'ఆచార్య' హీరోయిన్ నేనే!
on Mar 23, 2020
కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తోన్న 'ఆచార్య' మూవీలో హీరోయిన్ ఎవరనేది తేలిపోయింది. ఆయన కమ్ బ్యాక్ ఫిల్మ్ 'ఖైదీ నంబర్ 150'లో నటించిన కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో నాయికగా నటించనుంది. వాస్తవానికి 'ఆచార్య'లో హీరోయిన్గా త్రిష నటించాల్సి ఉంది. సరిగ్గా ఆమెకు సంబంధించిన సీన్ల చిత్రీకరణ మొదలయ్యే సమయానికి ఈ సినిమా నుంచి తాను తప్పకుంటున్నట్లు, ఇందుకు క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణమనీ ప్రకటించి ఆశ్చర్యపరిచింది త్రిష. ఆమె తప్పకున్న విషయం వైరల్ అయ్యాక, కాజల్ను ఈ సినిమా కోసం సంప్రదిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.
అయితే ఆమె డిమాండ్ చేసిన రెమ్యూనరేషన్తో నిర్మాతలు షాక్ అయ్యారనీ, దాంతో ఆమెకు బదులుగా అనుష్కను తీసుకోవాలని భావిస్తున్నారనీ కూడా ప్రచారంలోకి వచ్చింది. ఈలోగా కరోనా వైరస్ వ్యాప్తి దెబ్బకు థియేటర్లు మూతపడటమే కాకుండా, సినిమా షూటింగ్స్ కూడా మార్చి 31 వరకు నిలిచిపోయాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు ఆదివారం నుంచి సెల్ఫ్ క్వారంటైన్లోకి వెళ్లారు సెలబ్రిటీలు. ఈ అవకాశాన్ని వినియోగించుకున్న కాజల్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా అభిమానులతో సంభాషించింది. అందులో భాగంగా తాను చేస్తున్న సినిమాల గురించి తెలిపింది. ఈ సందర్భంగా తెలుగులో తాను 'ఆచార్య' మూవీ చేస్తున్నట్లు చెప్పింది కాజల్.
"నేను చిరంజీవి గారి 'ఆచార్య' సినిమా చేస్తున్నా. దాని కోసం ఎదురుచూస్తున్నా. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో షూటింగ్ ఆపేశారు. అలాగే తమిళంలో బృంద మాస్టర్ డైరెక్షన్లో దుల్కర్ సల్మాన్తో 'హే సినామిక' సినిమా చేస్తున్నా" అని వీడియో ద్వారా తెలిపింది. అలాగే ఆమె చేతిలో 'ఇండియన్ 2' మూవీ, కొరియన్ మూవీ 'డాన్సింగ్ క్వీన్' తెలుగు రీమేక్ ఉన్నాయి. మంచు విష్ణుతో చేసిన 'మోసగాళ్లు' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.