బాలయ్యతో ఢీ... ఏకంగా రెండు నెలలు వెనక్కి?
on Oct 19, 2019
స్టార్ హీరోలందరూ పండక్కి రావాలనుకుంటే థియేటర్లు దొరకడం కష్టమే. ఎవరో ఒకరు త్యాగం చేయక తప్పదు. క్రిస్మస్ బరిలో నితిన్ ఆ త్యాగం చేస్తున్నాడని ఫిల్మ్నగర్ గుసగుస. సూల్స్, కాలేజీలకు నాలుగైదు రోజులు సెలవులు వస్తే... హాలిడే వీకెండ్స్ని క్యాష్ చేసుకోవడానికి హీరోలు రెడీ అవుతున్నారు. నితిన్ కూడా అలాగే రెడీ అయ్యాడు. ‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో నటిస్తున్న ‘భీష్మ’ను డిసెంబర్ 20న విడుదల చేయాలనుకున్నాడు. అందరి కంటే ముందుగా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాడు. కానీ, ఏం లాభం? నందమూరి బాలకృష్ణ, కె.ఎస్. రవికుమార్ కాంబినేషన్లో ‘జై సింహా’ తర్వాత సి. కల్యాణ్ నిర్మిస్తున్న ‘రూలర్’ను డిసెంబర్ 20న తీసుకొస్తామని అనౌన్స్ చేశారు.
మెగా మేనల్లుడు సాయితేజ్, మారుతి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘ప్రతిరోజూ పండగే’ కూడా అదే డేట్కి రానుంది. డిసెంబర్ 25న రవితేజ ‘డిస్కో రాజా’ ఎలాగో ఉంది. క్రిస్మస్ బరిలో ముగ్గురు హీరోల మధ్య ‘ఢీ... పోటీ’ ఏర్పడింది. వీటి మధ్య పోటీలో పడటం ఎందుకని ‘భీష్మ’ రిలీజ్ను నితిన్ వాయిదా వేశాడట. ఏకంగా రెండు నెలలు వెనక్కి వెళుతున్నాడని టాక్. మహాశివరాత్రి సందర్భంగా వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలాఖరున సినిమా విడుదల చేయాలనుకుంటున్నారట.