ప్రముఖ మరాఠీ నటుడు మృతి
on Oct 8, 2020
ప్రపంచానికి ఈ ఏడాది అసలు ఏమాత్రం కలిసిరాలేదు. కరోనా ప్రతి ఒక్కరి జీవితాలను కకావికలం చేసింది. ముఖ్యంగా చిత్ర పరిశ్రమకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఒకవైపు కరోనా... మరోవైపు వరుస సినీ ప్రముఖుల మరణాలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
హిందీ చిత్ర పరిశ్రమలో ఈ ఏడాది కథానాయకులు ఇర్ఫాన్ ఖాన్, రిషి కపూర్, సుశాంత్ సింగ్ రాజ్ పుత్, సంగీత దర్శకుడు వాజిద్ ఖాన్ వంటి ప్రముఖులు, భారతీయ సంగీత ప్రపంచంలో శిఖరాగ్ర స్థాయి కలిగిన ఎస్పీ బాలసుబ్రమణ్యం భువి నుంచి దివికి వెళ్లిపోయారు. తాజాగా ప్రముఖ మరాఠీ నటుడు అవినాష్ ఖర్షికర్ మరణించారు.
మరాఠీ చిత్రాలు, టీవీ సీరియళ్ళలో 1978 నుంచి అవినాష్ నటిస్తున్నారు. ఎక్కువగా కామెడీ వేషాలు వేశారు. ఆయన కామెడీ టైమింగ్ కి స్పెషల్ ఆడియన్స్ ఉన్నారు. ముంబైలోనే నివాసం ఉంటున్నారు. గురువారం గుండెపోటు రావడంతో హుటాహుటిన ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అయినా... ప్రయోజనం లేకపోయింది. సుమారు పది గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు ప్రస్తుతం 68 సంవత్సరాలు. భార్య, కుమార్తె ఉన్నారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
