అరుదైన తార మరణించి నేటికి పదేళ్లు!
on Apr 6, 2021
సుజాత అనగానే తెలుగు ప్రేక్షకులకు మొదటగా గుర్తొచ్చే సినిమా 'గోరింటాకు'. శోభన్బాబు హీరోగా నటించిన ఆ సినిమాను దాసరి నారాయణరావు రూపొందించారు. శోభన్ను ప్రేమించి, మరో అమ్మాయి కోసం తన ప్రేమను త్యాగం చేసే స్వప్న క్యారెక్టర్లో సుజాత ప్రదర్శించిన అభినయం ఫ్యామిలీ ఆడియెన్స్ను హృదయాల్ని పిండేసింది.
మొదట మలయాళం, తర్వాత తమిళ చిత్రాలతో నటిగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న తర్వాత లెజెండరీ డైరెక్టర్ కె. బాలచందర్ రూపొందించిన 'గుప్పెడు మనసు' చిత్రంతో తెలుగువారికి పరిచయమయ్యారు సుజాత. ఆ సినిమాలోనూ ఆమెది బరువైన పాత్రే. భర్త శరత్బాబు, ఒక పాపతో హ్యాపీగా సంసార జీవితాన్ని కొనసాగిస్తున్న ఆమె, పక్కింటికి వచ్చిన ఓ యువతిని భర్త లోబరుచుకొని, ఆమెతో శారీరకంగా గడపడం ప్రత్యక్షంగా చూసి, ఆ నిజాన్ని జీర్ణించుకోలేక మధనపడే విద్య పాత్రలో ఆమె జీవించారు. తెలుగులో నాయికగా నటించిన తొలి చిత్రంతోటే ఉత్తమ నటిగా ఫిల్మ్ఫేర్ అవార్డును అందుకున్నారు. నిజానికి సుజాత అంటేనే బరువైన పాత్రలకు కేరాఫ్.
చాలామందికి తెలీని విషయం.. సుజాత బాల్యం శ్రీలంకలో గడిచింది. స్కూల్ డేస్ని దాదాపు అక్కడే గడిపాక, ఆమెకు పద్నాలుగు సంవత్సరాల వయసులో కుటుంబం కేరళకు తరలి వచ్చింది. 1965లో తొలిసారి 'అమ్ము' అనే మలయాళం సినిమాలో నటించారు. ఎర్నాకుళం జంక్షన్ అనే సినిమాలో ఆమె నటన చూసి వండర్ అయిన బాలచందర్ ఆమెను 'అవల్ ఒరు తోడర్కథై' సినిమాతో తమిళ చిత్ర రంగానికి పరిచయం చేశారు. అందులో కమల్ హాసన్ హీరో. ఆ మూవీలో కవిత పాత్రలో సుజాత నటనకు తమిళ ప్రేక్షకులు నీరాజనం పలికారు.
తెలుగులో ఏడంతస్తుల మేడ, సంధ్య, సుజాత, పండంటి జీవితం, బంగారు కానుక, యువరాజు, బహుదూరపు బాటసారి, ఎమ్మెల్యే ఏడుకొండలు, అనుబంధం, సూత్రధారులు, చంటి, సూరిగాడు, నాన్నగారు, ఎం ధర్మరాజు ఎంఏ, పెళ్లి, జెమిని లాంటి సినిమాల్లో చేసిన పాత్రలతో ఆమె తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం పొందారు. తెలుగులో ఆమె నటించిన చివరి చిత్రం నాగార్జున, కె. రాఘవేంద్రరావు కాంబినేషన్లో వచ్చిన 'శ్రీరామరాసు'. ఆ చిత్రంలో పోకల దమ్మక్క పాత్రలో కనిపించారు సుజాత. 'పెళ్లి' చిత్రంలో ప్రదర్శించిన నటకు ఉత్తమ సహాయనటిగా నంది అవార్డును అందుకున్నారు.
దక్షిణాది భాషలన్నింటిలో కలిపి 300 పైగా చిత్రాల్లో నటించిన అపురూప తార సుజాత 58 ఏళ్ల వయసులో గుండె జబ్బుతో బాధపడుతూ 2011 ఏప్రిల్ 6న చెన్నైలో తుదిశ్వాస విడిచారు. ఆమెకు భర్త జయకర్, కుమారుడు సాజిద్, కుమార్తె దివ్య ఉన్నారు.