నేను మిస్సవలేదు.. మా ఇంటికి వచ్చాను.. సుశాంత్ సహనటి వివరణ
on Oct 23, 2020
సుశాంత్సింగ్ రాజ్పుత్ మృతికి సంబంధించిన డ్రగ్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) జారీ చేసిన సమన్లకు నటి సప్నా పబ్బి స్పందించలేదని సమాచారం. నిజానికి, ఆమె మిస్సయ్యిందనీ, అందుబాటులో లేదనీ ఒక ఎన్సీబీ అధికారి చెప్పారు. అయితే ఈ రిపోర్టులకు సప్న వివరణ ఇచ్చింది. తాను లండన్లోని తమ ఇంటికి వచ్చినట్లు తెలియజేసింది. లండన్కు చెందిన ఆమె తన స్టేట్మెంట్ను ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసి, తను ఎక్కడ ఉన్నదీ సంబంధిత అధికారులకు తెలుసునని వెల్లడించింది.
"నేను అందుబాటులో లేననీ, మిస్సయ్యాననీ నా గురించి ఇండియాలో వస్తున్న మీడియా రిపోర్టులు చూసి బాధపడ్డాను. ప్రస్తుతం నేను మా కుటుంబంతో లండన్లోని మా ఇంట్లో ఉన్నాను. ఇప్పటికే నా లాయర్లు ఇండియాలోని అధికారులతో సంప్రదించారు. వారికి నా ఆచూకీ గురించి పూర్తిగా తెలుసు" అని ఆమె రాసుకొచ్చింది. నెట్ఫ్లిక్స్ లో నేరుగా రిలీజైన సుశాంత్సింగ్ సినిమా 'డ్రైవ్'లో సప్న నటించింది.
ఇదివరకు ఈ విషయంపై ఓ ఎన్సీబీ అధికారి మిడ్-డే పోర్టల్తో మాట్లాడుతూ, "బాలీవుడ్ డ్రగ్ సిండికేట్తో కనెక్షన్ విషయంలో ఎన్సీబీ ఎదుట హాజరు కావాల్సిందిగా మంగళవారం ఆమె నివాసం బయట నోటీసు అంటించాం. కానీ ఆమె స్పందించలేదు. ఇప్పుడు కనిపించకుండా పోయింది" అని తెలిపారు.
అర్జున్ రాంపాల్ గాళ్ఫ్రెండ్ గాబ్రియెల్లా డిమిత్రియడెస్ సోదరుడు అగిసిలావోస్ డిమిత్రియడెస్ అరెస్ట్ తర్వాత సప్న పేరు బయటకు వచ్చిందని ఆయన వెల్లడించారు. డ్రగ్ కేసులో ఆమె ప్రమేయంపై కొన్ని డిజిటల్ సాక్ష్యాలు కనిపించాయని ఆయన చెప్పారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి దీపికా పడుకోనే, రకుల్ ప్రీత్సింగ్, శ్రద్ధా కపూర్, సారా అలీఖాన్ వంటి తారలను ఎన్సీబీ ప్రశ్నించింది.
Also Read