25 ఏళ్ల 'సొగసు చూడతరమా'
on Jul 13, 2020
'రుద్రమదేవి'తో దర్శకనిర్మాతగా సంచలన విజయాన్ని సొంతం చేసుకుని ప్రస్తుతం ప్రెస్టీజియస్ పాన్ ఇండియా ఫిలిం 'హిరణ్యకశ్యప' ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాడు డైరెక్టర్ గుణశేఖర్. ఆయన దర్శక నిర్మాతగా అందించిన 'సొగసు చూడతరమా' చిత్రం విడుదలై జూలై 14తో 25 సంవత్సరాలు పూర్తవుతుంది. నరేష్, ఇంద్రజ జంటగా నటించిన ఈ సినిమా అప్పట్లో సెన్సేషనల్ హిట్ అవడమే కాకుండా ప్రతిష్ఠాత్మకమైన నంది అవార్డులను నాలుగింటిని సాధించింది. బెస్ట్ ఫిల్మ్ గా బంగారు నందిని అందుకున్న ఈ చిత్రానికి బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్గా కూడా గుణశేఖర్ నంది అవార్డును అందుకున్నారు. బెస్ట్ డైలాగ్ రైటర్ అవార్డును అజయ్ శాంతి, బెస్ట్ కాస్ట్యూమ్స్ అవార్డును కుమార్ తీసుకున్నారు.
అలాంటి సొగసు చూడతరమా చిత్రం పాతికేళ్లను పూర్తి చేసుకుంటున్న సందర్భంగా గుణశేఖర్ మాట్లాడుతూ, "చిన్న చిత్రంగా రూపొందించిన 'సొగసు చూడతరమా' ప్రేక్షకాదరణతో పెద్ద విజయాన్ని సాధించడమే కాకుండా ఉత్తమ చిత్రంగా బంగారు నంది రావడం, బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ గా నాకు, బెస్ట్ డైలాగ్ రైటర్ గా అజయ్ శాంతి కి, కాస్ట్యూమ్స్ కి కుమార్ కు కూడా నంది రావడం ఆ సినిమా దర్శకనిర్మాత గా ఎంతో ఆనందాన్ని కలిగించింది. ప్రేక్షకుల రివార్డ్స్ ను ప్రభుత్వ అవార్డ్స్ ను అందుకుని నా సినీ జీవితంలో అన్ని విధాలా సంతృప్తిని కలిగించి ఒక స్వీట్ మెమరీ గా నిలిచిన 'సొగసు చూడతరమా' 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఆ చిత్రానికి పని చేసిన ప్రతి ఒక్కరినీ అభినందిస్తూ ఆ చిత్రాన్ని సూపర్ హిట్ చేసిన ప్రేక్షకులకు, అవార్డ్స్ ఇచ్చి గౌరవించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను" అని చెప్పారు.