పవన్ కల్యాణ్ తన స్థాయిని తానే తగ్గించుకున్నారా?
on Nov 25, 2020
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె.పి. నడ్డాను కలవడానికి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సోమవారం రాత్రి పార్టీ నెంబర్ 2 నాదెండ్ల మనోహర్తో కలిసి ఢిల్లీ వెళ్లారు. తిరుపతి పార్లమెంట్ సీటు అడగడానికే పవన్కళ్యాణ్ ఢిల్లీ వెళ్లినట్లు విశ్వసనీయ సమాచారం. తిరుపతిలో గెలవడానికి జనసేనకు ఎలాంటి మెరుగైన అవకాశాలు ఉన్నాయో ఆయన నడ్డాకు వివరించనున్నారు. గతంలో ప్రజారాజ్యం తరపున తిరుపతి అసెంబ్లీ సీటును తన అన్నయ్య చిరంజీవి ఎలా గెలిచారో, తమ వర్గం ఓటింగ్ అక్కడ ఎంత పెద్ద సంఖ్యలో ఉందో ఆయన బీజేపీ టాప్ బాస్కు తెలియజేయనున్నారు.
అయితే ఇప్పటికే తిరుపతి నుంచి తాము పోటీ చేస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర నాయకులు ప్రకటిస్తున్నందున బీజేపీ కేంద్ర నాయకత్వం ఆ సీటు విషయంలో ఏం చేస్తుందో చూడాలి. ఆంధ్రప్రదేశ్లో కూటమిలో జనసేన ఆధిపత్య స్థానంలో ఉండాలి. అటువంటిది ఒక ఉపఎన్నిక సీటును తమకు కేటాయించాలని పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లడం జనసేన పార్టీ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో తెలియజేస్తోందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
తిరుపతి ఉప ఎన్నిక సీటు విషయంలో బీజేపీ నాయకత్వమే పవన్ కల్యాణ్ను సంప్రదించేట్లు ఉండాలి కానీ, పవన్ కల్యాణే దేహీ అంటూ ఢిల్లీకి వెళ్లం ఏమిటనీ, అలా వెళ్లి తన స్థాయిని ఆయనే తగ్గించేసుకున్నారనీ జనసేన కార్యకర్తలు కూడా అభిప్రాయపడుతున్నారు. కూటమి భాగస్వామిని సంప్రదించకుండా ఏకపక్షంగా బీజేపీ రాష్ట్ర నాయకత్వం తిరుపతి సీటులో తామే నిల్చుంటామని స్పష్టం చేయడాన్ని వారు ఆక్షేపిస్తున్నారు. తిరుపతి సీటు విషయంలో బీజేపీది పైచేయి అయితే తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లోనూ వారిదే ఆధిపత్యం అయ్యే అవకాశాలెక్కువ. ఢిల్లీకి వెళ్లి పవన్ తప్పు చేశారా?