కరోనా మీద హాస్యం.. ఆర్జీవీ పైత్యం!
on Apr 2, 2020
"నాకు కరోనా పాజిటివ్ అని మా డాక్టర్ చెప్పాడు" అని సోషల్ మీడియాలో ప్రకటించి, అందర్నీ కలవరానికి గురిచేశాడు రామ్గోపాల్ వర్మ. అయితే అతగాడి ట్వీట్ను కొంతమంది వేరే రకంగా ఆస్వాదించారు. ఒకరైతే "కరోనాకి ఎంత దరిద్రం పట్టిందిరా" అని బాధపడ్డారు. అంటే కరోనా కంటే ఆర్జీవీ మరింత ఘోరమైనవాడని చెప్పినట్లే కదా! ఇంకొకరైతే "అడ్వాన్స్ 'రిప్'రా ముసలోడా" అని కామెంట్ చేశారు. ఇంకొకరేమో "ఏం వర్రీ కాకండి సార్. మీరు కరోనా కంటే ఎక్కువ డేంజరస్. ఏం కాదు" అని రెస్పాండ్ అయ్యారు.
ఇలా.. తలో రకంగా ఆర్జీవీ ట్వీట్కు కామెంట్లు పెట్టారు. అయితే వర్మకు ఈ కరోనా ఎలా తగులుకుందనే విషయం సందేహంలో పడేసింది. మనవాడు సెల్ఫ్ క్వారంటైన్లో ఉన్నాడు కదా, పైగా కరోనాపై 'కనిపించని పురుగు' అనే పాటను తయారుచేసే పనిలోనే ఈమధ్య ఉన్నాడాయె. తనే రాసి, పాడిన ఈ పాటను రిలీజ్ కూడా చేసేశాడు. అలాంటివాడికి కరోనా పాజిటివ్ ఎలా వచ్చిందనే సందేహాన్ని కాసేపట్లోనే మనవాడు తీర్చేశాడు.
"మిమ్మల్ని డిజప్పాయింట్ చేస్తున్నందుకు సారీ, ఇది ఏప్రిల్ ఫూల్ జోక్ అని ఆయన (డాక్టర్) చెప్పాడు. ఇది ఆయన తప్పు, నాది కాదు" అని ట్వీట్ చేశాడు. భయంకరంగా ఉన్న స్థితిని తేలిక చేయడానికి మాత్రమే తాను ప్రయత్నిస్తున్నాననీ, ఈ జోక్ తన మీదే వేసుకున్నాననీ ఆయన అన్నాడు. "ఎవరినైనా నేను బాధించకపోతే, వారికి సిన్సియర్గా క్షమాపణలు చెప్తున్నా" అని ఇంకో జోక్ వేశాడు.
ప్రపంచాన్నే గడగడలాడిస్తూ, మన దేశంలో, తెలుగునాట ఎంతోమందిని బాధితులుగా మారుస్తూ, కొంతమంది చావుకు కారణమవుతూ కరాళ నృత్యం చేస్తున్న ఒక మహమ్మారి విషయంలో, అదీ ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఆర్జీవీ చేసిన ఏప్రిల్ 1 హాస్యం అనేకమందికి చీదర పుట్టించింది. తనలోని పైత్యాన్ని వర్మ మరోసారి బయటపెట్టుకున్నాడని నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.
Also Read