిరిగీ, కీలకమైన విలన్ రోల్ను ఎవరు చేయనున్నారనే విషయంగా ఇంకా క్లారిటీ రాలేదు. ఇదివరకు ఉపేంద్ర, సుదీప్ పేర్లు చక్కర్లు కొట్టగా, కొద్ది రోజులుగా అరవింద్ స్వామి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే ఇంతదాకా అతను ఈ సినిమాకు సంతకం చేయలేదని విశ్వసనీయ సమాచారం. ఈ మూవీలో విలన్ క్యారెక్టర్ వల్ల హీరో క్యారెక్టర్ ఎలివేట్ అవుతుందనీ, అందువల్ల బలమైన విలన్ అయితేనే ఆ క్యారెక్టర్కు న్యాయం చేస్తాడనీ పరశురామ్ భావిస్తున్నాడు.
'ధ్రువ' మూవీలో పాలిష్డ్ విలన్గా అరవింద్ స్వామి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇక సుదీప్ సంగతి చెప్పాల్సిన పనిలేదు. 'ఈగ' మూవీకి విలన్గా అతను కాకుండా వేరొకరిని ఊహించలేం అన్నంతగా అతను రాణించాడు. ఉపేంద్ర ఇంతదాకా తెలుగు సినిమాలో విలన్గా కనిపించలేదు. 'సన్నాఫ్ సత్యమూర్తి'లో పవర్ఫుల్ రోల్ చేశాడు కానీ, అది యాంటాగనిస్ట్ క్యారెక్టర్ కాదు. అయితే ఈ ముగ్గురిలో ఎవరు విలన్గా చేసినా సౌత్లోని మిగతా భాషల్లోనూ 'సర్కారు వారి పాట'కు మరింత క్రేజ్ వస్తుందనేది ఖాయం. చివరకు ఈ మూవీలో విలన్గా ఎవరు కుదురుకుంటారో వేచి చూడాల్సిందే.
Also Read