విలన్ కాదు హీరో.. రంజాన్ నెలంతా 25వేల మందికి భోజనాలు!
on Apr 23, 2020
సినిమాల్లో సోనూ సూద్ విలన్ కావచ్చు. నిజ జీవితంలో మాత్రం అతడు రియల్ సూపర్ హీరో. రీల్ లైఫ్లో అతడు బ్యాడ్ క్యారెక్టర్లు చేశాడు. రియల్ లైఫ్లో మాత్రం అతడి మనసు వెరీ వెరీ గుడ్. కరోనా నియంత్రణకు, ప్రజల ప్రాణాలు కాపాడడానికి నిరంతరం శ్రమిస్తున్న వైద్యులు, నర్సులు, ఇతర ఆరోగ్య సిబ్బందికి బస కల్పించడానికి ముంబైలోని జుహూలో ఉన్న తన హోటల్ను ఇచ్చారు. అలాగే, తన తండ్రి శక్తి సాగర్ సూద్ పేరు మీద శక్తి అన్నదానం కార్యక్రమం ప్రారంభించారు. ప్రతిరోజూ ముంబైలో 45 వేల మందికి ఆహారాన్ని అందిస్తున్నారు. ఇప్పుడు రోజూ లక్షన్నర మందికి భోజనం అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నారు.
రాజస్థాన్ రాష్ట్రంలోని భీవండీ నగరంలో 25,000మంది వలస కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని సోనూ సూద్ దృష్టికి వచ్చింది. కర్ణాటక, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్ నుండి పని కోసం భివండీ వెళ్లిన కార్మికులు అక్కడ చిక్కుకుపోయారు. వారిలో ముస్లిమ్స్ ఎక్కువ. త్వరలో రంజాన్ మాసం మొదలవుతుంది. పగలంతా ఉపవాసం ఉంటారు.సాయంత్రం ఉపవాసం విడిచే సమయంలో ఎటువంటి ఇబ్బంది కలగకుండా సోనూ సూద్ ఏర్పాట్లు చేస్తున్నారు. రంజాన్ నెలంతా 25 వేలమందికి భోజనాలు పెడతానని హామీ ఇచ్చారు. ఈ కష్టకాలంలో ఒకరికి మరొకరు అండగా నిలవాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు.