నెవ్వర్ బిఫోర్.. 'బాహుబలి' రికార్డుల్ని బద్దలు కొట్టిన మహేశ్!
on Apr 2, 2020
సూపర్ స్టార్ మహేశ్ స్టామినా ఏమిటో శాటిలైట్ టెలివిజన్ వీక్షణం సాక్షిగా వెల్లడైంది. మహేశ్ లేటెస్ట్ ఫిల్మ్ 'సరిలేరు నీకెవ్వరు' 2020 సంక్రాంతికి విడుదలై ఆయన కెరీర్ బిగ్గెస్ట్ గ్రాసర్గా నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు టీవీ వీక్షణం (వ్యూయర్షిప్)లో ప్రస్తుతం ఉన్న అన్ని రికార్డుల్నీ ఆ సినిమా బద్దలు కొట్టింది. ఈ మూవీ శాటిలైట్ హక్కుల్ని అత్యధిక ధరకు సొంతం చేసుకున్న జెమిని చానల్ ఈ నెల 25న ఉగాది పర్వదినం సందర్భంగా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ను ప్రసారం చేసింది. ఆ రోజు మిగతా అన్ని చానళ్లలోని ప్రోగ్రామ్ల కంటే 'సరిలేరు నీకెవ్వరు' మూవీని చూడ్డానికే వీక్షకులు అత్యధిక సంఖ్యలో ఇష్టపడ్డారు. ఫలితంగా 23.4 టీవీఆర్ను ఆ సినిమా సాధించింది.
రేటింగ్ విధానం అమల్లోకి వచ్చాక, తెలుగు టెలివిజన్ చరిత్రలోనే ఇది హయ్యెస్ట్ రేటింగ్ కావడం విశేషం. ప్రభాస్ 'బాహుబలి' కూడా ఈ స్థాయిలో టీవీ వీక్షకుల్ని ఆకట్టుకోలేదు. 'బాహుబలి 2' సాధించిన టీవీఆర్ 22.7. ఇప్పటివరకూ ఇదే హయ్యెస్ట్ రేటింగ్. దాన్ని ఇప్పుడు మహేశ్ సినిమా అధిగమించింది. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ యాక్షన్ డ్రామాలో మేజర్ అజయ్ కృష్ణ క్యారెక్టర్లో మహేశ్ వీరవిహారం చేయగా, పదమూడేళ్ల తర్వాత కెమెరా ముందుకు వచ్చిన లేడీ సూపర్స్టార్ విజయశాంతి ప్రొఫెసర్ భారతి పాత్రలో చెలరేగిపోయారు. ఈ ఇద్దరి నటనను టీవీ వీక్షకులు అమితంగా ఇష్టపడ్డారని విశ్లేషకులు తెలిపారు.
నెవ్వర్ బిఫోర్ అన్నట్లుగా రేటింగ్ విషయంలో హిస్టరీ సృష్టించిన ఈ మూవీలో రష్మికా మందన్న హీరోయిన్గా నటించగా ప్రకాశ్రాజ్, రాజేంద్రప్రసాద్, రావు రమేశ్, సంగీత, అజయ్ కీలక పాత్రలు చేశారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చగా, రత్నవేలు సినిమాటోగ్రాఫర్గా పనిచేశాడు. ఇక ఈ సినిమాతో సంక్రాంతికి పోటీపడి థియేటర్లలో అత్యధిక వసూళ్లు సాధించిన అల్లు అర్జున్ సినిమా 'అల.. వైకుంఠపురములో' టెలివిజన్లో ఎలాంటి రేటింగ్ సాధిస్తుందో చూడాలి.