'సరిలేరు నీకెవ్వరు'లో మహేశ్ కేరెక్టర్ ఎలా ఉంటుందంటే...
on Aug 17, 2019
మహేశ్ హీరోగా అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తోన్న 'సరిలేరు నీకెవ్వరు' మూవీ హైదరాబాద్లో రెండో షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. తొలి షెడ్యూల్ కశ్మీర్లో జరిగిన విషయం తెలిసిందే. రెండో షెడ్యూల్లో సెట్స్పైకి విజయశాంతి అడుగుపెట్టారు. కాగా ఆగస్ట్ 15న దేశానికి కాపలా కాసే సైనికులకు నీరాజనం అర్పిస్తూ నిర్మాతలు విడుదల చేసిన టైటిల్ సాంగ్కు మంచి స్పందన లభించింది. ఈ మూవీలో మహేశ్ ఆర్మీ మేజర్గా నటిస్తున్న విషయం తెలిసిందే.
కాగా ఈ సినిమాలో మహేశ్ కేరెక్టర్ ఎలా ఉంటుందనే ఆసక్తి అందరిలోనూ ఉంది. ఇదివరకు 'భరత్ అనే నేను', 'మహర్షి' సినిమాల్లో సీరియస్ రోల్స్లో కనిపించిన మహేశ్.. ఇందులో వాటికి భిన్నమైన కేరెక్టర్లో కనిపిస్తాడని తెలుస్తోంది. ఒక సినీ మేగజైన్తో మాట్లాడుతూ అనిల్ చెప్పిన విషయాల వల్ల 'సరిలేరు నీకెవ్వరు' మూవీ పక్కా మాస్ మసాలా ఎంటర్టైనర్గా తయారవుతోంది.
"మహేశ్ కేరెక్టర్ సర్ప్రైజింగ్గా, అందరూ కోరుకునే విధంగా ఉంటుంది. ఆయన నుంచి ఎంటర్టైన్మెంట్ను చాలా మంది చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. ఆ ఎంటర్టైన్మెంట్తో పాటు ఆయనలోని ఎనర్జీ లెవల్స్ కూడా ఈ సినిమాలో కనిపిస్తాయి. అలాగే యాక్షన్ కూడా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే 'సరిలేరు నీకెవ్వరు' అనేది పక్కా మాస్ మసాలా ఎంటర్టైనర్. మహేశ్ సినిమా అంటే ఎలాంటి అంచనాలుంటాయో, దానికి తగ్గట్లు గానే సినిమా ఉంటుంది. వేరే కైండ్ ఆఫ్ కంటెంట్ ఉంటుంది. కథకు లింకయ్యే మంచి ఎమోషన్స్ ఉంటాయి. విజయశాంతి కేరెక్టర్లో మంచి ఎమోషన్స్ ఉంటాయి. మహేశ్ అభిమానులకు ఈ సినిమా ఒక పండగలా ఉంటుంది. డైరెక్టర్ అయిన దగ్గర్నుంచీ మహేశ్తో పనిచేసే అవకాశం కోసం ఎదురు చూస్తున్నా. ఇప్పటికి ఆ అవకాశం వచ్చింది. దాన్నెంత వరకు సద్వినియోగం చేసుకుంటాననేదే నేను చేయాల్సిన పని. మహేశ్ నాకు గ్రేట్ ఆపర్చునిటీ ఇచ్చారు. అంతే లెవల్కు రిజల్ట్ చూపించగలిగితే 'సరిలేరు నీకెవ్వరు' అనేది ఒక మెమరబుల్ సినిమాగా మిగిలిపోతుంది. ఇప్పుడు నేను చేస్తున్నది ఆ పనే" అంటూ చెప్పుకొచ్చాడు అనిల్ రావిపూడి.
'సరిలేరు నీకెవ్వరు'లో మహేశ్ జోడీగా తొలిసారి రష్మికా మందన్న నటిస్తోంది. 2020 సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.