ఇండియన్ పనోరమలో ‘ఎఫ్2’కి అవార్డు.. గర్వంగా ఉందన్న వెంకీ!
on Oct 21, 2020
‘ఎఫ్2’కి ఇండియన్ పనోరమా–2019లో అవార్డు రావడం పట్ల విక్టరీ వెంకటేశ్ సంతోషం వ్యక్తం చేశారు. తనకు గర్వంగా ఉందని ఆయన ట్వీట్ చేశారు. వెంకటేశ్, వరుణ్తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘దిల్’ రాజు నిర్మించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఎఫ్2’. 'ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్' అనేది ఉపశీర్షిక. గతేడాది సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా వసూళ్ల పరంగా పలు రికార్డులు సృష్టించింది. ఇప్పుడు అవార్డులు కూడా సొంతం చేసుకుంది.
ఇండియన్ పనోరమా–2019లో ‘ఎఫ్2’ సినిమాతో పాటు దర్శకుడు అనిల్ రావిపూడికి సైతం అవార్డు వచ్చింది. అందుకు సంతోషం వ్యక్తం చేసిన వెంకటేశ్, ‘‘ఈ సినిమాలో భాగం అయినందుకు చాలా సంతోషంగా ఉంది. నన్ను నమ్మిన అనిల్ రావిపూడికి థ్యాంక్స్. మరోసారి మా టీమ్ అందరికీ కంగ్రాట్స్. ఈ ప్రయాణంలో నన్ను ఓ భాగం చేసినందుకు థ్యాంక్స్’’ అని రెండు ట్వీట్లు చేశారు.
2019 ఏడాదికిగానూ వివిధ భాషలకు చెందిన 26 సినిమాలకు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖ బుధవారం అవార్డులు ప్రకటించింది. అందులో చోటు దక్కించుకున్న ఏకైక తెలుగు సినిమా ‘ఎఫ్2’ కావడం విశేషం. ఈ సినిమాలో వెంకటేశ్ సరసన తమన్నా, వరుణ్తేజ్ సరసన మెహరీన్ హీరోయిన్లుగా నటించారు.