'మన్మథుడు 2'ని యాక్సెప్ట్ చెయ్యడానికి టైం పడుతుంది!
on Aug 12, 2019
"నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకోడానికే 'మన్మథుడు 2' చేశాను. దీన్ని ప్రేక్షకులు వెంటనే యాక్సెప్ట్ చేయలేరు. కాస్త సమయం తీసుకుంటుంది" అని అన్నారు అక్కినేని నాగార్జున. ఆయన టైటిల్ రోల్ చేసిన 'మన్మథుడు 2' మూవీ ఆగస్ట్ 9న విడుదలైంది. రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేయగా, రకుల్ప్రీత్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు డివైడ్ టాక్ వచ్చింది. సినిమా మొదట్లోని అడల్ట్ కామెడీ చూసినవాళ్లు నాగార్జునకు ఇప్పుడు ఇలా చెయ్యడం అవసరమా?.. అని కూడా విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ సినిమా ఎందుకు చేసిందీ, అది చేసినందువల్ల తనకు ఎట్లాంటి ఫీడ్బ్యాక్ వచ్చిందీ నాగార్జున చెప్పుకొచ్చారు.
"నేనెప్పుడూ నా కెరీర్లో కొత్తదనం చూపించాలనుకున్నాను. చేస్తూ వచ్చాను. ఒకే టైప్ సినిమాలు చేస్తున్నప్పుడు నాకు నచ్చట్లేదు, అలాగే యూత్కి కూడా నచ్చడం లేదని ఏదో చేయాలని 'గీతాంజలి' సినిమా చేశాను. ఫస్ట్ టైమ్ రెగ్యులర్ సినిమాకు భిన్నంగా ఆ సినిమా చేశాను. ఇప్పుడు ఆ సినిమా కల్ట్ క్లాసిక్. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా యాక్సెప్ట్ చేయడానికి చాలా సమయం పట్టింది. ఇప్పుడు 'నిర్ణయం' చిత్రాన్ని మంచి సినిమా అంటారు. కానీ ఆ సినిమాకు మేం పడ్డ తిప్పలు మాకే తెలుసు. 'అన్నమయ్య' సినిమా 8వ రోజు కలెక్షన్స్ రెంట్స్ కూడా కట్టలేని పరిస్థితికి చేరుకున్నాయి. నేను, డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు, ప్రొడ్యూసర్ దొరస్వామిరాజు గారు చాలా బాధపడ్డాం. అయితే 11వ రోజు.. ఏం జరిగిందో ఏమో కానీ.. మ్యాట్నీ నుండి అన్ని థియేటర్స్ హౌస్ఫుల్స్ అయ్యాయి. ఆ సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో అందరికీ తెలుసు. నాకు నేషనల్ అవార్డ్ కూడా వచ్చింది. 'మన్మథుడు' విడుదలైనప్పుడు కూడా డైరెక్టర్ విజయభాస్కర్ వచ్చి.. 'ఎక్కడో తప్పు చేశాం సార్!' అని అన్నారు. 'ఏం లేదండి.. కొత్త రకమైన సినిమా.. కొత్త డైలాగ్స్.. టైం పడుతుంది' అని చెప్పాను. తర్వాత ఆ సినిమా ఎలాంటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. నేను ఎక్స్పెరిమెంట్స్ చేసే ఇక్కడి వరకు వచ్చాను. 'మన్మథుడు 2' కూడా అలాగే చేశాం. అయితే దీన్ని వెంటనే యాక్సెప్ట్ చేయలేరు. కాస్త సమయం తీసుకుంటుంది. కలెక్షన్స్ చూసి చాలా సంతోషమేసింది. అందరూ ఫోన్స్ చేసి అభినందిస్తున్నారు. ఒక పక్క బిగ్బాస్ సంతోషం.. మరో పక్క ఇదొక సంతోషం. తల్లీ కొడుకుల మధ్య అనుబంధం, కొడుకు కోసం తల్లి పడే ఆదుర్దా, నాకు, వెన్నెల కిషోర్ మధ్య ఉండే కామెడీ.. అన్ని ప్రేక్షకులకు నచ్చుతున్నాయి" అని వివరించారు నాగ్.