టీవీ ఇండస్ట్రీకి కరోనా సెగ!
on Mar 30, 2020
తెలుగు సినిమా ఇండస్ట్రీకి కరోనా సెగ తగిలి దగ్గర దగ్గర నెల కావొస్తోంది. మార్చి 6న 'పలాస', 'ఓ పిట్టకథ', 'కాలేజ్ కుమార్', 'అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి' సినిమాలు రిలీజ్ అయ్యాయి. తర్వాత వారం చెప్పుకోదగ్గ సినిమాలు రాలేదు. కరోనా తీవ్రత పెరగడంతో పెద్ద సినిమాలు వాయిదా పడ్డాయి. షూటింగులు ఆగాయి. కొన్ని రోజులు సినిమా ఇండస్ట్రీ మూతపడింది. ఇప్పుడీ కరోనా సెగ తెలుగు టీవీ ఇండస్ట్రీకీ తగిలింది.
ప్రస్తుతానికి టీవీ ఇండస్ట్రీకి తగిలిన సెగ చిన్నగా ఉన్నప్పటికీ... లాక్ డౌన్ ఏప్రిల్ 14న ముగియకుండా మరికొన్ని రోజులు సాగితే సెగ గట్టిగా తగిలే అవకాశం ఉంది. అసలు విషయానికి వస్తే... టీవీ ఇండస్ట్రీ కూడా షూటింగులు ఆపేసి చాలా రోజులు అయింది. అయితే.... ఇప్పటివరకు సీరియల్స్ ప్రసారానికి పెద్దగా ఇబ్బందులు కలగలేదు. ఎందుకు అంటే... మినిమమ్ ఒక ఏడెనిమిది ఎపిసోడ్స్ ముందుగా షూటింగ్ చేసి పెట్టుకుంటారు కాబట్టి. కొంతమంది పది, పదిహేను ఎపిసోడ్స్ కూడా ముందుగా రెడీ చేసుకుని ఉంటారు.
షూటింగ్ బంద్ చేయడంతో ఐదారు, ఆరేడు ఎపిసోడ్స్ మాత్రమే బ్యాకప్ పెట్టుకున్న సీరియల్స్ కి కష్టాలు మొదలయ్యాయి. ఆ సీరియల్స్ టైమ్లో సినిమాలు గట్రా టెలికాస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. అలాగే పండగలు, పబ్బాల సమయంలో చేసిన స్పెషల్ ప్రోగ్రామ్స్ను మళ్లీ వేస్తున్నారు. మరికొందరు దూరదర్శన్ ఫార్మటులోకి వెళ్లారు. పాత సీరియల్స్ టెలికాస్ట్ చేస్తున్నారు. 'మొగలి రేకులు' రీటెలికాస్ట్ చేస్తున్నట్టు. ఇంకో నెల రోజులు లాక్ డౌన్ అయితే కొత్త సీరియల్స్ టీవీలో చూసే భాగ్యం ప్రేక్షకులకు కోల్పోయినట్టే.
Also Read