ప్రభాస్ విరాళం పెంచింది అందుకేనా?
on Mar 30, 2020
కరోనా వైరస్ వ్యాప్తితో ప్రపంచమంతా గడగడా వణికిపోతూ వస్తుండగా, దేశంలోనే కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూ కలవరాన్ని కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్లనూ, కర్ఫ్యూలను విధిస్తూ, ప్రజల కదలికలపై ఆంక్షలు విధిస్తూ రకరకాల చర్యలు చేపడుతున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వాలకు తమ వంతు చేయూత అందించేందుకు టాలీవుడ్ ముందుకు వచ్చింది. నటులు, నిర్మాతలు, దర్శకులు, ఇతర సాంకేతిక నిపుణులు.. తమకు తోచినంత విరాళాన్ని ముఖ్యమంత్రి సహాయనిధులకు ప్రకటించారు, ఇంకా ప్రకటిస్తున్నారు.
అయితే టాలీవుడ్కు సంబంధించి మెగాస్టార్లు, పవర్స్టార్లు, సూపర్స్టార్లు ఎందరో ఉండగా వాళ్లందరి కంటే ఎక్కువగా రెబల్ స్టార్ ప్రభాస్ కరోనా నిరోధానికి ఏకంగా రూ. 4 కోట్లు ప్రకటించి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసిన విషయం తెలిసిందే. మొదట ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధులకు చెరో రూ. 50 లక్షలు.. వెరసి రూ. 1 కోటి విరాళం ప్రకటించిన ఆయన ఆ తర్వాత అనూహ్యంగా ప్రధాని సహాయ నిధికి రూ. 3 కోట్లు ప్రకటించి, అందరి దృష్టినీ తనవైపు తిప్పకున్నాడు. పవన్ కల్యాణ్ రూ. 2 కోట్లు, మహేశ్, అల్లు అర్జున్ చెరొక రూ. 1.25 కోట్లు, చిరంజీవి రూ. 1 కోటి ప్రకటించిన సందర్భంలో ప్రభాస్ ఇంత మొత్తంలో విరాళం ప్రకటించడం వెనుక కారణం ఏమిటా అని కొంతమంది పరిశీలన మొదలుపెట్టారు.
'బాహుబలి', 'సాహో' సినిమాలతో వచ్చిన పాన్ ఇండియా ఇమేజ్ కారణంగానే ప్రధాని సహాయ నిధికి ప్రభాస్ రూ. 3 కోట్ల విరాళాన్ని ప్రకటించాడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దేశవ్యాప్తంగా తనకు అభిమాన గణం ఏర్పడినందున, 'సాహో' మూవీని బిహార్, రాజస్తాన్ వంటి రాష్ట్రాల ప్రజలూ తన సినిమాకు బాగా ఆదరించినందున ఆ అభిమానుల దృష్టిలో పడేందుకు కూడా ప్రభాస్ ప్రధాని సహాయ నిధికి విరాళం ఇచ్చాడని కూడా వినిపిస్తోంది. ఏమైనా.. తన విరాళంతో ప్రభాస్ 'బాహుబలి' అని నిరూపించుకున్నాడని ఆయన అభిమానులు ప్రశంసిస్తున్నారు.