17 నుంచి ప్రభాస్ 'జాన్' షెడ్యూల్
on Jan 11, 2020
ప్రభాస్ హీరోగా 'జిల్' ఫేం రాధాకృష్ణకుమార్ డైరెక్ట్ చేస్తోన్న 'జాన్' (వర్కింగ్ టైటిల్) మూవీ కొత్త షెడ్యూల్ జనవరి 17 నుంచి రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన సెట్లో జరగనున్నది. పూజా హెగ్డే నాయికగా నటిస్తోన్న ఈ సినిమాని ఇటలీ బ్యాక్డ్రాప్లో తీస్తున్నారు. యాక్షన్, ఎంటర్టైన్మెంట్ మేళవించిన లవ్ స్టోరీతో తయారవుతున్న ఈ సినిమాకు సంబంధించి ఇదివరకు ఇటలీలో ఒక చిన్న షెడ్యూల్ నిర్వహించారు. ఇప్పుడు ఆర్ఎఫ్సీలో ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ ఆధ్వర్యంలో యూరప్ లొకేషన్స్ తరహా సెట్లు వేసి, అక్కడే షూటింగ్కు ప్లాన్ చేస్తున్నారు. 'రెబల్' తర్వాత ప్రభాస్ సినిమాలో మరోసారి కృష్ణంరాజు కనిపించనున్నారు. ఆయన కథకు కీలకమైన ఒక పాత్ర చేస్తున్నట్లు సమాచారం. 2015లో 'ఎవడే సుబ్రహ్మణ్యం', 'రుద్రమదేవి' సినిమాల తర్వాత ఆయన మళ్లీ నటిస్తున్న సినిమా ఇదే కావడం గమనార్హం.
'సాహో' సినిమాతో పాన్-ఇండియా స్టార్గా నిరూపించుకున్నప్పటికీ, అది తెలుగులో ఆశించిన కలెక్షన్లు తేలేకపోవడంతో 'జాన్' స్క్రిప్ట్ విషయంలో ప్రభాస్ మరింత శ్రద్ధ వహిస్తున్నాడు. అందుకే షూటింగ్ షెడ్యూళ్లలో జాప్యం జరిగిందని ఫిలింనగర్లో చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం హాలిడే మూడ్లో ఉన్న అతను 17 నుంచి షూటింగ్కు సిద్ధమవుతున్నాడు. ఈ మూవీని గోపీకృష్ణా మూవీస్, యువి క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 2020 చివరిలో కానీ, 2021 మొదట్లో కానీ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి.