ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ మృతి
on Jul 2, 2020
ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ ఇకలేరు. గుండెపోటు వల్ల శుక్రవారం తెల్లవారుజామున సుమారు రెండున్నర గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు. ఆమెకు 71 సంవత్సరాలు. ఈ నెల 17న బ్రీతింగ్ సమస్యల కారణంగా ముంబైలోని గురునానక్ హాస్పిటల్ లో ఆమెను జాయిన్ చేశారు. కరోనా వచ్చిందేమో అనే అనుమానంతో టెస్టులు చేయగా, నెగెటివ్ రిజల్ట్ వచ్చింది. బ్రీతింగ్ సమస్యలకు తోడు హార్ట్ ఎటాక్ రావడంతో సరోజ్ ఖాన్ మృతి చెందారు.
సుమారు రెండువేలకు పైగా పాటలకు సరోజ్ ఖాన్ కొరియోగ్రఫీ చేశారు. బాలీవుడ్ ప్రముఖులు ఆమెను 'మాస్టర్ జీ' అని గౌరవంగా పిలుస్తారు. శ్రీదేవి, మాధురి దీక్షిత్ పాటలకు సరోజ్ ఖాన్ కొరియోగ్రఫీ తోడైతే సాంగ్ బంపర్ హిట్టే.
తెలుగులోనూ కొన్ని పాటలకు ఆమె నృత్యాలు సమకూర్చారు. చిరంజీవి హీరోగా గుణశేఖర్ డైరెక్ట్ చేసిన 'చూడాలని ఉంది' సినిమాలో చిరంజీవి, సౌందర్యపై చిత్రీకరించిన 'ఓ మారియా ఓ మారియా' పాటకు సమకూర్చిన నృత్యాలకు గాను ఆమె బెస్ట్ కొరియోగ్రాఫర్గా నంది అవార్డు అందుకున్నారు.
సరోజ్ ఖాన్ 1948లో జన్మించారు. మూడేళ్ల వయసులో చైల్డ్ ఆర్టిస్టుగా సినిమా ఇండస్ట్రీలో తొలి అడుగు వేశారు. కొరియోగ్రాఫర్ బి. సోహన్ లాల్ దగ్గర కొన్ని రోజులు పని చేశారు. 'గీతా మేరా నామ్' సినిమాతో కొరియోగ్రాఫర్ గా కెరీర్ స్టార్ట్ చేశారు. అయితే, 80-90లలో మాధురి దీక్షిత్, శ్రీదేవి పాటలకు చేసిన కొరియోగ్రఫీ ఆమెకు పేరు తీసుకొచ్చింది. కెరీర్ పీక్స్ కి వెళ్ళింది.
'మిస్టర్ ఇండియా' (1987), 'నాగిన' (1986), 'చాందిని' (1989), 'తేజాబ్' (1988), 'తానెడార్' (1990) సినిమాలలో కొన్ని మెమరబుల్ సాంగ్స్ కి సరోజ్ ఖాన్ కొరియోగ్రఫీ చేశారు. రెండేళ్ల క్రితం విడుదలైన 'కళంక్' (2018)లో మాధురీ దీక్షిత్ పాటకు కోరోయోగ్రఫీ చేశారు. 'హవా హవా', 'ఏక్ దో తీన్', 'డోలారే డోలారే', 'చాందిని', 'ధక్ ధక్ కర్ నే లాగా' పాటల్లో సరోజ్ ఖాన్ కొరియోగ్రఫీ చేసిన సిగ్నేచర్ స్టెప్స్ ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తున్నాయి. 2005-10 మధ్యలో కొన్ని టీవీ, రియాలిటీ షోలకు జడ్జ్ గా వ్యవహరించారు.
హిందీ సినిమాలు 'దేవదాస్', 'జబ్ వుయ్ మెట్', తమిళ సినిమా 'శృంగారం'లో పాటలకు మూడుసార్లు సరోజ్ ఖాన్ నేషనల్ అవార్డ్ అందుకున్నారు. ఆమెకు భర్త, ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.