రెండు బ్లాక్బస్టర్ సాంగ్స్ని రెండు రోజుల్లో తీసేశారు!
on Jan 21, 2021
నటసార్వభౌముడు ఎన్టీఆర్, దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు కాంబినేషన్లో వచ్చిన 'అడవి రాముడు' (1977) సినిమా బాక్సాఫీస్ దగ్గర సృష్టించిన సునామీ అసామాన్యం. అత్యధిక రోజులు హౌస్ఫుల్స్లో ఏడాది పాటు థియేటర్లలో ఆడిన ఆ సినిమా సాధించిన కలెక్షన్లను నేటి కాలానికి లెక్కవేస్తే అది రూ. 500 కోట్లు అవుతుందని అంచనా. అలాంటి కమర్షియల్ క్లాసిక్ సినిమాతో ఎన్టీఆర్ ఫ్లాపుల నుంచి బయటపడితే, రాఘవేంద్రరావు స్టార్ డైరెక్టర్గా మారిపోయారు. డైరెక్టర్గా అది ఆయనకు ఐదో సినిమా. అలాగే ఎన్టీఆర్, జయప్రద కాంబినేషన్లో వచ్చిన తొలి సినిమా 'అడవి రాముడు'.
ఆ సినిమాలోని పాటలన్నీ సూపర్ హిట్టే. ముఖ్యంగా ఎన్టీఆర్, జయప్రదలపై తీసిన డ్యూయెట్ 'ఆరేసుకోబోయి పారేసుకున్నా హరీ' సాంగ్ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఇప్పటికీ అలాంటి కమర్షియల్ హిట్ సాంగ్ మళ్లీ రాలేదని విమర్శకులు భావిస్తుంటారు. దాంతో పాటు ఆ ఇద్దరిపైనే తీసిన 'కోకిలమ్మ పెళ్లికి కోనంతా పందిరి' పాట కూడా జనం నోళ్లపై బాగా నానింది. విశేషమేమంటే ఆ రెండు పాటలను రెండు రోజుల్లోనే రాఘవేంద్రరావు చిత్రీకరించడం. ఇవాళ్టి రోజుల్లో ఓ పాటను తీయడానికే మూడు నుంచి వారం రోజుల టైమ్ తీసుకుంటున్న పరిస్థితి. అలాంటిది అలాంటి బ్లాక్బస్టర్ సాంగ్స్ రెండింటిని రెండు రోజుల్లో ఎలా తీయగలిగారంటే.. అది రాఘవేంద్రరావుకే సాధ్యమైన విషయం.
'అడవి రాముడు' మూవీని ఆయన 35 రోజుల్లో పూర్తి చేసేశారు. 'ఆరేసుకోబోయి పారేసుకున్నా' పాటను ఒకటిన్నర రోజులో రాఘవేంద్రరావు చిత్రీకరించారు. ఒకటిన్నర రోజుల కాల్షీట్ తీసుకున్నారు. ఆ పాట పూర్తయిన రోజు మధ్యాహ్నం నుంచే ఎన్టీఆర్, జయప్రదతో పాటు జంతువులు, పక్షుల మధ్య 'కోకిలమ్మ పెళ్లికి' పాట తీయడం మొదలుపెట్టారు. ఆ రోజు రాత్రి, తెల్లవారుఝాము దాకా షూట్ చేసి, ఆ పాటను ఫినిష్ చేశారు. అలా దాన్ని కూడా ఒకటిన్నర రోజు కాల్షీట్ లాగా లెక్కకట్టారు. వెరసి మూడు కాల్షీట్స్, రెండు రోజుల టైమ్లో ఆ రెండు పాటల్ని తీసేశారు రాఘవేంద్రరావు.