'మైండ్ బ్లాక్' సాంగ్తో 'సరిలేరు నీకెవ్వరు' హవా మొదలైంది!
on Dec 2, 2019
ఎప్పుడెప్పుడూ అని కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తూ వచ్చిన సూపర్స్టార్ మహేశ్ సినిమా 'సరిలేరు నీకెవ్వరు' మూవీ తొలి సింగిల్ లిరికల్ వీడియో వచ్చేసింది. డిసెంబర్లోని ఐదు సోమవారాల్లో ఐదు పాటల్ని విడుదల చేస్తామని నిర్మాతలు ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగా తొలి సింగిల్ను ఈ సోమవారం అంటే డిసెంబర్ 2 సాయంత్రం 5 గంటల 4 నిమిషాలకు ఆడియో కంపెనీ టి-సిరీస్ తన యుట్యూబ్ చానల్లో 'మైండ్ బ్లాకు' సాంగ్కు రిలీజ్ చేసింది. ఫుల్ మాస్ బీట్తో పాటు ర్యాప్ కూడా మేళవించిన ఈ సింగిల్ క్షణాల వ్యవధిలో వైరల్గా మారింది. టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీప్రసాద్ స్వరాలు కూర్చిన ఈ మాస్ సాంగ్ను శ్రీమణి రాశాడు. మేల్ వాయిస్ను బ్లాజీ, ఫిమేల్ వాయిస్ను రనీనా రెడ్డి ఆలపించారు. మధ్య మధ్యలో మహేశ్ మాటలు కూడా వినిపించడం ఈ సాంగ్ స్పెషాలిటీ. దీంతో మహేశ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
"ఎప్పుడు ప్యాంటేసే వాడూ ఇప్పుడు లుంగీ కట్టాడూ.. ఎప్పుడూ షర్టేసే వాడూ ఇప్పుడు జుబ్బా తొడిగాడూ.. చేతికేమో మల్లెపూలు కంటికేమొ కళ్లజోడు చుట్టేసి పెట్టేసి వచ్చేశాడూ.." అంటూ సాకీతో ఈ సాంగ్ మొదలైంది. అంటే క్లాస్ లుక్తో కనిపించే మహేశ్.. మాస్ లుక్లోకి వచ్చాడని పాట ఆరంభం తెలుపుతోంది. ఇక దానికి తగ్గట్లే మస్త్ మాస్ బీటుతో సాంగ్ పరుగులు తీసింది.
అందుకనే "ఫర్ ది ఫస్ట్ టైం హి ఈజ్ ఇంటు మాస్ క్రైం.." అని చెప్పేశారు.
"బాబూ నువ్వు సెప్పు" అని అమ్మాయి అంటే, మహేశ్ "ఏంటి?" అనడిగాడు. "ఆడ్ని కొట్టమని డప్పు" అని అమ్మాయి చెబితే, "ఊ.. నువ్వు కొట్రా" అని సూచించాడు మహేశ్.
"మూన్వాకూ.. మూన్వాకూ.. పిల్లా నీ నడక చూస్తే మూన్వాకూ.. ఎర్త్క్వేకూ ఎర్త్క్వేకూ పిల్లా నువ్వు తాకుతుంటే ఎర్త్క్వేకూ.. నీ లిప్పులోన ఉంది కప్ కేకూ.. మాటలోన ఉంది మిల్క్ షేకూ.. సోకులోన ఉంది కొత్త స్టాకూ" అని హీరోయిన్ని వర్ణించాడు హీరో. అంతేనా.. "నువ్వు హాట్ హాట్గ ఉన్న పూతరేకు.. ముట్టుకుంటే జారే తామరాకు.. మనసుని ఎర్ర చేసె తమలపాకు" అని మరింతగా పొగిడాడు. దాంతో "అమ్మ.. అబ్బ" అని మెలికలు తిరిగింది హీరోయిన్.
తను కూడా హీరోని "మైండ్ బ్లాకు మైండ్ బ్లాకు మైండ్ బ్లాకు మైండ్ బ్లాకు.. బాబూ నీ మాస్ లుక్కు మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు మైండ్ బ్లాకు మైండ్ బ్లాకు మైండ్ బ్లాకు.. నువ్వే ఒక స్టెప్పేస్తే మైండ్ బ్లాకూ" అని తన దృష్టిలో అతడేమిటో చెప్పింది.
"బాబూ నువ్ సెప్పీ" అంది అమ్మాయి. "ఏంటి?" అనడిగాడు మహేశ్. "ఆడ్ని ఊదమని పీపీ" అని చెప్పిందమ్మాయి. "ఊ.. నువ్ ఊదరా" అని ఆర్డరేశాడు మహేశ్. వాడు ఏం చేశాడో.. "నువ్ ఉండ్రా" అని ఆపాడు.
"నువ్వు చీరకట్టుకుంటే జారుతుందె గుండే.. ఓరకంటి చూపే భగ్గుమంటు మండే" అంటూ అమ్మాయిని పొగిడాడు అబ్బాయి. "అట్టా నువ్ అంటుంటే నాకెట్టాగొ ఐతాందే" అని అమ్మాయి సిగ్గుపడింది. "నువ్ కాటుకెట్టుకుంటే చీకటవుతుందే.. బొట్టు పెట్టుకుంటే తెల్లవారుతుందే" అనేశాడు అబ్బాయి. "అట్టా నువ్ చూస్తుంటే నా ఒళ్లంత గిలిగింత పుడతాందే" అని అమ్మాయి మెలికలు తిరిగింది.
"నీ కళ్లలోన ఉందే కల్లుముంత.. నీ వొంపులోన ఉంది పాలపుంత.. నీ సొంపులోన ఉంది లోకమంత" అని అమ్మాయి వొంపుసొంపుల సొగసును వర్ణించాడు అబ్బాయి.
"బాబూ తూ బోలే" అంది అమ్మాయి. "క్యారే" అనడిగాడు మహేశ్. "ఆడ్ని దంచమని ఢోలు" అని చెప్పిందమ్మాయి. "ఊ నువ్ దంచహే" అని చెప్పాడు మహేశ్. "ఆ.. బాబూ ఇటు సూడు" అని అమ్మాయి అంటే, మహేశ్ "ఏంటి?" అనడిగాడు. "ఆడ్ని పెంచమను స్పీడూ" అని అమ్మాయి చెబితే, "ఊ.. నువ్ పెంచరా" అని చెప్పాడు మహేశ్.
"నీ ముద్దు ముట్టకుండా ముద్ద ఎక్కదంటా.. హగ్గు అంటకుండా నిద్దరెట్టదంటా" అని అమ్మాయిని ఐస్ చేశాడు అబ్బాయి. "ఇట్టా నువ్ ఊరిస్తే నువ్ కోరింది తీరుస్తా" అని ఒప్పేసుకుంది అమ్మాయి. "నీ టచ్లో కరంటే నన్ను గుచ్చెనంటా.. మల్లెపూల సెంటే మత్తు రేపెనంటా" అని అబ్బాయి అంటే, "ఐతే నిన్ను టచ్ చేస్తా.. నిన్ను ఏదేదో మైకంలో ముంచేస్తా" అని అమ్మాయి ముందుకొచ్చింది.
"నీ బుగ్గలోన ఉంది పాలకోవా.. నీ సిగ్గులోన ఉంది అగ్గిలావా.. నీ నడుములోన ఉది పూలనావా" అని అమ్మాయిని ఇంకో రేంజిలో పొగిడాడు అబ్బాయి.
ఇట్లా అమ్మాయిని అబ్బాయి, అబ్బాయిని అమ్మాయి ఒకర్నొకరు తెగ పొగుడేసుకుంటున్న ఈ పాట ఫాస్ట్ బీట్ను, ర్యాప్ను ఇష్టపడే మ్యూజిక్ లవర్స్ను మాత్రమే కాకుండా మాస్ సాంగ్స్ను ఇష్టపడేవాళ్లనూ అమితంగా అలరించే రీతిలో ఉంది.
లేటుగా వచ్చినా లేటెస్టుగా వచ్చానన్నట్లు దేవి శ్రీప్రసాద్ కొట్టిన మాస్ బీట్స్ అదరహో అనిపిస్తున్నాయి. మహేశ్ వాయిస్ వచ్చినప్పుడల్లా ల్యిరిక్స్కు తగ్గట్లు బ్యాగ్రౌండ్లో ఒక మ్యుజీషియన్ 'పీపీ' అని సన్నాయి వాయిస్తూ కనిపించడం, ఇంకోసారి ఇంకొకతను డోలు వాయిస్తూ కనిపించడం సందర్భోచితంగా ఉంది. దేవి కూడా కనిపించాడు. ఈ పాటను షూట్ చేశారో, లేదో తెలీదు కానీ ఈ పాట స్టిల్ను ఒక్కదాన్నీ చూపించకపోవడం కాస్త అసంతృప్తిని కలిగించింది. అలాగే లిరిక్ను ఒక సందర్భంలో తప్పుగా రాశారు. వాయిస్లో "మల్లెపూల సెంటే మత్తు రేపెనంటా" అని వినిపిస్తే, డిస్ప్లేలో "మల్లెపూల సెంటే ముద్దు రేపెనంటా" అని అక్షరాల్లో చూపించారు.
ఏదేమైనా 'మైండు బ్లాకు' సాంగుతో నిజంగానే ఈ మూవీకి మైండ్ బ్లోయింగ్ మ్యూజిక్ ఇస్తున్నానని స్పష్టం చేశాడు దేవి. మునుముందు వచ్చే పాటలు ఇంకే రేంజిలో ఆకట్టుకుంటాయో చూడాలి. మహేశ్ జోడీగా రష్మికా మందన్న నటిస్తోన్న ఈ సినిమాకి అనిల్ రావిపూడి డైరెక్టర్. సంక్రాంతి సందర్భంగా జనవరి 11న 'సరిలేరు నీకెవ్వరు' మూవీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది.