రాధేశ్యామ్.. పరమహంసగా రెబల్ స్టార్!
on Jan 21, 2021
బిల్లా (2009), రెబల్ (2012) చిత్రాల్లో రెబల్ స్టార్ కృష్ణంరాజు, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కలసి నటించి.. అభిమానులకు కనువిందు చేశారు. కట్ చేస్తే.. దాదాపు తొమిదేళ్ళ తరువాత ఈ ఇద్దరు మరో సినిమాలో కలసి నటిస్తున్నారు. ఆ చిత్రమే.. రాధేశ్యామ్. పిరియడ్ రొమాంటిక్ సాగాగా రూపొందుతున్న ఈ భారీ బడ్జెట్ మూవీలో ప్రభాస్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటిస్తుండగా.. కృష్ణంరాజు ఓ కీలక పాత్రలో దర్శనమివ్వనున్నారు.
ఇందులో కృష్ణంరాజు ఎలాంటి పాత్రలో నటిస్తున్నారో క్లారిటీ వచ్చేసింది. తాజాగా ఓ ప్రముఖ టీవీ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాధేశ్యామ్ లో తన పాత్ర తీరుతెన్నులపై చెప్పుకొచ్చారాయన. పరమహంస అనే మహాజ్ఞాని పాత్రలో తాను నటిస్తున్నానని.. ఆ క్యారెక్టర్ కోసమే గడ్డం పెంచి కొత్త లుక్ ట్రై చేశానని.. నాలుగైదు సన్నివేశాలు మినహా సినిమా పూర్తయిందని చెప్పుకొచ్చారు. డిసెంబర్ లోనే సినిమాని రిలీజ్ చేయాలని ప్లాన్ చేసినా.. కోవిడ్ కారణంగా వాయిదా తప్పలేదని.. ఏప్రిల్ లో రాధేశ్యామ్ ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆయన తెలిపారు. మరి.. పరమహంస పాత్రలో రెబల్ స్టార్ ఏ స్థాయిలో అలరిస్తారో తెలియాలంటే ఏప్రిల్ వరకు వేచిచూడాల్సిందే.
జిల్ ఫేమ్ రాధాకృష్ణ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని గోపీకృష్ణా మూవీస్ సమర్పణలో యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది.