నా భయాలతో ఫైట్ చేస్తూ వస్తున్నా!
on Jan 10, 2020
'అరవింద సమేత' సినిమా నుంచి తన భయాలతో ఫైట్ చేస్తూ వస్తున్నానని అంటున్నారు డైరెక్టర్ త్రివిక్రమ్. భయాలను గెలవడానికే ఆ సినిమా చేశానని కూడా ఆయన అంటున్నారు. అల్లు అర్జున్ హీరోగా ఆయన రూపొందించిన 'అల వైకుంఠపురములో' మూవీ జనవరి 12న విడుదలవుతోంది. ఈ సందర్భంగా సంక్రాంతికి పోటీపడుతున్న తన సినిమా, 'సరిలేరు నీకెవ్వరు' వేర్వేరు తరహా సినిమాలని ఆయన చెప్పారు.
"ఎవరికైనా కెరీర్ స్టార్ట్ అయ్యేటప్పుడు తనలో ఉన్న ఆలోచనలన్నీ అందరికీ చెప్పెయ్యాలనీ, వాళ్లందరి ప్రశంసలూ పొందాలనీ, తన ఆలోచనలతో వాళ్లందరూ ఏకీభవించాలని ఉంటుంది. కొన్ని సంవత్సరాలు గడిచాక.. ప్రశంస తగ్గిపోతుంది, అంచనాలు పెరిగిపోతాయి. ఎప్రిసియేషన్ తగ్గిపోవడం మూలంగా, క్రియేట్ చేసేవాళ్లకు మన పనిలో ఏమైనా లోపముందా అనిపించే ఛాన్స్ ఉంది. అలాగే, దారి మార్చుకొని ఎందుకూ పనికిరాకుండా పోయే ప్రమాదమూ ఉంది. లేదంటే ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోవడం మూలంగా ఆ బరువుకు కుంగిపోయి, చెప్పాలనుకున్నది చెప్పలేక కుంగిపోయి, ఒక నార్మల్ లేదా సేఫ్ రూట్లోకి ఎస్కేప్ అయిపోయే ఛాన్స్ కూడా ఉంది. ప్రతిసారీ ఈ రెంటినీ గెలవడానికి ఎవరైనా ప్రయత్నించాల్సిందే. 'అరవింద సమేత' నుంచి నా భయాలతో ఫైట్ చేస్తూ వస్తున్నా.
'అజ్ఞాతవాసి' ఫ్లాపైన తర్వాత అందరూ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే.. ఆయనకు అలవాటైన హ్యూమర్లోకి, ఎంటర్టైన్మెంట్లోకి వెళ్లిపోతే బాగుంటుంది కదా.. అనిపిస్తుంది. నా చుట్టూ ఉన్నవాళ్లు కూడా ముందు దానివైపే తోస్తారు. నేనది చెయ్యలేదు. అది కావాలని తీసుకున్న డెసిషన్. ఎంత పరాజయం చూసినా కానీ కొత్తగా భయపెట్టేది ఏముంటుంది! ఈ భయాన్ని గెలవాలంటే ఇదే సమయం, ఇదే స్టెప్. అందుకని సీరియస్గా ఉండే సబ్జెక్ట్ ట్రై చేశా. అందులో కమర్షియల్గా ఉండే సాగ్స్ కానీ, హ్యూమర్ కానీ, ట్రాక్ కానీ.. అలాంటివేవీ మైండ్లోకి కూడా రానివ్వలేదు. దాన్ని నేను బిగ్గెస్ట్ టేకెవేగా ఫీలవుతా. 'అరవింద సమేత' తర్వాత మళ్లీ అలాంటి కథే చెప్పకూడదు కదా.. దాన్నుంచి బ్రేక్ కావాలి కదా.. ప్రతిసారీ మనం మారడానికి ప్రయత్నించడమే. అందుకే 'అల వైకుంఠపురములో' సినిమా తీశా" అని తెలిపారు త్రివిక్రమ్.